News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (04-08-2022)
Updated : 04 Aug 2022 12:12 IST
1/33
వేగంగా వెళ్తున్న రైలులో కొంత మంది యువత ద్వారం వద్ద నిలబడి, కూర్చొని చరవాణి పట్టుకుని చూస్తున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా ప్రాణాలు పరలోకమే. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వేస్టేషన్ సమీపంలో కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్లో ద్వారం వద్ద ప్రమాదకరంగా కనిపించిన దృశ్యాలివి.
2/33
3/33
వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి అంపల్లి ప్రాథమిక పాఠశాల తరగతి గదుల్లోకి నీరు రావడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కసారిగా వరద రావడంతో ఇంటికి వెళ్లలేక, పాఠశాలలో కూర్చోలేక గంటల తరబడి వరండాలో నిలిచే ఉండాల్సి వచ్చింది.
4/33
మూడు నిమిషాలు ట్రాఫిక్ సిగ్నల్ పడితే అపసోపాలు పడుతుంటాం. ఒక్కోసారి ఆగకుండానే వెళ్తుంటాం. అలాంటిది పోలీసులు వాహన తనిఖీ పెడితే ఇలా ఎన్ని గంటలైనా వేచి ఉంటాం. మణుగూరులోని పీవీ కాలనీ అడ్డరోడ్డు వద్ద అభయాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో బుధవారం మణుగూరు పోలీసులు వాహన పత్రాలను తనిఖీ చేశారు. గమనించిన చోదకులు పలువురు తమ వద్ద వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో తోగ్గూడెం వరకు ఇలా వాహనాలను నిలిపి వేచి ఉన్నారు. తనిఖీ ముగిశాక వెళ్లారు.
5/33
ఈ చిత్రంలో కనిపిస్తున్న నీటి సంగమం చూశారా..! ఇదేదో పుణ్యక్షేత్రం సమీపాన ఉన్న నదీ తీరం అనుకుంటే పొరబాటే. ఒకటి ఎరుపు, మరోటి నీలిరంగులో ఉన్న నీటిపాయలు ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇలా కలిశాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జూలూరుపాడు- జడలచింత మధ్య పొలాల్లో ఈ దృశ్యం ఆవిషృతమైంది. ఎరుపు రంగు జూలూరుపాడు గ్రామం నుంచి చేరుకున్న వరద కాగా, నీలిరంగు పాయ పాపకొల్లు, జడలచింత గ్రామాల వైపు నుంచి చేరుకుంది. ఈ రెండూ కలిసి ఓ కల్వర్టు నుంచి తుమ్మల వాగుకు చేరుకుంటున్నాయి. ప్రధాన రహదారి పక్కనే కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
6/33
ఎలిగేడు మండలం లోకపేట శివారులో ముప్పిరితోటకు చెందిన దానుపనేను లక్ష్మణ్రావు, ఐరెడ్డి రవీందర్రెడ్డిల పొలాల్లో భారీ సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఇందులో చాలావరకు వంగిపోయి తీగలు వదులై ప్రమాదకరంగా మారాయి. కొన్నేళ్లుగా ఈ సమస్య నెలకొనగా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
7/33
8/33
వంగర మండలంలోని సీతారామ సొసైటీకి చెందిన మత్స్యకారులు వీరు. సంఘంలో సుమారు పలు గ్రామాలకు చెందిన 500 మంది ఉన్నారు. గత ఐదు రోజులుగా మడ్డువలస జలాశయం వంగర సమీపంలో కనుచూపు మేర పిట్టతామరతో నిండిపోవడంతో వేటకు ఆటంకం ఏర్పడుతోంది. పడవలు నడిపేందుకు వీలులేకుండా పోయింది. రూ.వేలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన వలలు చిక్కుకుపోవడంతో నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
9/33
సాలూరు మండలంలోని గుబేల్గెడ్డ బుధవారం తీవ్రరూపం దాల్చింది. వర్షాలు కురుస్తుండడం, ఎగువ నుంచి ఒక్కసారిగా నీరు రావడంతో ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో బాగువలస గ్రామం పూర్తిగా ముంపుబారిన పడింది. ఎస్సీ కాలనీ, రామాలయం వీధి, నాయుడు వీధి, బొత్సపరశురాంవీధి తదితర ప్రాంతాల్లోని ఇళ్లన్నీ నీటమునిగాయి.
