News In Pics: చిత్రం చెప్పే సంగతులు
Updated : 21 May 2022 11:39 IST
1/30
హైదరాబాద్ మహా నగరంలో వాహన కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా పాత వాహనాల నుంచి వెలువడే పొగతో రోడ్లు మసకబారి పోతున్నాయి. మూసారాంబాగ్ కూడలిలో సిగ్నల్ పడడంతో అక్కడే ఆగిన ఓ ఆటో నుంచి వెలువడుతున్న పొగతో ద్విచక్రవాహనదారుడి అవస్థను చిత్రంలో చూడొచ్చు.
2/30
కూకట్పల్లి వైజంక్షన్లో మూసాపేట నుంచి కూకట్పల్లి వైపు వచ్చే ఫ్రీ లెఫ్ట్ వద్ద ప్రమాదకర పరిస్థితులున్నా ట్రాఫిక్ పోలీసులు, అధికారులు పట్టించుకోవడంలేదు. షోరూం నిర్వాహకులు రోడ్డు వరకు ర్యాంపు వేయడంతో ఎత్తుగా మారి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
3/30
రైలెక్కిన బస్సులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లో శుక్రవారం దర్శనమిచ్చాయి. చెన్నై నుంచి గూడ్స్ రైలులో నూతన బస్సులను హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ తరలిస్తుండగా ఎర్రుపాలెంలో మధ్యాహ్నం నిలుపుదల చేశారు. వీటిని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
4/30
ఊడలను చూసి ఇది మర్రిచెట్టు అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఇది వేపచెట్టే. వరంగల్ దయానంద్ కాలనీలో ఉందిది. చెట్టు పైభాగం నుంచి దిగువకు పెరుగుతూ వచ్చిన వేళ్లు.. విచిత్రంగా ఊడలుగా మారి భూమిలోకి చొచ్చుకుపోయాయి. ఈ అసాధారణ పరిణామ క్రమం గురించి డోర్నకల్ డివిజన్ ఉద్యానవన అధికారిణి అనితశ్రీని సంప్రదించగా.. ‘ప్రతి చెట్టులోనూ ఆహారాన్ని తయారుచేసుకోవటానికి కణజాల వ్యవస్థ, కాండానికి రక్షణ పొర(ఫ్లోయెమ్) ఉంటాయి. ఆకులలో తయారైన ఆహారం ఈ పొర ద్వారా వేళ్లకు చేరుతుంది. కాండం చుట్టూ ఉన్న బెరడుతో పాటు రక్షణ పొర కూడా దెబ్బతిన్నప్పుడు.. దానికి ప్రత్యామ్నాయంగా చెట్టు పైనుంచి అరుదుగా ఇలా ఊడల్లాంటి వేళ్లు పుట్టుకొస్తాయి’ అని వివరించారు.
5/30
మండువేసవి నుంచి కాసింత ఉపశమనం కలిగిస్తూ శుక్రవారం మేఘావృతమై చిరు జల్లు కురవడం.. అనంతరం వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ సమీపంలో నాట్యమాడుతున్న మయూరం.
6/30
గుంటూరు ఆర్టీవో బైపాస్ రహదారిలో లారీ ఎక్కిన రైలు పలువురిని అకట్టుకుంటోంది. బొంగరాలబీడు గోల్కొండ కోచింగ్ డిపో నుంచి గుంటూరు రైల్వేస్టేషన్కు బోగీని లారీలో రవాణా చేశారు. ఈ బోగీని క్యాంటిన్గా మార్చడానికి తరలిస్తున్నామని, త్వరలో రైల్వేస్టేషన్ అవరణలో రైలు క్యాంటిన్ ఏర్పాటుచేస్తామని అధికారులు తెలిపారు.
7/30
8/30
ఒంగోలులోని పోలీసు కవాతు మైదానం అది.. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును తీవ్రవాదులు చుట్టుముట్టి తమ స్వాధీనంలోకి తీసుకోగా ఒక్కసారిగా స్వాట్ బృందం ప్రత్యక్షమైంది. తుపాకులు గురిపెట్టి ముష్కరులతో వీరోచితంగా పోరాడి వారి పనిపట్టింది. ఇదంతా నిజంగా జరిగింది కాదు సుమా.. చిన్నారులకు అవగాహన కల్పించేందుకు వారి కళ్లకు కట్టేలా శుక్రవారం ప్రదర్శించిన విన్యాసాలివి.
9/30
సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత కారణంగా చెట్ల ఆకులు రాలి మోడువారి కనిపిస్తుంటాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తిరుపతి ఎస్వీయూ పరిపాలన భవనం ముందు ప్రధాన గేటుకు ఇరువైపులా ఉన్న చెట్లు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జూన్ 8న జరిగే స్నాతకోత్సవానికి స్వాగతం పలుకుతున్నట్లు కనువిందు చేస్తున్నాయి.
10/30
వేసవి సెలవుల కారణంగా చిన్నారులు చెరువులు, నదులలో ఈతకు వెళ్తూ నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదాల బారిన పడుతున్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులే ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. ఈ చిత్రంలో చూడండి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే బందరు కాలువలో ఒక పక్క పూడికతీత పనులు జరుగుతున్నాయి. జేసీబీల సహాయంతో కాలువ మధ్యలో పెద్దపెద్ద గోతులు తీస్తుంటే అందులో నీరు చేరి గొయ్య లోతు కనిపించడం లేదు. అలాంటి వాటిపై నుంచి చిన్నారులు ప్రమాదకరంగా దాటుతున్న దృశ్యాలివి.
11/30
ఈ చిత్రంలో దట్టమైన పచ్చని కొండలు.. వాటి మధ్య తెల్లగా అలుముకున్నది పొగమంచు అనుకుంటే పొరబడినట్లే. పోడు వ్యవసాయం పేరుతో గిరిజనులు అడవులకు నిప్పు పెట్టడంతో ఇలా పచ్చటి అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో దట్టంగా పొగ అలుముకుంటోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లే మార్గంలో లంబసింగి ఘాట్రోడ్డు దిగువన తురబాలగెడ్డ గ్రామం ఉంది. ఇక్కడ కొంత మంది గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ అడవులను తరచూ కాల్చేస్తుండటంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. అడవులను తగులబెడుతుండటం చూసి లంబసింగి పర్యాటకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
12/30
పల్నాడు జిల్లా పెదకూరపాడు నుంచి మేడికొండూరు మండలం భీమినేనివారిపాలెం (కొత్తూరు) వరకు రోడ్డు అంచుల్లో మట్టి పరచకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్టీసీ బస్సు, లోడుతో వెళుతున్న మినీ వాహనం ఎదురెదురుగా రావడంతో పక్కకు తొలగడానికి ప్రయాసలు తప్పలేదు.
13/30
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్లు శుక్రవారం గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 51వ డివిజన్లో కొండ ఎక్కాల్సి రావడంతో నాయకులు ఆపసోపాలు పడ్డారు. సుమారు 500కి పైగా మెట్లు ఎక్కాక చెమటతో తడిసిపోయారు. అలసిపోయి కాసేపు సేద తీరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రజలు మెట్ల మార్గం లేక అవస్థలు పడుతున్నామని, వర్షం పడినప్పుడల్లా కొండ చరియలు విరిగిపడుతున్నాయని ప్రస్తావించడం గమనార్హం.
14/30
ఎండలు మండుతున్న తరుణంలో శుక్రవారం హైదరాబాద్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురవడంతో జనం కాస్తంత ఉపశమనం పొందారు. మియాపూర్లో ఉన్నట్లుండి వర్షం పడడంతో పిల్లలకు తలపై వస్త్రం కప్పి తీసుకెళుతున్న తల్లి.
15/30
రహదారులపై ప్రయాణించేటప్పుడు భద్రత విషయంలో కొందరు నిర్లక్ష్య ధోరణి వీడటం లేదు. ఖైరతాబాద్ - పంజాగుట్ట మార్గంలో ద్విచక్రవాహనంపై ఓ భారీ నీటి ట్యాంకును ఇలా తరలించారు. ఏమాత్రం పట్టుతప్పినా వారితో పాటు తోటి వాహనదారులకు ప్రాణాపాయమే.
16/30
మూసాపేటలోని ఆంజనేయ నగర్లో ఉన్న ఈ బండరాయిని స్థానికులు అడ్డుగా భావించక చుట్టూ ఇళ్లు నిర్మించారు. ఇప్పుడదే ఆ ప్రాంతానికి అందంగా మారింది.
17/30
జూబ్లీహిల్స్లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ ప్రధాన రహదారికి రెండు వైపులా చెట్లు గుబురుగా పెరిగాయి. మండు వేసవిలోనూ ఈ మార్గంలో ప్రయాణించే వారికి చల్లదనం ఇస్తున్నాయి.
18/30
ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకూ అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల వద్దే ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు తూకం వేసినా.. ఆ ధాన్యం మిల్లులకు తరలించేందుకు లారీలు రాక నాలుగు రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతోంది. ఈ క్రమంలో వడ్ల బస్తాలకు చెదలు పట్టి పలువురు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ఓ రైతుకు చెందిన ధాన్యం బస్తాలకు చెదలు వచ్చి వడ్లన్నీ సంచుల్లోంచి కిందపడిపోయాయి.
19/30
అందమైన ముద్దుగుమ్మలు ర్యాంప్వాక్తో చూపరులను ఆకట్టుకున్నారు. ఓ ప్రైవేటు సంస్థ శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో నిర్వహించిన ఫ్యాషన్ షో అదుర్స్ అనిపించింది. సినీనటి ప్రగ్యాజైస్వాల్ ర్యాంప్వాక్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
20/30
గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రరీలో అక్షరాలా రెండున్నర లక్షల పుస్తకాలు ఉన్నాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో, చిన్నారుల నుంచి పీహెచ్డీ విద్యార్థులకు అవసరమైన వివిధ అంశాలపైన పుస్తకాలున్నాయి. అందులో ఎనిమిది వేలు డిజిటల్ చేసి వెబ్సైట్లో(www.sundarayya.org) ఉంచారు. కావాల్సిన వారు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోజు ఆరు వందల పేజీలు ఇక్కడ డిజిటలైజ్ చేస్తున్నారు.
21/30
22/30
సినీ నటి కీర్తిసురేష్ చందానగర్లో తళుక్కున మెరిశారు. స్థానిక గంగారం కూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన నీరూస్ స్టోర్స్ను శుక్రవారం ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
23/30
మెడ చుట్టూ ఈకల మఫ్లర్, తలపై పడగ మాదిరి ప్రత్యేకత.. ఈకల కుచ్చులతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ పక్షి ఓ పావురమే. తలపై ఈకల అమరిక ఫ్రాన్స్ దేశపు జాకోబిన్ సన్యాసులు ధరించే వస్త్రాధారణను పోలి ఉండటంతో ఈ కపోతానికి జాకోబిన్ పావురమనే పేరు వచ్చింది. దీని జన్మస్థలం భారతదేశమే. ఇవి బేలగా కన్పిస్తూ, చూపరులను ఉల్లాసపరుస్తాయని, అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తాయని జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీవశాస్త్ర సహాయ ఆచార్యులు బక్షి రవీందర్రావు తెలిపారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో ఓ పెంపుడు జంతువుల విక్రయ దుకాణంలో కనిపించిందీ విలక్షణ కపోతం.
24/30
25/30
జనసేన అధినేత, సినీనటుడు పవన్కళ్యాణ్ శుక్రవారం నగరంలో సందడి చేశారు. నల్గొండ పర్యటనకు వెళ్తూ జూబ్లీహిల్స్, మెట్టుగూడ చౌరస్తా, అల్కాపురిలో కొద్దిసేపు ఆగారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మెట్టుగూడలో అభిమానులు ఓయూ ఆర్ట్స్ కళాశాల చిత్రపటం అందజేశారు.
26/30
హైదరాబాద్లో ప్రజా రవాణా సాధనాల్లో ఆర్టీసీది అగ్రస్థానం. రద్దీ వేళల్లో ప్రధాన బస్టాపుల్లో భారీగా ప్రయాణికులు వేచి ఉంటారు. గతంలో ఉన్న బస్ షెల్టర్లు ప్రస్తుతం కన్పించడంలేదు. ఫలితంగా వేసవిలో ఎండలో మలమలమాడుతూ వేచి ఉండాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల ప్రకటనలకు పెద్దపీట వేసి, ప్రయాణికులకు కనీసం కూర్చొనేందుకు తావు లేకుండా చేశారు.
27/30
28/30
29/30
30/30
జైపుర్లో శుక్రవారం జరిగిన భాజపా జాతీయ పదాధికారుల సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు అభివాదం చేస్తున్న చిత్రమిది. ఆయన పక్కన పార్టీ తమిళనాడు సహ ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్రెడ్డి.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