News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 01(17-04-2023)
Updated : 17 Apr 2023 10:19 IST
1/21
విక్రమ్ కథానాయకుడిగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తంగలాన్'. మాళవిక మోహనన్ కథానాయిక. హీరో విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా మేకింగ్ విజువల్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ను చూసి అభిమానులు శుభాకాంక్షలు తెలపుతున్నారు.
2/21
ఎం.ఎస్ శ్రీపతి దర్శకత్వంలో క్రికెటర్ ‘ముత్తయ్య మురళీధరన్’ బయోపిక్ తెరకెక్కుతోంది. మధుమిట్టల్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది.
3/21
అమరావతిలోని బాపట్ల బీచ్లో సముద్రస్నానానికి దిగిన యువత కొందరు తమ సంతోషాలను సెల్ఫోన్లలో బంధించుకుంటున్నారు. సెల్ఫీలు దిగడం కోసం కెరటాల మధ్యలో లోతుకు వెళ్లిపోతూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సంతోషం కన్నా ప్రాణాలు ముఖ్యమని గుర్తించాలి.
4/21
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ప్రాంతాన్ని ఆదివారం నాడు సముద్రపు తేమ గాలి కమ్మేసింది. ఉదయం, సాయంత్రం సమయాల్లోనూ ఇదే పరిస్థితి. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మండుతున్న ఎండల కారణంగా సందర్శకులు అధిక సంఖ్యలో తీరంలో సేదతీరారు.
5/21
అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని మన్యంలో ఆదివారం సుమారు 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలం చినరేలంగిపాడులో వడగళ్ల వాన కురిసింది.
6/21
కొలనులో పచ్చటి ఆకులు, మధ్యమధ్యలో తెల్లటి పూలతో చూడటానికి ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం పర్యావరణ హితం అనుకుంటే పొరపాటే. నీటి ప్రవాహాన్ని అడ్డుకునే గుర్రపుడెక్క ఇది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల సమీపంలోని రంగనాయకస్వామి ఆలయ పరిసరాల్లో ఇలా దట్టంగా పెరిగింది.
7/21
సిద్దిపేటలో ఆదివారం రాత్రి మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ సందర్భంగా వివిధ రకాల పండ్లతో డైనింగ్ టేబుల్ను ఆకట్టుకునేలా అలంకరించారు
8/21
పల్లెసీమలు ప్రకృతి అందాలకు నిలయాలు.. చెట్టు, పుట్ట, గుట్ట, లోయలు, సెలయేరులు.. ఇలా ఏదీ చూసినా వివిధ ఆకృతులతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రయాణికులను ఆనందడోలికల్లో ముంచుతాయి. అదే విధంగా వికారాబాద్ జిల్లాలోని ధారుర్ సమీపంలోని రహదారిలోని ఓ పొలం వద్ద ఇప్పచెట్లు మూడురంగుల్లో మురిపిస్తున్నాయి.
9/21
వేసవిలో ప్రజలతోపాటు మూగజీవులు నానా ఇబ్బందులు పడుతున్నాయి. శనివారం ఎండలు బాగా కాయడంతో పాలిచ్చే పశువులకు చల్లదనం కోసం వాటిని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో పాతిన ఓ ఖాళీ స్తంభానికి కట్టేశాడు రైతు ఖాజా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో తిరిగిన పశువులు చల్లగుండాలని, అవి బయటికి రాకుండా ఇలా కట్టేశానన్నాడు.
10/21
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి శివారులోని ఓ రైతు పొలంలో కనిపించిన దృశ్యమిది. సంగారెడ్డి నుంచి వికారాబాద్ జిల్లా మైతాప్ఖాన్ గూడెం వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న పొలంలో ఈ పూలు వాహనదారులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటోంది.
11/21
చిత్రంలో కనిపిస్తున్న దొండకాయకు మామిడి మొక్క మొలిచింది! యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లెవాడ గ్రామానికి చెందిన కళ్లెం ముత్తిలింగం ఇంటి ఆవరణలో ఉన్న దొండ తీగకు కాసిన దొండకాయకు మామిడి మొక్క మొలవడంతో గ్రామస్థులు ఆశ్చర్యంగా తిలకిస్తూ చరవాణిలో ఫొటోలు తీసుకొంటున్నారు. దొండ తీగ పాతినప్పుడు భూమిలో మామిడి తొక్క ఉండటం వల్ల ఇలా కాయొచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా ఏరువాక శాస్త్రవేత మధుశేఖర్ తన అభిప్రాయాన్ని తెలిపారు.
