News In Pics: చిత్రం చెప్పే సంగతులు
Updated : 06 Jul 2022 11:10 IST
1/24
పాఠశాలలు తెరుచుకున్నాయి. మంగళవారం ఎటుచూసినా విద్యార్థుల సందడి కనిపించింది. ఒంగోలు నగరంలోని కర్నూల్ రోడ్డులో ఓ తండ్రి రిక్షాపై తన కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్తూ ఉదయం 9 గంటల సమయంలో కనిపించారిలా.
2/24
బాబూధర్మం, అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అంటూ వినూత్న రీతిలో తెనాలికి చెందిన గోపిరెడ్డి యాచించడం చూసినవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంగళగిరి అంబేడ్కర్ బొమ్మ కూడలిలో మంగళవారం ఉదయం టీవీఎస్ మోపెడ్పై మైక్ ఏర్పాటు చేసుకుని రికార్డు ద్వారా ధర్మం చేయమంటూ యాచిస్తూ కనిపించాడు. చూసిన వారు రోజులు మారాయి ధర్మం చేయమని నోటితో అడిగే కాలం చెల్లింది అంటూ నవ్వుకుంటూ వెళ్తున్నారు. నంద్యాల అడవుల్లో వైద్యానికి సంబంధించి మూలికల కోసం వెళ్లినప్పుడు కాలిలో ముళ్లు దిగాయి. అదికాస్తా సెప్టిక్ కావడంతో మోకాలి వరకు పుండ్లు పడి నడవలేని పరిస్థితి వల్ల యాచిస్తున్నట్లు చెప్పారు.
3/24
సూర్యలంక తీరంలో నల్ల ఉల్లంకి పిట్టలు సందడి చేస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఉత్తర భారతదేశం నుంచి ఈ పక్షులు ఏటా జులై, ఆగస్టులో బాపట్ల జిల్లా తీరానికి వలస వస్తాయని పర్యావరణవేత్త రమణ తెలిపారు. సూర్యలంక చప్టా వద్ద పర నీటిలో ఆహారం కోసం అన్వేషణలో ఉన్న నల్ల ఉల్లంకి పిట్టలను తన కెమెరాలో బంధించారు.
4/24
5/24
200 టన్నులకు పైగా బరువు ఉండే ఓ యంత్రాన్ని మధ్యప్రదేశ్ భూపాల్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇంత పెద్ద యంత్రం తరలించాలంటే భారీ వాహనం అవసరమే. 170 టైర్లతో కూడిన ఓ లారీపై యంత్రాన్ని ఉంచి జాతీయరహదారి గుండా తీసుకెళ్తున్నారు. వాహన చోదకులు విశ్రాంతి తీసుకోవడానికి ఆదిలాబాద్ సమీపంలో లారీని నిలిపి ఉంచిన సమయంలో తీసిన చిత్రమిది.
6/24
ట్రాక్టర్కు ట్రాలీకి బదులుగా ఎడ్లబండిని కట్టుకుని, మరో ట్రాక్టర్లో నిండుగా కూర్చుని వాగులు దాటుతున్న వీరంతా.. మండలంలోని ఇస్లాంపూర్ గిరిజనులు. ఆ ఊరికి రహదారి వసతి లేదు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ నుంచి అటవీమార్గంలో 9కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ గ్రామం వస్తుంది. ఆషాఢ మాసంలో కవ్వాల్ పోచమ్మతల్లి ఆలయంలో పాడిపంట, పిల్లాపాప బాగుండాలని ఈ గ్రామ గిరిజనులు పూజలు చేస్తుంటారు. మంగళవారం వెళ్దామంటే భారీ వర్షం కురవడంతో వాగులు పొంగాయి. దీంతో ఇలా ట్రాక్టర్ల ద్వారా వాగులు దాటి వెళ్లి పూజల్లో పాల్గొన్నారు.
7/24
8/24
హన్వాడ మండలం కొత్తచెరువుతండాలోని అంగన్వాడీ కేంద్రం ఎదుట విరబూసిన గడ్డి గులాబీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గతేడాది వానాకాలంలో విత్తనాలు చల్లగా పూలు పూస్తున్నాయని అంగన్వాడీ కేంద్రం టీచర్ తెలిపారు. చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచుతున్న ఆ దృశ్యాన్ని ‘ఈనాడు’ కెమెరా క్లిక్మనిపించింది.
9/24
జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ దుస్థితి ఇది. శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదులలో పాఠాలు బోధిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గదులు పెచ్చులూడి.. కురుస్తున్నాయి. పిల్లలు అందులోనే కూర్చొని పాఠాలు వినాల్సిన పరిస్థితి ఉంది.
10/24
గుంటూరు రైల్పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలికోన్నత పాఠశాలలో ప్రవేశాలకు తల్లిదండ్రులు వరసకట్టారు. పటిష్టమైన ప్రహరీతో బాలికలకు రక్షణ, ఉత్తీర్ణత శాతం అధికంగా ఉండటమే కారణం.
11/24
ఆర్థిక లావాదేవీలన్నీ దాదాపు డిజిటల్ రూపమెత్తాక అభాగ్యులు, అన్నార్తులకు చిన్నాచితకా మొత్తాలు దానం చేసేవారూ తగ్గిపోయారు.. చిత్రంలో కనిపిస్తున్న ఈ వృద్ధుడి పేరు దారం లచ్చయ్య. ఈయనది నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారం గ్రామం. డిజిటల్ స్కానర్ సాయంతో యాచిస్తూ నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట మంగళవారం ‘ఈనాడు’ కెమెరా కంటికి చిక్కారు.
12/24
6 నుంచి 10వ తరగతి వరకు మా పాఠశాలలో సీట్లు అంటూ పాఠశాల ముందు నోటీసు పెట్టారు. ఇదేదో ప్రయివేటు పాఠశాలలో పరిస్థితి కాదు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం నగరపాలకసంస్థ పాఠశాలలో దృశ్యమిది. 1900 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో సీటు దొరకడం చాలా కష్టం.. ఎవరైనా టీసీ తీసుకుని వెళితే తప్ప మరొకరికి సీటు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఖాళీ అయ్యే సీటుకు కూడా తీవ్ర పోటీ ఉండటంతో పాఠశాల ఉపాధ్యాయులు పోటీ పరీక్ష పెట్టారు. బాగా చెప్తారనే మంచి పేరు ఉండటంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి చేర్చుతున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
13/24
14/24
పగలంతా మోడువారి ఉండే చెట్టు పొద్దుగుంకే వేళకు పచ్చని చిగుళ్లతో కళకళలాడుతూ కనిపిస్తుంది..! అందుకు కారణం ఓ చిలుకల గుంపు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ముఖద్వారం వద్ద ఉండే ఓ చెట్టు మోడులా మారింది. వందలాది చిలుకలు దానిని నివాసంగా మార్చుకున్నాయి. చీకటి పడే సమయానికి ఆ చెట్టుపైకి చేరి కిలకిలరావాలతో ఇలా సందడి చేస్తుంటాయి. గతంలో బస్టాండ్ సమీపంలోని ఓ చెట్టుపై ఇలా వాలేవి. విస్తరణలో భాగంగా దాన్ని తొలగించడంతో ఇప్పుడిక్కడ వాలుతున్నాయి.
15/24
16/24
వీరంతా భవన నిర్మాణ కూలీలు. పనికి వెళ్లే తొందరలో ఇలా ఓ ట్రాక్టర్పై ప్రమాదకరంగా కూర్చొని పని చేసే చోటుకు వెళుతున్నారు. అసలే గుంతల రోడ్లు.. ఏమాత్రం అదుపుతప్పినా.. కుటుంబాలు రోడ్డు పాలవుతాయి. చంపాపేట ప్రధాన దారిలో కనిపించిందీ చిత్రం.
17/24
హైదరాబాద్లో చాలా చోట్ల కాలిబాటలను ఆధునిక మరుగుదొడ్లు, బస్సు షెల్టర్లు, విద్యుత్తు బాక్సులకు ఉపయోగిస్తుండటం కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పాదచారులు రోడ్లపై నడిచి ప్రమాదాల బారిన పడుతున్నారు. యూసుఫ్గూడ కూడలిలో కనిపించిన చిత్రమిది.
18/24
ఖైరతాబాద్లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయంలో సోమవారం నుంచి పూర్తి స్థాయిలో పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సమాచారంతో విద్యార్థులు తల్లిదండ్రులు తరలివచ్చి కావాల్సిన తరగతుల సెట్లను తీసుకెళుతున్నారు.
19/24
చల్లని వాతావరణం.. అప్పుడప్పుడు చిరుజల్లుల పలకరింపుతో హైదరాబాద్ నగరం ఆహ్లాదకరంగా మారడంతో సందర్శకులు విహారానికి మొగ్గు చూపుతున్నారు. హుస్సేన్ సాగర్లో పడవ ప్రయాణాన్ని యువత ఆస్వాదిస్తున్నారు. రకరకాల బోట్లు అందుబాటులో ఉండడంతో వాటిలో విహరిస్తున్న వారితో సాగర్ కళకళలాడుతోంది.
20/24
సైబరాబాద్ కమిషనరేట్ మార్గం, బయోడైవర్సిటీలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రద్దీగా ఉన్న రోడ్లపై వాహనదారులు ఇబ్బందులుఎదుర్కొన్నారు.
21/24
చల్లటి వాతావరణం.. అప్పుడప్పుడు కురుస్తున్న చినుకులు.. నెమళ్లు పరవశించి ఆడే కాలం.. హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఇలా గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఆహ్లాదపరుస్తున్నాయి.
22/24
రోజూ కురుస్తున్న వర్షాలతో చెరువులకు చేరే కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఇదే అదనుగా పరిశ్రమల నిర్వాహకులు రసాయన వ్యర్థాలను కాలువల్లోకి వదులుతున్నారు. దీంతో నీరు విషతుల్యమవుతోంది. సరూర్నగర్ చెరువు వద్ద నురగలు కక్కుతున్న జలం ఇది.
23/24
ఫిలింనగర్లోని కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రహరీకి సమీపంలో గల ప్రధాన రహదారి మలుపు వద్ద రహదారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎదురెదురుగా వేగంగా వచ్చే వాహనాలు ఢీకొన్న ఘటనలు ఉన్నాయి. విద్యుత్ స్తంభానికి పక్కనే మ్యాన్హోల్ సైతం ఉంది. ఒక్కోసారి దీనిపై మూత తొలగిస్తుండటం ఆందోళన కలిస్తోందని స్థానికులు వాపోతున్నారు. సమస్య పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
24/24
అసలే వర్షాకాలం.. ఆపై అన్ని చెరువుల్లోనూ నీటిమట్టం పెరుగుతున్న క్రమం. హైదరాబాద్ శివారు మొయినాబాద్ మండలం చిలుకూరు పెద్ద చెరువులోని కొన్ని విద్యుత్ స్తంభాలు దాదాపుగా ఒరిగిపోయాయి. కేవలం తీగల ఆధారంగా నిలిచి ఉన్నాయి. వరుస వర్షాల నేపథ్యంలో చెరువులో నీటిమట్టం మరింత పెరిగినా, వానల ధాటికి మట్టి కుంగిపోయినా ఈ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే విద్యుదాఘాతంతో సమీప గ్రామాలకు అనూహ్య నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఇదే విషయాన్ని ఏడీఈ రమేశ్ దృష్టికి తీసుకెళ్లగా స్తంభాల పునాది సరిగా లేకపోతే మట్టి మెత్తగా ఉన్నచోట వర్షాలకు చెరువుల్లో ఉండే స్తంభాలు ఇలా వంగే అవకాశం ఉందన్నారు. సమస్యను రెండుమూడు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు.
Tags :