
తాజా వార్తలు
19 రాష్ట్రాల్లో కరోనా మరణాలు లేవు..
కోటిన్నర మందికి వ్యాక్సిన్ పంపిణీ పూర్తి
వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: దేశంలో కరోనా కాస్త తెరిపినిచ్చింది. రోజువారీ కరోనా కేసులు, మరణాల్లో గణనీయమైన తగ్గుదల నమోదు చేస్తోంది. క్రితం రోజులో పోలిస్తే మంగళవారం 20 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. మరోవైపు గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. వీటిల్లో పశ్చిమబెంగాల్, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, బిహార్, లక్షద్వీప్, లద్దాఖ్, సిక్కిం, త్రిపుర, మణిపుర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, అండమాన్ నికోబార్ దీవులు, డయ్యుడామన్ దాద్రానగర్ హవేలీ, అరుణాచల్ ప్రదేశ్లు ఉన్నాయి. మొత్తంగా 91 మరణాలు నమోదవ్వగా మహారాష్ట్ర (30), పంజాబ్ (18), కేరళ (13) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
కొత్తగా నమోదైన కేసుల్లో 80 శాతం కేసులు 5 రాష్ట్రాల నుంచే నమోదైనట్లు వారు తెలిపారు. వాటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్ ఉన్నాయి. మరోవైపు దేశంలో రికవరీల సంఖ్య 1,07,98,921కు చేరుకోగా రికవరీ రేటు 97.07 శాతంగా ఉంది. క్రియాశీల కేసులు 1,68,358 ఉండగా ఆ రేటు 1.51గా ఉంది. యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ల సంఖ్య దేశంలో 213కి చేరింది. అందులో యూకే స్ట్రెయిన్ 187, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ 6, బ్రెజిల్ రకం ఒకరికి సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కోటిన్నర మందికి వ్యాక్సిన్..
సోమవారం నుంచి ప్రారంభించిన రెండో విడత వ్యాక్సిన్ పంపిణీ నిరాటంకంగా కొనసాగుతోంది. నిన్నటి నుంచి అరవై ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైనున్న దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు వ్యాక్సిన్ను అందిస్తున్నారు. మంగళవారం ఉదయం ఏడు గంటల వరకు కోటీ యాభైలక్షల మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్క రోజే 29 లక్షల మంది కోవిన్ పోర్టల్లో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వారు తెలిపారు.