
తాజా వార్తలు
21 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్
వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: గడచిన 24 గంటల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. గత కొన్ని రోజులుగా దేశంలో కేసుల సంఖ్య పెరగటం, రికవరీల్లో తగ్గుదల కనిపించడం ఆందోళన కల్గించింది. కానీ తాజా గణాంకాలు కరోనా కట్టడిని సూచిస్తున్నాయి. పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5లోపు మరణాలు, రెండు రాష్ట్రాల్లో పదిలోపు, 3 రాష్ట్రాల్లో 20 లోపు మరణాలు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం క్రియాశీల కేసులు 1,50,055 ఉండగా, మంగళవారానికి ఆ సంఖ్య 1,47,306కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే 25శాతం తక్కువ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా రికవరీల సంఖ్య 1,07,12,665కు చేరింది. రికవరీ రేటు 97.24శాతంగా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో 84శాతం ఆరు రాష్ట్రాల నుంచే నమోదైనట్లు వారు తెలిపారు. మహారాష్ట్ర (5,210), కేరళ (2,212), తమిళనాడు (449) మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరణాల్లో మహారాష్ట్ర (18), కేరళ (16), పంజాబ్(15) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని తెలిపారు.
మంగళవారం ఉదయం 8 గంటల వరకు 1,17,45,552 మందికి వ్యాక్సిన్ను అందించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 1,04,87,375 మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు మొదటి డోసు, 12,58,177 మందికి రెండో డోసు అందించామన్నారు. వ్యాక్సిన్ పంపిణీలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. వ్యాక్సిన్ మొదటిడోసు తీసుకొని 28 రోజులు పూర్తి చేసుకున్న వారికి ఫిబ్రవరి 13 నుంచి రెండో డోసు అందిస్తున్నారు. 38వ రోజు వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా 3,38,373 మందికి మొదటి డోసు, 2,90,323 మందికి రెండో డోసును అందించామని వారు తెలిపారు.