News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1(31-03-2023)
Updated : 31 Mar 2023 05:03 IST
1/19
అవనిగడ్డ కరకట్ట రోడ్డు దిగువన ఐలూరు, శ్రీకాకుళం ప్రాంతాల్లో కోతుల బెడద అధికంగా ఉంది. అరటి, టమాటా, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి. కొండముచ్చులకు కోతులు భయపడుతుండటంతో.. రైతులు కొండముచ్చు చిత్రాలను పొలాల్లో ఏర్పాటు చేస్తున్నారు. వాటిని చూసిన కోతులు ఇటువైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు.
2/19
అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని ఒనకఢిల్లీ వారపు సంతలో గురువారం ఇటలీ దేశ పర్యటకులు సందడి చేశారు. వారపు సంతలో బోండా, గదబ గిరి మహిళల వేషధారణ పరిశీలించడానికి విదేశీ పర్యటకులు వస్తుంటారు. గురువారం శ్రీరామనవమి కావడంతో విదేశీ పర్యటకులు ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొని విశిష్టత తెలుసుకున్నారు
3/19
తూర్పు గోదావరి జిల్లా కడియపు లంకలోని పచ్చని విరివనాల్లో డాల్ఫిన్ ఆకారంలో మామిడికాయ ఇలా కనువిందు చేస్తోంది. దీన్ని చిలకముక్కు మామిడి అని పిలుస్తారని స్థానిక రైతు కుప్పాల దుర్గారావు చెప్పారు. దీనికి సంబంధించిన తల్లి చెట్టు నుంచి అంటు మొక్కలను ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు.
4/19
తీర ప్రాంత రక్షణ, నావికాదళ ప్రత్యేకతలపై వివరించేందుకు కార్ల ర్యాలీ చేపట్టిన 36 మందితో కూడిన బృందం గురువారం విశాఖకు వచ్చింది. తూర్పు నావికాదళ ముఖ్య అధికారులు వీరి చొరవను అభినందించారు.
5/19
విశాఖపట్నం-ఆనందపురం రోడ్డులో వేములవలస సమీపంలో ఓ ప్రైవేటు అతిథిగృహాన్ని పసుపు పూలు దట్టమైన పైకప్పులా అల్లుకున్నాయి. తీగజాతికి చెందిన మొక్కలు మొన్నటి వరకు ఆ అతిథి గృహం అంతటా పెరిగి పచ్చగా ఉండగా.. ఇటీవల ఆ మొక్కలకు పూసిన పసుపు పూలతో ఇలా ఆకర్షణీయంగా మారింది.
6/19
విశాఖ- అరకు జాతీయ రహదారిలో కొత్తవలస రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రహరీ చూపరులను ఆకట్టుకుంటోంది. రైల్వేశాఖ ఆధ్వర్యంలో ఈ గోడ పొడవునా సందేశాత్మక చిత్రాలను గీశారు. నీటి సద్వినియోగం, మొక్కల సంరక్షణ, పరిసరాల శుభ్రత తదితర అంశాలతో కూడిన బొమ్మలు ఆలోచింపజేస్తున్నాయి.
7/19
వేసవి ఎండలు మండిపోతుండడంతో గ్రామాల్లో చిన్నారులకు సైతం నీటి కష్టాలు తప్పడం లేదు. కర్నూలు జిల్లాలోని మద్దికెరలో గురువారం తోపుడు బండ్లలో నీటి బిందెలు, క్యాన్లతో చిన్నారులు ఇలా కష్టపడుతూ కనిపించారు. పెద్ద వాళ్లకు బదులుగా బాలబాలికలే నీటి కోసం ఇలా ఇబ్బందులకు గురవుతున్నారు.
8/19
నీటిలో బోటు షికారు అంటే అందరికీ ఇష్టమే. ఏమరుపాటు వహిస్తే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. గురువారం సెలవు రోజు కావడంతో పర్యాటక ప్రాంతమైన వరంగల్ జిల్లాలోని ఖిలావరంగల్ కోటను తిలకించేందుకు పర్యాటకులు తరలివచ్చారు. మధ్యకోట ఏకశిల చిల్డ్రన్స్ పార్క్లోని గుండు చెరువులో ఉత్సాహంగా పర్యాటకులు బోటు షికారు చేశారు. ఎటువంటి రక్షణ జాకెట్లు ధరించకుండా నీటిలోకి వెళ్లడం ప్రమాదకరం. తగిన రుసుం వసూలు చేస్తున్న నిర్వాహకులు ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోకపోవడం శోచనీయం.
