
తాజా వార్తలు
హైదరాబాద్: ‘వాల్మీకి’ టైటిల్ వివాదంపై ఆ సినిమా దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. బోయ, వాల్మీకి సామాజిక వర్గం నుంచి వ్యక్తమైన ఆందోళన నేపథ్యంలో ఇకపై ఈ సినిమా పేరును ‘గద్దలకొండ గణేష్’గా మారుస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో మీడియాతో హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. ‘వాల్మీకి’ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి కొన్ని వర్గాల వారు నిరసనలు చేపట్టారు. ఈ చిత్రంలో వాల్మీకి మహర్షి తప్పు చేసినట్లు ఎక్కడా చూపించలేదు. ఎవరైతే నిరసనను తెలియజేశారో, మనోభావాలు దెబ్బ తిన్నాయని బాధపడుతున్నారో వారు సినిమాను చూసిన తర్వాత కచ్చితంగా మమ్మల్ని మెచ్చుకుంటారనే నమ్మకంతో ఉన్నాం. అలాగే ఏమైనా అభ్యంతరాలుంటే సెన్సార్ పరిధిలోకి వస్తుందనుకున్నాం. సెన్సార్ సభ్యులు సినిమా చూశారు. వాల్మీకి మహర్షి గురించి ఎక్కడా తప్పుగా చెప్పడం కానీ.. చూపించడం కానీ లేదు కాబట్టి సమస్య పరిష్కారం అయ్యిందని అనుకున్నాం. అయితే బోయసంఘం, వాల్మీకి వర్గం వారు టైటిల్లో తుపాకీ ఉందనే అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దాన్ని మార్చాం. మొదటిసారి నేను ఓడిపోయానని అనిపిస్తోంది. ఓడిపోవడం అంటే వ్యక్తిగతంగానో, ఒక డైరక్టర్గానో, ఒక రైటర్గానో కాదు.. ఒక హైందవ సమాజానికి చెందిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి మీద ఉన్న ఒక గొప్ప గౌరవాన్ని, ఒక మంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నేను ఓడిపోయానని నాకు అనిపిస్తోంది అని అన్నారు.
‘శుక్రవారం చిత్రం విడుదల నేపథ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లా కలెక్టరేట్ల నుంచి సినిమా విడుదలను ఆపాలంటూ మాకు ఉత్తర్వులు వచ్చాయి. ఈ సమస్యను ఇంత వరకు ఎందుకు తీసుకొచ్చారనే భావన అందరి మనుసుల్లోనూ ఉంటుంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలని నేను, మా నిర్మాతలు 14-15 గంటలు పాటు నిద్రాహారాలు లేకుండా ఆలోచించాం. ఈ పరిస్థితిని కావాలనే ఎవరూ తెచ్చుకోరు. మేం ఓ మంచి టైటిల్ను పెట్టాం. ఇలాంటి టైటిల్ను పెట్టడం ద్వారా వాల్మీకి మహర్షి గొప్పతనం తెలియనివారికి కూడా తెలుస్తుందని అనుకున్నాం. రూ.30-40 కోట్లు ఖర్చుపెట్టి 200 మంది టెక్నీషియన్స్ ఈ సినిమాపై పనిచేస్తూ ఓ వ్యక్తినో, వర్గాన్నో, కులాన్నో, ఓ సంఘాన్నో విమర్శించడానికి ఈ పనిచేయలేదు. వాల్మీకి మహర్షి గురించి రెండు గొప్ప డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నా సినిమాలు చూడని మా నాన్నగారు కూడా తొలిసారి ఆయన టైటిల్ ప్రకటించగానే.. చాలా మంచి టైటిల్ పెట్టావని ఫోన్ చేశారు. సినిమా ఎలా ఉందో తెలియకుండా నేను ఎవరికీ క్షమాపణ చెప్పాలో అర్థం కావడం లేదు. ఏ జిల్లాలో ఈ సినిమాను ఆపాలని నిర్ణయం తీసుకున్నారో దాని వల్ల అక్కడ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతారు. వారికి ఎలాంటి నష్టం జరగకూడదని భావించాం. నేను ముందు ఈ దేశ పౌరుడ్ని. ఆ తర్వాతే డైరెక్టర్ని.. రైటర్ని. ఏ వ్యక్తి కూడా ప్రభుత్వానికి అతీతులు కాదని నమ్మే వ్యక్తిని నేను. సినిమాను చూడకుండా ఇంత ఇబ్బందులకు గురిచేయడమనేది చిన్న బాధను కలిగిస్తోంది. అందరికీ చెప్పేదొక్కటే.. `వాల్మీకి` టైటిల్ను గద్దలకొండ గణేష్గా పరిగణించాలని కోరుతూ టైటిల్ను మారుస్తున్నాం. ప్రచార సామగ్రి అంతా కొత్త టైటిల్తోనే ముందుకు వస్తుంది. ఎవరి మనోభావాలైతే దెబ్బతిన్నాయన్నారో వారికి నేను సవినయంగా చెప్పేదొక్కటే.. వాల్మీకి, బోయ సోదరులారా మీరు నా సినిమాను చూడాలని కోరుతున్నాను. సినిమా చూసిన తర్వాత ఏదో మూల.. వాల్మీకి మహర్షిని ఎక్కడా తప్పుగా చూపించలేదని మీ అంతరాత్మకు అనిపిస్తే నాకు అదే చాలు. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు.
మేం ఇతరులను కించపరచాలనుకోవడం లేదు..
నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ.. ‘ఓ రకంగా ఇది చాలా బాధాకరమైన విషయం. సినిమా బిజినెస్ అనేది ఓపెనింగ్స్తో ముడిపడి ఉంటుంది. భావప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కానీ మాకు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదు. సెన్సార్ బోర్డు అప్రూవ్ చేస్తే.. సినిమా చూడకుండా సినిమాను ఆపే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు ఆర్డర్ కూడా ఉంది. అయితే కొందరు వారి సెంటిమెంట్స్ను నొచ్చుకునేట్లు చేశారని అనుకుంటున్నారో వారికి ఈ సినిమా చూశాక అర్థమవుతుంది. సెన్సార్ సభ్యులు ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా టైటిల్ మార్చాల్సి వస్తోంది. మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నష్టపోకూడదని వెంటనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. మేం ఇతరులను కించపరిచి ఎంటర్టైన్మెంట్ చేయాలనుకోవడం లేదు, అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు. సినిమాలో హీరో పేరు`గద్దలకొండ గణేష్`గా టైటిల్ మార్చామన్నారు.
కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘గురువారం సాయంత్రం వరకు అసలు టైటిల్ వెనుక అర్థాన్ని వివరించడానికి ప్రయత్నించాం. కానీ కుదరలేదు. సినిమా ఇండస్ట్రీ అందరికీ అన్నం పెట్టే ఇండస్ట్రీ. అందరూ బావుండాలనే టైటిల్ను మార్చాం. గోపీ చెప్పినట్లు ఎంటర్టైన్మెంట్ రూపంలో మరొకరిని తక్కువగా చేసి చూపెట్టం’ అని అన్నారు.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, హరీశ్ శంకర్ దర్శకుడిగా 14 రీల్స్ ప్లస్ బేనర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది.