News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (08-08-2022)
Updated : 08 Aug 2022 12:08 IST
1/44
విశాఖ నగరంలోని ఓ మేనేజ్మెంట్ కళాశాలకు చెందిన మేనేజ్మెంట్ విద్యార్థులు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించి కాసేపు పొలం పనుల్లో పాల్గొన్నారు. నాట్లు వేశారు. వ్యవసాయ పనుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం వరకు అక్కడే గడిపారు. జాతీయ మేనేజ్మెంట్ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పొలం బాట పట్టినట్లు విద్యార్థులు తెలిపారు.
2/44
కుండపోత వర్షానికి తగరపువలస, సంగివలస, చిట్టివలసల్లోని కాలనీలు ఆదివారం జలమయం అయ్యాయి. సబ్బివానిపేట, సంగివలసల్లో జాతీయరహదారి సర్వీసు రోడ్డులో వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.
3/44
పెదవాల్తేరు జీవ వైవిధ్య ఉద్యానవనంలో ఆర్కిడ్ పుష్పాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. తేమ శాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పూలు ఎక్కువగా కనిపిస్తాయి. తూర్పుకనుమల్లో అధికంగా ఉంటాయి.
4/44
5/44
6/44
ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మను ఆదివారం లక్షగాజులతో అలంకరించారు. ఈ సందర్భంగా ధనమహాలక్ష్మి దేవి యజ్ఞం నిర్వహించారు. లక్ష తెల్ల ఆవాలు, విశేష ద్రవ్యాలతో అమ్మవారికి అన్నాభిషేకం ఘనంగా జరిపారు.
7/44
భీమిలి వద్ద కెరటాలు ఒక్క సారిగా వెనక్కు మళ్లడంతో సముద్ర తీరం విశాలంగా గోచరించింది. విస్తారమైన ఇసుక తిన్నెలు దర్శనమిచ్చాయి. బంగాళాఖాతంతో అల్పపీడనం కారణంగా అలలు వెనక్కి వెళ్లాయని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో బీచ్కు వచ్చిన సందర్శకులు చిరుజల్లుల మధ్య ఉల్లాసంగా గడిపారు.
8/44
ఆర్కేబీచ్ విక్టరీ ఎట్ సీ ఎదురుగా ఉన్న తీరంలో మురుగు పేరుకుపోయింది. శనివారం కురిసిన వర్షాలకు నగరంలోని మురుగు డ్రైనేజీల ద్వారా ఇలా తీరానికి చేరి నిలిచిపోయింది. దుర్వాసన వ్యాపించడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
9/44
శ్రీకాకుళం నగరంలోని కేంద్ర గ్రంథాలయం ఆవరణ పశువులశాలను తలపిస్తోంది. ఆవులు, ఎద్దులు, దూడలు నిత్యం ఇక్కడే తిష్ఠ వేస్తున్నాయి. పశువులపేడ, మూత్రంతో గ్రంథాలయ పరిసరాల్లో దుర్వాసన వస్తోంది. ఇక్కడకు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో 500 నుంచి 600 మంది వరకు పాఠకులు, పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు వస్తుంటారు. కొంతకాలంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
10/44
చూసే కళ్లు.. స్పందించే మనసు ఉండాలే గాని ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ఓ చింత చెట్టుకు తీగ జాతి మొక్క అల్లుకోవడంతో ఇలా పాము పడగలా కనిపిస్తున్న చిత్రం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నుంచి రాజోలు వెళ్లే మార్గంలో పోతవరం వద్ద ఇలా దర్శనమిస్తోంది. దీన్ని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
11/44
గుడిబండ మండలం మద్దనకుంట గ్రామానికి చెందిన షబానా పెంచిన సీమ కోడి ఆదివారం గోలి పరిమాణంలో గుడ్డు పెట్టింది. పరిసర గ్రామస్థులు వింతగా వీక్షించారు. ఈ కోడి రోజూ సాధారణ సైజులో గుడ్డు పెట్టేది.
12/44
శింగనమల శ్రీరంగరాయలచెరువు మరోసారి మరవ పారుతోంది. వర్షపు నీరు చెరువులో చేరడంతో మరవ వద్ద నీరు బయటకు వెళుతోంది. గత ఏడాది రెండు నెలల పాటు మరవ పారింది. ఈ ఏడాది మరోసారి చెరువు నిండి మరవ పారడం విశేషం. వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివచ్చి నీటి పరవళ్లను తిలకించి ఆనందంగా గడుపుతున్నారు.
13/44
ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం చూసి పొలం అనుకుంటే మీరు బురదలో కాలేసినట్లే. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మండలిపురం పక్కనే ఉన్న జగనన్న రహదారి బంగ్లా లేఔట్ ఇది. ఇక్కడ సుమారు 60 మందికి నివేశన స్థలాలిచ్చారు. పల్లంగా ఉండడం, మెరక చేయకపోవడంతో ప్రస్తుతం అందులో వాన నీరు చేరి పొలంలా మారింది. ఇందులో ఏ విధంగా ఇళ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
14/44
రాజధాని అమరావతి ప్రాంతంలో భవనాలు, వంతెన నిర్మాణాలు మధ్యలోనే నిలిపివేయడంతో వాటి కోసం తవ్విన భారీ గుంతల్లో వర్షపునీరు చేరి మృత్యుకుహరాల్లా తయారయ్యాయి. వీటిల్లో ఈత కోసం స్థానికంగా ఉండే చిన్నారులు దిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆయా చోట్ల పశువులు దిగితే ఇనుపచువ్వలు గుచ్చుకుని బయటకు రాలేని పరిస్థితి.. ఆ గుంతల పక్కనే ఉన్న రహదారులపై రాత్రి సమయాల్లో ప్రయాణించాలంటే స్థానికులు భయపడుతున్నారు.
15/44
16/44
గత నెలలో కురిసిన వర్షాల సమయంలో ఈనాడులో గుంటూరులోని గుజ్జనగుండ్ల సెంటర్ నుంచి పలకలూరు వెళ్లే రహదారి చిత్రం ప్రచురితమవడంతో కార్పొరేషన్ అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేశారు. రెండు వారాలకే యథావిధిగా రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. దాంతో మిర్చి బస్తాల లోడుతో వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ ఇలా బోల్తా కొట్టింది.
17/44
18/44
ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన చిన్ననాటి మిత్రులు ఆదివారం భూదాన్పోచంపల్లి మండలం భీమనపల్లి శివారులో కలిశారు. అరగంట పాటు పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంజయ్కు ఇష్టమైన చిన్న సమోసాలను కరీంనగర్ నుంచి తీసుకొచ్చి తినిపించారు.
19/44
కల్వకుర్తి పట్టణంలోని ఓ బంగారు దుకాణంలో పనిచేస్తున్న సూక్ష్మకళాకారుడు వంగూరు మండలం రంగాపూర్కు చెందిన శేఖరాచారి రూపొందించిన అతి తక్కువ బంగారంతో జాతీయ జెండా, బోనాలు ఆకట్టుకుంటోంది. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా రెండు మిల్లీ గ్రాముల బంగారంతో జాతీయ జెండాను తయారు చేశానని ఆయన పేర్కొన్నారు.
20/44
వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభం ఎక్కే క్రమంలో పట్టుజారి కిందపడి ప్రమాదాలబారిన పడకుండా ఆన్లైన్ ద్వారా పోల్ క్లైంబింగ్ చెప్పులను బుక్ చేసుకొని తెప్పించుకున్నట్లు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన విద్యుత్తు సిబ్బంది విజయ్ పేర్కొన్నారు. ప్రత్యేక చెప్పుల సాయంతో స్తంభాలను సులభంగా ఎక్కడం, నిలబడి సులువుగా మరమ్మతులు చేస్తున్నామన్నారు.
