News In Pics: చిత్రం చెప్పే సంగతులు
Updated : 24 Jun 2022 11:43 IST
1/29
గ్రామీణ హస్తకళా వికాస్ సమితి ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో కొనసాగుతున్న హ్యాండ్ లూమ్ ఇండియా వస్త్ర
ప్రదర్శన చేనేతకారుల సృజనాత్మకతకు అద్దం పడుతోంది. వార్తలతో డిజైన్ చేసిన నలుపు, తెలుపు చీర వీక్షకులను ఆకట్టుకొంటోంది.
2/29
ఆలూరుకు చెందిన సావిత్రి, మహేష్ దంపతులు. నిరుపేద రైతు కుటుంబం. వీరికి ముగ్గురు సంతానం. పొలం లేకపోవడంతో ఆలూరుకు
2 కి.మీ. దూరంలోని బెళ్లిగుండు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఐదు ఎకరాల పొలాన్ని గుత్తకు తీసుకున్నారు. మూడు
రోజుల కిందట వర్షం కురవడంతో సావిత్రి పొలానికి వెళ్తూ భర్త మహేష్కు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. సావిత్రి స్వయంగా కుమార్తెను
కాడిపై కూర్చోబెట్టుకుని పొలాన్ని దున్నేశారు. కొత్తగా రెండు ఎద్దులు కొనుగోలు చేశామని.. అవి తన భర్తకు మాట వినకపోవడంతో తానే
స్వయంగా కాడి పట్టి పొలం దున్నుతున్నట్లు సావిత్రి చెబుతున్నారు.
3/29
చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బెజవాడ శ్రీనివాసరావు. నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామ వాసి. పెట్రోలు, డీజిల్ ధరలు
పెరుగుతున్న నేపథ్యంలో... తన ద్విచక్ర వాహనాన్ని ఇలా బ్యాటరీ వాహనంగా మార్చేశారు. ఇందులో వింతేముందని అనుకోకండి.
ప్రస్తుతం ఆయన వయసు 57 సంవత్సరాలు. ఈ వయసులో సికింద్రాబాద్లోని ఓ బ్యాటరీ అసెంబ్లింగ్ యూనిట్లో మూడు నెలలు శిక్షణ
తీసుకున్నారు. రూ.60వేలు ఖర్చు చేసి, ఆరు గంటలు ఛార్జింగ్ చేస్తే... నలభై కిలోమీటర్ల వేగంతో, 150 కిలోమీటర్లు మైలేజీ వచ్చేలా తన
బండిని తీర్చిదిద్దుకున్నారు.
4/29
అల్లవరం మండలం గోడితిప్పకు చెందిన కొల్లు సత్యనారాయణ తన సోదరుడు నరసింహస్వామితో కలిసి వైనతేయ వారధిలో గురువారం
ఉదయం గోడి గ్రామం సమీపంలో ములుగు వల(రంగపు వల)తో చేపల వేట చేస్తున్నారు. ఉదయమే గోదావరిలో వల వదిలి రెండు
గంటల తరువాత బయటకు తీస్తున్న సమయంలో బాగా బరువుగా అనిపించడంతో ఇద్దరూ కష్టించి బయటకు లాగారు. వలలో 100 కేజీల
బరువున్న టేకు చేప కనిపించింది. ఒడ్డుకు చేర్చి ఆటోలో అమలాపురం మార్కెట్కు తరలించగా అక్కడ వ్యాపారులు రూ.7 వేలకు
కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. గోదావరిలో టేకు చేప దొరకటం ఇదే మొదటిసారని స్థానిక మత్స్యకారులు పేర్కొన్నారు.
5/29
ఏదైనా సహజ ఆకృతికి భిన్నంగా ఉంటే ఆసక్తిగా చూస్తుంటాం. ఈ చిత్రంలో కనిపిస్తున్న మిరపకాయ కూడా అలాంటిదే. ములుగు జిల్లా
మంగపేట మండల కేంద్రంలోని శీలం సౌజన్య-రామిరెడ్డి కూరగాయల దుకాణంలో త్రిశూలం ఆకృతిలో ఉన్న మిరపకాయ లభ్యమైంది.
దీనిని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ దృశ్యాన్ని గురువారం ‘న్యూస్టుడే’ తన కెమెరాలో బంధించింది.
