
తాజా వార్తలు
దేశంలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు!
దిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 7.37లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. 18,711 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,10,799 కి చేరింది. కొత్తగా 14,392 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,08,68,520కు చేరి.. రికవరీ రేటు 96.95 శాతానికి తగ్గింది.
ఇక మరణాల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,57,756కి చేరింది. మరణాల రేటు 1.41 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,84,523 ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14లక్షల మంది టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం టీకా అందిన వారి సంఖ్య 2,09,22,344కి చేరింది. ఇటీవల రెండో దశ టీకా ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.