
హ్యూస్టన్: అమెరికాలో ఈ నెల 22న జరగనున్న ‘హౌదీ మోదీ’ సభలో ప్రధాని మోదీతో కలిసి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేదిక పంచుకోనున్నారని సమాచారం. ఆ దిశగా అక్కడి భారత సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్వేతసౌధం నుంచి అధికారిక ఆమోదం కోసం వేచి చూస్తున్నామని అక్కడి భారతీయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య విభేదాలకు తెరపడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారత ఎగుమతులపై సుంకాల్లో రాయితీలు కల్పించే ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ) జాబితా నుంచి మన దేశాన్ని తొలగించిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికాలో నివసించే విదేశీయుల్లో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మోదీతో వేదిక పంచుకోవడం, భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలాంటి చర్యలు.. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కి అనుకూలించే అంశంగా ఆయన సన్నిహితులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ మద్దతు కోసం పాక్ విఫలయత్నాలు చేస్తున్న వేళ.. మోదీతో ట్రంప్ వేదిక పంచుకుంటే ప్రపంచ దేశాలకు భారత్పై సానుకూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్ పదే పదే ప్రకటించిన తరుణంలో ఈ ఊహాగానాలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికాలోని భారతీయ సంఘాలు టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్లో ఈ నెల 22న భారీ సభను నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఎన్ఆర్జీ స్టేడియంలో దీనికి దాదాపు 50వేల మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. అందుకోసం భారీ ఏర్పాట్లు చేసే దిశగా ఇప్పటికే పనులు ప్రారంభించారు. అనంతరం ఈ నెల 27న ఐరాస సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు.