
తాజా వార్తలు
ఇంటర్నెట్డెస్క్: చైనాకు చెందిన అతిపెద్ద ఎస్యూవీ ఉత్పత్తి సంస్థ ‘గ్రేట్ వాల్ మోటార్స్’ భారత్లోకి నేరుగా ప్రవేశించేందుకు యోచిస్తున్నట్లు సమచారం. ఈ మేరకు భారత్లో రూ.7000కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. భారత ఆటో రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో గ్రేట్ వాల్ నిర్ణయం పట్ల విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘హవల్ మోటార్ ఇండియా’ పేరిట ఈ సంస్థ అక్టోబరుకు ముందే భారత్లో నమోదు చేసుకుంది. అయితే ఇటీవల ఉద్దీపన చర్యల్లో భాగంగా కొత్త సంస్థలకు కేంద్రం కార్పొరేట్ పన్ను తగ్గించి 15శాతంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అక్టోబరుకు ముందే భారత్కు వచ్చిన కారణంగా తాజా తగ్గింపు హవల్ మోటార్స్కు వర్తించదు. ఈ నేపథ్యంలో కొత్తగా సొంత పేరుతోనే వచ్చేందుకు గ్రేట్ వాల్ మోటార్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
భారత్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు గ్రేట్ వాల్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. డిసెంబరు మొదటి వారంలో భారత్లో పెట్టుబడులపై చర్చించేందుకు ప్రధాని మోదీతో గ్రేట్ వాల్ సీఈవో వే జియాన్జున్ అపాయింట్మెంట్ కోరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ భేటీ తరవాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. దీన్ని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో స్థలం కోసం కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే సంస్థని ఆహ్వానించేందుకు మహారాష్ట్ర ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రోత్సహకాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమైందట. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు చైనా వెళ్లి కంపెనీని ఆహ్వానించినట్లు సమాచారం. అన్ని సవ్యంగా సాగితే 2021 నాటికి ఉత్పత్తి ప్రారంభించడానికి కంపెనీ యోచిస్తోందని తెలుస్తోంది. గ్రేట్ వాల్ భారత్కి రావడం వల్ల యుటిలిటీ వాహనాల విభాగంలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.