10/33
సెల్ఫోన్ సిగ్నల్ బాగా వస్తుందని ఓ వ్యక్తి.. ఇలా డబ్బాకొట్టుపై వీడియో గేమ్స్లో నిమగ్నమయ్యారు. చెట్ల కింద హాయిగా ఉంటుందని.. డబ్బాకొట్టు లోపల కొందరు ఎంచక్కా ఆడుకుంటున్నారు. ఇందుకూరుపేట మండలం లేబూరులో కనిపించిన ఈ దృశ్యాన్ని ఈనాడు కెమెరాలో బంధించింది.
11/33
నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణం మొదట్లో ఉన్న ఉద్యానవనం.. పూలు, వివిధ మొక్కలతో పచ్చదనం పరుచుకుంది. బుధవారం తెల్లవారుజాము నుంచి 10గంటల వరకు చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. వాన చినుకులు మొక్కల్లో ఉన్న పూలపై పడి అవి ముత్యాలుగా కనిపించాయి. ఇక్కడికి వచ్చిన చూపరులను ఈ పుష్పాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
12/33
సంగం బ్యారేజీ వద్ద విద్యుత్తు దీప స్తంభాలు ఏర్పాటు చేశారు. 1195 మీటర్ల పొడవైన బ్యారేజీలో 85 గేట్లు ఉండగా.. ఒక్కో గేటుకు ఒక్కో స్తంభం లెక్కన 85 అమర్చారు. 9.5 మీటర్ల ఎత్తయిన ఒక్కో స్తంభానికి వేయి మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు ఎల్ఈడీ దీపాల చొప్పున 170 బిగించారు. వీటి ఫలితంగా బ్యారేజీ పై వంతెన భాగం, బ్యారేజీలో గేట్ల వైపు ప్రాంతాలు ప్రకాశవంతమవుతాయి.
13/33
14/33
ప్రజాప్రతినిధులు, అధికారుల ముందు పండ్లు, పూలు, కూరగాయలు కనిపిస్తున్నాయేమిటి అనుకుంటున్నారా? బుధవారం జగనన్నతోడు ప్రారంభానికి వీడియో కాన్ఫరెన్స్లో గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, జేసీ రాజకుమారి, జడ్పీ ఛైర్ పర్సన్ హెనీ క్రిస్టినా, ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిరు వ్యాపారులకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటోందనే విషయాన్ని తెలిపేలా ఇలా పండ్లు, కూరగాయలను ముందు పెట్టుకుని సీఎంను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
15/33
వైఎస్ఆర్ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోట త్రివర్ణ పతాక దీపకాంతులతో కళకళలాడుతోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గండికోటలోని మాధవరాయస్వామి దేవాలయం, ముఖద్వారానికి జాతీయ పతాక రంగు దీపాలతో అలంకరించారు.
16/33
17/33
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ పంచాయతీ రామదాసుసత్రం వద్ద ప్రభుత్వ సీజేఎఫ్ఎస్ (కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ) భూముల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. రైల్వే పనుల కోసమని అధికారులు మీటరు లోతున 5వేల క్యూబిక్ మీటర్లు తవ్వుకునేందుకు అనుమతిచ్చారు. కానీ, యంత్రాలతో అంతకు నాలుగింతల లోతు తవ్వి మట్టి తరలించేశారు. ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్తు స్తంభాలు చుట్టూ ఓ కొద్దిమొత్తం వదిలేశారు. ఇప్పుడు అవి ఓ వైపు ఒరిగి పడిపోయేలా ప్రమాదకరంగా ఉన్నాయి.
18/33
చుట్టూ ఎత్తైన కొండలు.. గుట్టలు.. తివాచీ పరిచినట్లు గడ్డి మధ్యలో పిల్లకాలువలా ఓ వాగు. ఈ మనోహరమైన ప్రదేశం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని యడవల్లి- బోళ్లపల్లి గ్రామాల మధ్య ఉంది. నెల కిందటి వరకూ కనువిందు చేసిన అందాలపై ఇప్పుడు ఒండ్రు పేరుకుపోయింది. పోలవరం ముంపు ప్రాంతం కావడంతో ఇటీవల వచ్చిన గోదావరి వరదకు అక్కడున్న ఎద్దు వాగుకు పోటెత్తింది. పచ్చికబయళ్లు 20 రోజుల పాటు గోదావరి నీరు, బురదలో మునిగాయి. వరద తగ్గాక అడుగు మేర మట్టి మేట వేసి.. ఇలా కనిపించాయి.
19/33
20/33
దిల్లీలో బుధవారం నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
21/33
కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా సురేశ్ ఎన్.పాటిల్తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఉదయం ప్రమాణం చేయించిన సందర్భంగా వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
22/33
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భవనం ఇది. సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాద వాతావరణంలో ఉంటుంది. 1923లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ నిర్మించారు. అప్పట్లో జాగీర్దార్లు నవాబుల పిల్లలు చదువుకోవడం వల్ల జాగీర్దార్స్ కళాశాలగా పిలిచేవారు. 1951లో హైదరాబాద్ పబ్లిక్ స్కూలుగా నామకరణం చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇక్కడే విద్యనభ్యసించారు. ప్రస్తుతం పలువురు ప్రముఖుల పిల్లలతోపాటు పేద విద్యార్థులూ చదువుతున్నారు.
23/33
భారీ గుంత, అందులో నీరు నిల్వచేరిన చిత్రం హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిది. అబ్దుల్లాపూర్మెట్లో రామోజీ ఫిలింసిటీ కూడలి సమీపంలో పరిస్థితి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక అడుగడుగునా గుంతలతో ప్రమాదకరంగా కనిపిస్తున్నది బాటసింగారం పండ్ల మార్కెట్ ముందు అదే రహదారి దుస్థితి. నిత్యం లక్షలాది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
24/33
25/33
ఉస్మానియా విశ్వవిద్యాలయం దారులివి. ఇటీవలి వర్షాలకు రోడ్లు దెబ్బతిని ఇలా అధ్వానంగా మారాయి. ఇటుగా రాకపోకలు సాగించేవారు ఈ గోతుల దారిలో ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు.
26/33
27/33
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’గా ఎంపికయ్యారు. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోమవారం రాత్రి కేరళలోని కోచిలో నిర్వహించిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు.
28/33
దుర్గం చెరువు పార్కులో కొత్తగా నడక మార్గం నిర్మించారు. ఇక్కడ వాకర్లకు కాసారం చుట్టూ తిరిగే అవకాశం లేదు. దీంతో తటాకం రెండు వైపులా కలుపుతూ ఓ చివరన చిన్న వంతెన కట్టారు. సందర్శకులు వాకింగ్ చేయడంతోపాటు తటాకం అందాలను ఆస్వాదించవచ్చు.
29/33
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సంబంధీకుల ఆకలి తీరుస్తోంది సర్వ్ నీడి స్వచ్ఛంద సంస్థ. కొవిడ్కి ముందు నుంచి ఇప్పటివరకు నిరంతరంగా ఉచితంగా భోజనాన్ని అందజేస్తోంది. నిలోఫర్, గాంధీ ఆస్పత్రుల వద్ద రోజు ఇడ్లీ, ఉప్మా, దోశ అల్పాహారంతోపాటు భోజనాన్ని సుమారు రెండు వేల మందికి పంపిణీ చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
30/33
31/33
రాజ్భవన్ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి.. రహదారి ప్రహరీపైకి దూసుకుపోయింది. బుధవారం సాయంత్రం రాజ్భవన్ రోడ్డులో ఓ కారును మహిళ నడుపుతూ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ వైపు వెళుతోంది. కారు అదుపు తప్పింది. ప్రహరీని ఢీకొంది. కారులోని ఎయిర్బ్యాగ్స్ తెరచుకోవడంతో కారు నడుపుతున్న మహిళ సురక్షితంగా బయటపడింది.
32/33
ఉప్పల్-చిలుకానగర్ మార్గంలో కావేరీనగర్ వద్ద నాలాపై రూ.కోటి 35 లక్షలతో వంతెన నిర్మాణం చేపడుతున్నారు. మార్చిలో పనులను చేపట్టి మేలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ మే లో పనులు షురూ చేశారు. వర్షాకాలంలో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలను ఈ మార్గంలో పూర్తిగా నిలిపేశారు. మట్టి కట్ట, పైపులైను మీద నడిచే సమయంలో ఏ మాత్రం అడుగు పక్కన పడినా నేరుగా కాలువలో పడిపోయే ప్రమాదం ఉంది. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయలేదు.
33/33
ఆకాశంలోని మేఘాలు నేలను తాకుతుండగా... భూమి ఉపరితలం నుంచి నీరు సుడిగాలి రూపంలో పైకి ఎగిసిపడే దృశ్యాలు సాధారణంగా సముద్ర తీరప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. కానీ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో బుధవారం ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. ఒక్కసారిగా ఆకాశం నుంచి నీరు ధారలా పొలాల్లోకి వచ్చి.. తర్వాత సుడులు తిరుగుతూ పైకి పోవడంతో సమీపంలోని కూలీలు ఆందోళన చెంది పరుగులు తీశారు. కొందరు సెల్ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీశారు. దాదాపు అయిదు నిమిషాలపాటు ఇది కొనసాగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్