6/29
విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. బీచ్ తీరంలో ఆహ్లాదకర వాతావరణం
సందర్శకులను ఆకట్టుకుంది. జాలరి పేటలో కడలిపై... నగరంపై కారుమబ్బులు ఇలా కన్పించాయి.
7/29
చుట్టూ పచ్చదనం.. వాటి మధ్య నిర్మించిన కాలనీ గృహాలు అనుకుంటున్నారు కదూ.. కానే కాదు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం(వెస్ట్)లో
సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో వసతిగృహాలపై గాలి, వెలుతురు లోపలికి వచ్చేందుకు వీలుగా పైకప్పుపై నిర్మించిన
వెంటిలేటర్లు ఇవి. అమెరికా, ఆస్ట్రేలియాలో నివాసం ఉండే గార్విన్ అనే ప్రముఖ వ్యాపారవేత్త 2001లో ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు పాఠశాల
నిర్వాహకులు ఆయనను కలిసి తమ విద్యార్థులకు వసతిగృహాలు నిర్మించేందుకు సహాయం అడగ్గా, వెంటనే ఆయన అభిరుచికి తగ్గట్టు
భవనాల ప్లాన్ను సిద్ధం చేసి నిర్మించారట. ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ కొండపై నుంచి చూసినప్పుడు పైకప్పులన్నీ కాలనీలోని ఇళ్ల
మాదిరి కనిపిస్తాయని ప్రిన్సిపల్ పాల్సన్ చెప్పారు.
8/29
గుడివాడలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం వద్ద రోడ్డు పక్కగా ఉన్న నియంత్రికల కిందనే దుకాణాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ వైర్లు
కింద వేలాడుతూ ట్రాన్స్ఫార్మర్లు పక్కనే ప్రమాదకరంగా ఉన్నా రక్షణ చర్యలు లేకుండానే షాపులను పెట్టుకున్నారు.
9/29
పర్యాటకులను ఆకర్షించేందుకు రుషికొండ తీరంలో మరో క్రీడను అందుబాటులోకి తీసుకువచ్చారు. నిర్ణీత రుసుం చెల్లించిన వారిని చుట్టూ
వలలున్న ప్రదేశంలోకి పంపిస్తారు. వారికి ఆర్మీ తరహా దుస్తులు...శిరస్త్రాణాలు...మెత్తటి గుళ్లున్న తుపాకులను ఇస్తారు. గుళ్లు
అయిపోయే వరకూ పరస్పరం కాల్పులు చేసుకోవచ్చు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు డ్రమ్ములు... టైర్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నిర్ణీత సమయం పాటు సాగే ఈ క్రీడా సందడి సందర్శకులను ఆకట్టుకుంటోంది.
10/29
జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ వుడాకాలనీ రైల్విహార్ సమీపంలో ఓ ఆవు కాలువలో పడిపోయింది. రోడ్డు పక్కన గడ్డి మేస్తూ..
అదుపుతప్పి సుమారు 5 అడుగుల లోతున్న కాలువలో జారిపోయింది. స్పందించిన స్థానికులు తాళ్ల సాయంతో బయటకు లాగారు.
కాలువపై పలకలు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.
11/29
12/29
విశాఖ నగరంలోని షీలానగర్ దెయ్యాలదిబ్బ ప్రాంతంలో ఓ గెడ్డ మార్గం ఉంది. గురువారం ‘ఫోర్టు పైవంతెన’ కింద గెడ్డను కొందరు భవన
నిర్మాణ వ్యర్థాలతో కప్పేసి చదును చేస్తుండటంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా గెడ్డ ప్రాంతాలను
మూసేస్తుంటే...వర్షాకాలంలో ముంపు సమస్య తప్పదని పేర్కొంటున్నారు.
13/29
14/29
అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న జ్యువెల్లరీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు రేగి...పొగకమ్మేయడంతో ఏం జరిగిందో తెలియక
సిబ్బంది బయటకు పరుగులు తీశారు. గోపాలపట్నంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు విద్యుత్తు షార్ట్సర్క్యూట్
కారణమని చెబుతున్నారు.
15/29
ఉక్కులో భారీ యంత్రాల నడుమ ఆకస్మికంగా అగ్నిప్రమాదం జరిగితే నియంత్రణ ఎలా? అనే అంశంపై గురువారం నమూనా ప్రదర్శన
నిర్వహించారు. ఆ సమయంలో నీటిని, ఫోమ్ను ఇలా ఎగజిమ్మారు.