21/44
22/44
దేవరకద్రలో ఆర్వోబీ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు ఎలాంటి రక్షణ చర్యలు పాటించడం లేదు. తలకు హెల్మెట్, పాదాలకు బూట్లు ధరించలేదు. ఎలాంటి ఆసరా లేకుండా ఇనుప చువ్వలపై నిలబడి పనిచేస్తున్నారు. కింద నుంచి పెద్దఎత్తున వాహనాలు వెళ్తుంటాయి. వారు ఏమాత్రం అదుపుతప్పి కిందపడినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. గుత్తేదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది.
23/44
పాలకుర్తి మండలంలోని బామ్లానాయక్తండాలోని ప్రభుత్వ పాఠశాల మూతపడింది.. తండాకు పక్క నుంచి ఎస్సారెస్పీ డీ83 కాలువ వెళ్తోంది.. దీని వెంట రోడ్డు ద్వారా పిల్లలు బడికి వెళ్లాలి.. కాల్వపై నిర్మించిన వంతెన ప్రమాదకరంగా ఉండటంతో ఆ గ్రామంలో పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. పిల్లలు లేని బడిని పంచాయతీ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు.
24/44
25/44
గంగాధరలో కోట్లాది రూపాయలతో చేపట్టిన వంతెన పనులు పూర్తవక రోజులతరబడి ప్రయాణికులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు తాత్కాలిక రోడ్డు తెగిపోగా ఎత్తైన వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డు వేయకపోవడంతో వాహనదారులు వెళ్లేందుకు భయాందోళన చెందుతున్నారు. ఆటోలు, ఇతర భారీ వాహనాలు అతికష్టంపై వంతెన ఎక్కిస్తుండగా అదుపుతప్పి కిందకు వస్తూ ప్రమాదానికి గురవుతున్నాయి.
26/44
చూడటానికి వంతెనలా కనిపిస్తున్న ఇది వరద నీటి కాలువ. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు ఒకప్పుడు వరదల కారణంగా బీభత్సాన్ని సృష్టించిన సందర్భాలున్నాయి. నాటి ప్రభుత్వం, అధికారులు రూ.కోట్లతో బేతుపల్లి చెరువు నుంచి వరద నీటిని సత్తుపల్లి పట్టణం మీదుగా వేంసూరు మండలానికి తరలించేందుకు ప్రత్యామ్నాయంగా ఈ కాలువను నిర్మించారు.
27/44
28/44
ఈ చిత్రంలో కనిపిస్తున్న బారికేడ్లు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి అనుకుంటే.. పొరబడినట్లే. తాండూరు మండలంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని తంగళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లు చిన్నపాటి వర్షానికే నేలమట్టమయ్యాయి. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన వారం రోజుల్లోనే కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
29/44
విజయవాడ ప్రకాశం బ్యారేజికి అటు, ఇటు ఉన్న ప్రాంతాలను గతంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తే.. ఇప్పుడవి మందుబాబులకు అడ్డాగా మారాయి. సీతానగరం వద్దనున్న టూరిజం బోటు క్లబ్ పక్కనే పర్యాటకశాఖ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఎవరికైనా తాగాలనుంటే బార్లో కూర్చునేవారు. ఇది చాలదన్నట్లు ఏడాది కిందట అక్కడ ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మందుబాబులు సాయంత్రమైతే చాలు ప్రకాశం బ్యారేజి పక్కన రోడ్లపై దర్శనమిస్తున్నారు.
30/44
రాజధాని అమరావతి ప్రాంతంలోని సచివాలయం, హైకోర్టు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల నివాస గృహాలచుట్టూ ముళ్లకంప పెరిగి పొదలుగా కనిపిస్తోంది. మూడేళ్లుగా రాజధానిలో పనులు నిలిచిపోవడంతో ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు, కంపచెట్లు మొలిచాయి. దీంతో రహదారులు ఆనవాళ్లను కోల్పోతున్నాయి.
