
తాజా వార్తలు
ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులకు కరోనా
చండీగఢ్: హరియాణాలోని కర్నాల్ ప్రాంతంలో ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఆ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వైద్య పరీక్షల్లో వారికి కరోనా పాజిటివ్గా సోమవారం నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి ఆయా విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు జరపగా.. 54 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో పాఠశాల వసతిగృహాన్ని మూసివేసిన అధికారులు.. ఈ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించారు.
హరియాణాలో గతేడాది డిసెంబరు నుంచి 9-12 తరగతి విద్యార్థులకు స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఇటీవల మిగతా తరగతుల వారికి కూడా ప్రారంభించారు. అయితే పాఠశాలకు హాజరవడం తప్పనిసరేం కాదు. కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసులనే కొనసాగించొచ్చని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని చోట్ల నిబంధనలు అమలు సరిగా లేకపోవడంతో స్కూళ్లు వైరస్ హాట్స్పాట్లుగా మారుతున్నాయి. గత నెల కేరళలోని మలప్పురంలో గల పాఠశాలలో 192 మంది పదో తరగతి విద్యార్థులకు వైరస్ సోకిన విషయం తెలిసిందే.