16/29
పల్లెల్లో వానర మూకల ఆగడాలను తట్టుకోలేక.. ప్రజలు అనుసరిస్తున్న వినూత్న మార్గాలకు నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం. యాదాద్రి
భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి మహేందర్రెడ్డి, వాణి దంపతుల ఇంటిపైన టీవీ
డీటీహెచ్(డిష్)లు రెండింటిని గతంలో కోతులు పీకేశాయి. మొదటిది దెబ్బతిన్నప్పుడు రెండోదాని రక్షణకు ఇనుప జాలీ ఏర్పాటు చేశారు.
కానీ, టీవీకి సిగ్నల్స్ రాలేదు. చివరికి డిష్ను ముట్టుకుంటే గుచ్చుకునేలా చిన్నపాటి ఇనుప మేకులను గమ్తో అంటించారు. ఇప్పుడు
సిగ్నల్స్ బాగానే వస్తున్నాయని, వానరాల బెడద తప్పిందని ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
17/29
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ‘వైఎస్సార్ పింఛను కానుక’ నగదు... ఇకపై ప్రత్యేక కవర్లలో లబ్ధిదారుల చేతికి అందనుంది. వైకాపా
జెండా రంగులతో సిద్ధం చేసిన కవర్పై సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రంతోపాటు ‘అవ్వా తాతలకు, అక్కచెల్లెమ్మలకు ప్రేమతో.. మీ కుటుంబ
సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి’ అని ముద్రించారు. ఈ కవర్లు ఇప్పటికే విశాఖ నగర వ్యాప్తంగా అన్ని జోన్ల కార్యాలయాలకు
చేరుకున్నాయి. జులైలో కొత్తగా మంజూరైన పింఛన్లు ఇందులో ఇవ్వనున్నట్లు జీవీఎంసీ యూసీడీ విభాగం అధికారులు తెలిపారు.
18/29
రోజూ కూరగాయలతో కరీంనగర్ మార్కెట్కు ఓ చిన్న కారు వస్తుంది.. దాని లోపల.. పైన బుట్టలతో కూరగాయలు నిండి ఉంటాయి. కారు వచ్చి ఆగగానే చిరు విక్రయదారులు దాని చుట్టూ చేరిపోతారు. తాజా కూరగాయల బుట్టలు తీసుకొని వెళ్ళిపోతారు. నిమిషాల్లో కారు ఖాళీ అవడంతో ఇంటికి తిరుగు ప్రయాణమవుతాడు చిగురుమామిడి మండలం గొగిరెడ్డిపల్లికి చెందిన రైతు నర్సింహారెడ్డి. 4 ఎకరాల్లో ఆయన కూరగాయలు పండిస్తున్నారు. ఏడాది పొడవునా సాగుచేస్తుంటారు. లాభం కూడా బాగానే వస్తుందని చెబుతున్నారు.
19/29
జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త, పాత బస్టాండు ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కోసం వినూత్న రీతిలో చెత్తబుట్టలను బల్దియా ఏర్పాటు చేసింది. ప్లాస్టిక్ బాటిల్ ఆకారంలో చెత్తబుట్టలు ఉండటంతో, వాటిని ఇట్టే గమనించిన ప్రయాణికులు, అందులో విడిగా ప్లాస్టిక్ వ్యర్థాలను వేస్తుండటం విశేషం.
20/29
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకోవడంతో ప్రవేశాల సందడి నెలకొంది. తల్లిదండ్రులు వచ్చి పిల్లలను బడుల్లో చేర్పించి వెళుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తన కుమార్తెను చేర్పించేందుకు వచ్చిన ఓ మాతృమూర్తి తనకు చదువు రాకపోవడంతో వేలి ముద్ర వేయడం ద్వారా ఆ బాలిక ప్రవేశానికి ఆమోదముద్ర వేసింది.
21/29
చాదర్ఘాట్ అజంపుర కొత్త వంతెన వద్ద నాలా పక్కన గ్రిల్స్ ఖాళీగా ఉన్న ప్రదేశంలో వ్యర్థాలు కుప్పలుగా వేసిన చిత్రమిది. సమీపంలోనే నాలా గోడపై వరద తీవ్రత తెలిపే స్కేల్ ఉంది. చెంతనే పిచ్చిమొక్కలు, పూడిక విపరీతంగా కనిపిస్తున్నాయి. వరుణుడు ఉరమక ముందే పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరముంది.