9/19
వరంగల్ జిల్లాలోని ఖిలావరంగల్ మధ్యకోట ప్రధాన రోడ్డు కల్లంగా మారింది. స్థానిక రైతు తడిచిన మక్కలను రోడ్డుపై ఆరబెట్టేందుకు ఇలా రోడ్డుకు ఓ వైపు మూసివేశారు. ఆ తరువాత మార్కెట్కు తరలించాల్సిన బస్తాలను సైతం అక్కడే రోడ్డుపైనే నిల్వ చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఒకే వైపు రోడ్డుపై రాకపోకలు సాగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
10/19
ప్రతికూలతలను అధిగమిస్తే విజయం తథ్యమనేందుకు నిదర్శనమీ దృశ్యం. నరికేసిన చెట్టు వాడిపోయింది. పడిపోయేలా మారింది. అయినా కొంతకాలనికి చిగురించి కొత్త జీవం పోసుకుంటోంది.నిర్మల్ జిల్లా కేంద్రం శివారులో సెయింట్ థామస్ పాఠశాల సమీపంలో కనిపించిన చిత్రమిది.
11/19
హైదరాబాద్లోని నార్సింగి మైహోం అవతార్ నుంచి కోకాపేట సర్వీసు రోడ్డు మార్గాన్ని ఇటీవల విస్తరించారు. రోడ్డు విభాగినుల మధ్య ఆకట్టుకునే వివిధ ఆకృతులు ఏర్పాటు చేశారు. అందులో ఒకప్పటి నాణేలైన పైసా, నయా పైసా, 2 పైసల నాణేలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పలువురు అక్కడ ఆగి వాటిని తమ చరవాణి కెమెరాల్లో బంధిస్తూ ఆనందిస్తున్నారు.
12/19
పక్షులు, నెమళ్లు, అడవి పందులు దాడి చేశాయంటే ఎలాంటి పంటలైనా దిగుబడి అమాంతం తగ్గిపోతుంది. ప్రత్యేకించి నగర శివారు ప్రాంతాల్లో నెమళ్ల గుంపు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. గత 15 ఏళ్లుగా 7 ఎకరాల్లో ద్రాక్ష సాగుచేస్తున్న రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం తుక్కుగూడకు చెందిన అంజిరెడ్డి పక్షుల దాడి నుంచి ద్రాక్ష తోటలను కాపాడుకోవడానికి పైన సన్నని వలని ఏర్పాటు చేయడంతో నష్టం పూర్గిగా తగ్గిందని చెబుతున్నాడు.
13/19
కొన్ని కార్పొరేట్ ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు పరీక్షలు పూర్తిచేసి, నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని విద్యా సంస్థలు నూతన పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు సందేశాలు పంపాయి. దాంతో వారు పుస్తకాలు, విద్యా సామగ్రి కొనేందుకు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. హైదరాబాద్లోని నాచారంలో ఓ పుస్తకాల దుకాణం వద్ద కనిపించిందీ చిత్రం.
14/19
శ్రీరామనవమి సందర్భంగా ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య సరయూ నదిలో గురువారం పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు
15/19
సర్ఫింగ్ చేసుకుంటూ సముద్రపు అలలపై దూసుకెళుతున్న ఈ వృద్ధుడి పేరు సీచీ సానో. జపాన్లోని ఫుజిసవా నగరానికి చెందిన ఈయన వయసు 89. ఈ ఏడాది ద్వితీయార్థంలో 90వ పడిలోకి ప్రవేశించనున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో సర్ఫింగ్ చేస్తున్న అత్యధిక వయస్కుడిగా సీచీకి గిన్నిస్ రికార్డు దక్కింది.
16/19
ఆస్కార్ పురస్కారాన్ని సాధించిన భారతీయ లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాత గునీత్ మోంగా, దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్లు గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారికి అభినందనలు తెలిపారు.
17/19
సాధారణంగా ఒక గబ్బిలం కనబడితేనే ఆశ్చర్యంగా చూసే రోజులివి. అలాంటిది ఒకేచోట వేల సంఖ్యలో అవి తారసపడితే ఎలా ఉంటుందో ఆలోచించండి.. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం రాంపూర్లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మర్రి చెట్టుని వేలాది గబ్బిలాలు ఆవాసం చేసుకున్నాయి.
18/19
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న డా.బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం పనులు తుది దశకు చేరాయి. రాజ్యాంగ నిర్మాత జయంతి రోజైన ఏప్రిల్ 14న ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వీలుగా మిగిలిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఏప్రిల్లోనే నూతన సచివాలయాన్ని కూడా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి చూసినప్పుడు.. తుది మెరుగులు దిద్దుకుంటున్న సచివాలయ సముదాయం, పక్కనే అంబేడ్కర్ విగ్రహం, వెనుక బిర్లా టెంపుల్ ఇలా కనిపించాయి.
19/19
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూర్ పరిధిలోని వాగులో.. సమీప రైతులు 30 వరకు బోరుబావులు ఏర్పాటు చేసుకున్నారు. వీటి నుంచి సుమారు 100 ఎకరాల్లో వరిపంటకు నీటి తడులు అందిస్తుంటారు. వాస్తవానికి ఈ రైతులకు వారి పొలాల్లో బోరుబావులు ఉన్నాయి. ఏటా యాసంగి చివరిదశలో అక్కడ భూగర్భజలాలు ఎండిపోయి.. బోర్లు వట్టిపోతుండటంతో.. చెక్డ్యాం దిగువన వాగులో ఇలా ఏర్పాటు చేసుకున్నారు.