
తాజా వార్తలు
కరోనా మరణాలు@113
16,838 కొత్త కేసులు..1.58 శాతానికి క్రియాశీల రేటు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఒకవైపు, దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతుండగా..మరోవైపు, కొత్త కేసులు 17వేలకు చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం 7,61,834 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..16,838 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,73,761కి చేరుకుంది. మూడు రోజుల అనంతరం తాజాగా మరణాల సంఖ్య 100 దాటింది. గడిచిన 24 గంటల్లో 113 మంది వైరస్కి బలయ్యారు. ఇప్పటివరకు 1,57,548 మంది ప్రాణాలు వదిలారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక, క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో 1,76,319 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.58 శాతానికి చేరింది. రికవరీరేటు 97.01 శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 13,819 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారని, మొత్తంగా 1.08కోట్ల పైచిలుకు మంది వైరస్ నుంచి బయటపడ్డారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం మార్చి ఒకటిన రెండో దశలోకి అడుగుపెట్టింది. మార్చి 4నాటికి 1,80,05,503 మంది టీకా వేయించుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 13,88,170 మంది టీకా తీసుకున్నారు.