22/29
హైదరాబాద్లోని చైతన్యపురి నాలా విస్తరణ పనులు గురువారం మొదలయ్యాయి. గత సంవత్సరం వరదలకు ఇక్కడి నాలా నీరు రోడ్లను ముంచెత్తింది. అప్పట్లోనే చేపట్టాల్సిన విస్తరణ పనులు ఇప్పుడు వానాకాలంలో మొదలుపెట్టారు. ప్రధాన రహదారికి సగానికి అడ్డంగా బారికేడ్లు పెట్టడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
23/29
హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి వెంట పహాడిషరీఫ్ వద్ద ప్రధాన రహదారి విభాగినిపై మొక్కలు నాటే పనులు సాగుతున్నాయి. ఇలాంటి చోట వాహనదారులను అప్రమత్తం చేసేలా ఎర్ర జెండా ఉపయోగించడం పరిపాటి. ప్రత్యేకంగా ఎర్రజెండా ఎందుకనుకున్నారేమో.. ఇక్కడి కార్మికులు ఇలా ఓ పార్టీ జెండాను అందుకు ఉపయోగిస్తున్నారు.
24/29
యూసుఫ్గూడ-రహమత్నగర్ ప్రధాన రహదారి దుస్థితి ఇది. రోడ్డు నిర్మాణానికి తవ్వి పదిరోజలు దాటినా పనులు ప్రారంభించలేదు. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలకు నీరు నిలిచి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
25/29
ప్లాస్టిక్తో కలుగుతున్న అనర్థాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేలా ఖైరతాబాద్ ప్రధాన రహదారిలోని ఫ్యూజ్ బాక్స్లపై వేసిన చిత్రాలు ఆలోచింప చేస్తున్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, వ్యర్థాల బారిన పడి తన పిల్లలు చనిపోకుండా గొడుగును అడ్డుపెట్టి తీసుకెళుతున్న తల్లి చేప చిత్రం ఆకట్టుకుంటోంది.
26/29
జడను తలపిస్తూ 2 అడుగుల గడ్డంతో కనిపిస్తున్న ఈయన పేరు హిమాలయ బాబా. తిరుమల హథీరాంజీ మఠంలో ఉంటున్నారు. స్వస్థలం ప్రకాశం జిల్లా ఉలవపాడు. 13 ఏళ్లుగా తిరుమలలో శ్రీవారి సేవ చేస్తున్నారు. మఠంలో ఉంటూ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పదార్థాలతో స్వామికి నైవేద్యాలు తయారు చేస్తారు. శ్రీవారిసేవలో చేరే కంటే ముందు హిమాలయాల్లో తపస్సు చేసినట్లు బాబా తెలిపారు. అప్పటి నుంచే గడ్డం పెంచుతున్నట్లు వివరించారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి రూరల్ మండలం వకుళామాత అమ్మవారి మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని తిలకించడానికి బాబా రాగా.. భక్తులు, స్థానికులు పొడవాటి గడ్డాన్ని ఆసక్తిగా తిలకించారు.
27/29
కొందరు కుడి చేయి ఉపయోగించి చిత్రాలను గీస్తారు. మరి కొందరు ఎడమ చేతిని ఉపయోగిస్తారు. రెండు చేతులనూ ఉపయోగించే వారిని అత్యంత అరుదుగా చూస్తుంటాం. అలాంటిది లిబియాలోని బెంఘాజీ పట్టణానికి చెందిన మహ్మద్ మహ్మౌద్ అనే ఈ కళాకారుడు మాత్రం రెండు చేతులూ, రెండు కాళ్లను ఉపయోగించుకుని ఏకకాలంలో ఇలా నాలుగు చిత్రాలను గీస్తున్నారు.
28/29
జూబ్లీహిల్స్లోని నార్నె రోడ్డులో న్యాయవిహార్ ఎదుటరోడ్డు మధ్యలో నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసి తల్లిదండ్రులు, పిల్లల బొమ్మలు చూపరులను ఆకర్షిస్తున్నాయి.
29/29
ఇటీవల వర్షాలకు మూసీలో చేరిన నీరు రసాయన, ఇతర వ్యర్థాలతో కలిసి పరవళ్లు తొక్కుతోంది. హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి మధ్య ఉన్న కాలువలో మురుగు నీరు కాలుష్యపు నురుగుతో కలిసి ప్రవహిస్తున్న చిత్రమిది.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్