12/21
యాదాద్రి జిల్లా రాజపేట మండల పరిషత్తు కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న హరితాదేవి వేసవిలో పక్షులకు దాహార్తి తీర్చుతూ మానవత్వం చాటుతున్నారు. 20 మట్టి పాత్రలు తెప్పించి కార్యాలయం ప్రహరీపై పెట్టి తానే స్వయంగా వాటిలో నీరు పోస్తున్నారు. పక్షుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను స్థానికులు అభినందిస్తున్నారు.
13/21
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాయి దేవత ఆలయం వెనుక తెల్లమద్ది చెట్టు నిండా గబ్బిలాలు ఉన్నాయి. వీటి మధ్య తేనెతుట్టెలు ఉన్నాయి. చెట్టు నిండా ఉండటంతో ఇంద్రాయి దేవత పూజలకు వచ్చే గిరిజనులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. తమ చరవాణుల్లో చిత్రాలను తీసుకుంటున్నారు.
14/21
హైదరాబాద్లోని ఎంజే మార్కెట్ లోపల మురుగు పొంగుతుంది. 15 రోజుల నుంచి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. తాగునీటి నాలాలోనూ మురుగు కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ఇటీవలె పునరుద్ధరణ పనులు చేపట్టారు. కానీ, అప్పుడే మురుగు నీరు దర్శనమిస్తోంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
15/21
హైదరాబాద్లోని సాగర్రింగ్ రోడ్డులోని అక్షర ఇంటర్నేషనల్ పాఠశాలలో నైట్ క్యాంప్లో భాగంగా విద్యార్థులకు క్రీడలు, సంగీత సాహిత్యం, నృత్యాలతో పాటు పలు రకాల వృత్తులపై అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
16/21
హైదరాబాద్లోని కేపీహెచ్బీలో ఏర్పాటైన ఓరాఫో నగల దుకాణాన్ని ‘బలగం’ నటీనటులు కావ్య, ప్రియదర్శిలు ఆదివారం ప్రారంభించారు. షోరూంలోని పలు రకాల ఆభరణాలు ధరించిన కావ్య సందడి చేశారు.
17/21
హైదరాబాద్లోని ఏఎస్రావునగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ లెగసీ జువెలరీ స్టోర్ను ఆదివారం నటి శ్రీలీల ప్రారంభించారు. సరికొత్త డిజైన్ల నగలను ధరించి మురిసి పోయారు.
18/21
అసలే సెలవురోజు.. అందులో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. ఇంకేముంది హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డుకు నగరవాసులు క్యూకట్టారు. మహా ప్రతిమ వద్ద సెల్ఫీలు దిగారు. దీంతో ఈ దారిన ట్రాఫిక్ స్తంభించి ఇబ్బందులు తప్పలేదు.
19/21
వారాంతాన హైదరాబాద్లోని సాగర్ పరిసరాలు సందర్శకులతో కిక్కిరిశాయి. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ట్యాంక్బండ్పై భారీగా స్తంభించిన వాహనాలివి.
20/21
విశాఖలో ఆదివారం ఒకే వేదికపై 102 జంటలకు షష్టిపూర్తి మహోత్సవం జరిపించారు. వాసవీ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకకు విశాఖ సిరిపురం బాలల ప్రాంగణం వేదికైంది. వృద్ధ దంపతులు పట్టువస్త్రాలు ధరించి, నుదుట కల్యాణ తిలకం దిద్దుకొని వేదిక మీదకు రాగా.. పండితులు పెళ్లి క్రతువు నిర్వహించారు.
21/21
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా వేకువజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి నిత్యారాధనలు నిర్వహించారు. ఆలయ మహాముఖ మండపంలో యజ్ఞ మూర్తులకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. దైవదర్శనం కోసం భక్తులు 3 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. ఎండ ప్రభావంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు