
తాజా వార్తలు
అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ స్పందన
బెంగళూరు: కర్ణాటకలో అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో భాజపా కుట్ర బయటపడిందని కాంగ్రెస్ ఆరోపించింది. కోర్టు తీర్పుతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరు అక్రమమని తేలిందన్నారు. ‘‘కాంగ్రెస్, జేడీఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయడాన్ని కోర్టు సమర్థించింది. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో భాజపా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అక్రమమని రుజువైంది. బలనిరూపణ కోసం భాజపా రాజ్యాంగవిరుద్ధ చర్యలకు పాల్పడింది. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలి’’ అని కర్ణాటక పీసీపీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పుతో నాటి ప్రభుత్వాన్ని భాజపా కూలదోయడానికి యత్నించినట్లు స్పష్టమైందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో యడ్యూరప్ప, అమిత్ షా హస్తముందని కూడా నిరూపితమైందన్నారు. నిజంగా భాజపా విలువలు పాటించే పార్టీయే అయితే ఈ 17మందికి తాజా ఉపఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య కూడా కోర్టు తీర్పుని స్వాగతించారు. ఇకపై పార్టీ ఫిరాయించే వారికి ఇది ఒక గుణపాఠం వంటిదన్నారు.
17 మందికి టికెట్లపై పార్టీ నిర్ణయిస్తుంది: యడియూరప్ప
మరోవైపు ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా కోర్టు తీర్పుని స్వాగతించారు. అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కలిసి పన్నిన కుట్రను ఈ తీర్పును కోర్టు వ్యతిరేకించినట్లైందన్నారు. అనర్హతకు వేటుకు గురైన 17మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే అంశంపై పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ఈ ఉపఎన్నికల్లో భాజపా అన్ని స్థానాల్లో విజయం సాధించి తీరుతుందన్నారు.
కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ అప్పటి స్పీకర్ కేఆర్ రమేశ్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించిన విషయం తెలిసిందే. అయితే, 2023 వరకు వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను మాత్రం కొట్టివేసింది. దీంతో త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అవకాశమిస్తూ ఊరట కల్పించింది.