
తాజా వార్తలు
2 గంటల్లో దెహ్రాడూన్ నుంచి దిల్లీకి
2024 నాటికి ఆరు లైన్ల రహదారి పూర్తి..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
హరిద్వార్: భవిష్యత్తులో దేశ రాజధాని దిల్లీ నుంచి దెహ్రాడూన్ వరకు కేవలం రెండు గంటల్లోనే రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించవచ్చని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు రెండు నగరాల మధ్య నిర్మాణంలో ఉన్న ఆరు వరుసల రహదారి 2024 నాటికి పూర్తవుతుందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని నాలుగు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాజధానికి వెళ్లడానికి 5 గంటల సమయం పడుతోంది. ఈ రహదారి పూర్తయితే ప్రయాణ సమయం తగ్గి రెండు గంటల్లోనే దిల్లీ నుంచి దెహ్రాడూన్కు చేరుకోవచ్చని మంత్రి వివరించారు. ఈ రెండు నగరాల మధ్య ఎక్స్ప్రెస్ వే దూరం 210 కిలోమీటర్లు కాగా, రహదారి నిర్మాణానికి రూ.13,000 కోట్లు ఖర్చవుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.