31/44
ఇది టమాటా పోసిన కళ్లం కాదు.. అనంతపురం గ్రామీణంలోని కక్కలపల్లి మార్కెట్. గిట్టుబాటు ధర రాలేదని రైతులే పారబోసిన టమాటా ఇది. వ్యాపారులు నాణ్యత లేదని కొనుగోలు చేయకపోవడంతో దిక్కుతోచని రైతులు సరకంతా ఇలా పారబోసి వెళ్లిపోయారు.
32/44
తాజ్మహల్ నుంచి ఉపగ్రహాల వరకు.. నేతల ముఖచిత్రాల నుంచి దేవుళ్ల ఆకృతుల వరకు పట్టుపోగుల్లో చేరి, చీరలపై చిత్తరువులుగా రూపుదిద్దుకున్నాయి. ధర్మవరానికి చెందిన చేనేత కళాకారుడు నాగరాజు నైపుణ్యం చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కంప్యూటర్ జాకార్డ్ పరికరంతో కొత్త డిజైన్లకు ఆయన ప్రాణం పోస్తున్నారు.
33/44
మరమ్మతుల కోసం అమెరికాకు చెందిన యుద్ధనౌక చార్లెస్ డ్రూ ఆదివారం భారత్ చేరుకుంది. చెన్నై కాటుపల్లిలోని ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన షిప్యార్డ్లో ఇది లంగరేసింది. మరమ్మతులు, ఇతర సేవల కోసం అమెరికా నౌక ఒకటి మన దేశానికి చేరుకోవడం ఇదే తొలిసారి. ‘భారత్లో తయారీ’కి ఇది పెద్ద ఊతమని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది.
34/44
విశాఖ మన్యం లంబసింగిలో ఆదివారం మంచు దోబూచులాడింది. సాధారణంగా డిసెంబరు, జనవరి నెలల్లో మంచు తెరలు ఇక్కడి గిరులను చుట్టేస్తాయి. కానీ, ప్రస్తుతం వరుస వర్షాల నేపథ్యంలో మన్యంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఆదివారం వర్షం వచ్చి వెలిశాక.. అకస్మాత్తుగా మంచు మేఘాలు పచ్చని కొండల్ని హిమగిరులుగా మార్చేశాయి. ముందే పలకరిస్తున్న మంచు సోయగాలు మన్యానికి వచ్చే పర్యటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.
35/44
కూలిన ఇళ్లు, విసిరేసినట్లు పడున్న పైకప్పులు, పేరుకున్న బురద.. ఇవీ ఆదివాసీ గ్రామాల్లో గోదావరి వరద సృష్టించిన బీభత్సం. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలోని ఆదివాసీ గ్రామమైన శబరి కొత్తగూడెంలోని 70 శాతం గుడిసెలు వరద ధాటికి కూలిపోయాయి. దీంతో సుమారు నెల రోజులుగా గ్రామ ప్రజలంతా చినార్కూరు ప్రధాన, అంతర్గత దారుల పక్కన గుడారాలు వేసుకొని ఉంటున్నారు.
36/44
37/44
చిత్రంలోని విద్యార్థులంతా ఏదో సరదాకి రైలు పట్టాలపై నడుచుకుంటూ వస్తున్నారనుకుంటే మీరు పొరబడినట్లే. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని నెల్లివీడు, నర్సింగాపూర్, కొన్నూరు, ద్వారకానగర్ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాలలోని ఆరో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులంతా మండల కేంద్రం మదనాపురానికి ఇలా రైలు పట్టాల మీదుగా వెళ్తున్నారు.
38/44
39/44
తెలంగాణ రాష్ట్ర సచివాలయ నూతన భవన నిర్మాణం వడివడిగా సాగుతోంది. 80 శాతం పైగా పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. దసరా నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. కాకతీయుల నాటి నిర్మాణ శైలిలో భవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. హుస్సేన్సాగర్ బోట్స్ క్లబ్ వద్ద నీటిలో సచివాలయ భవన నిర్మాణ ప్రతిబింబం పడి ఆకట్టుకుంది.
40/44
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 50 రోజులు అవుతున్నా విద్యార్థులకు 50% పాఠ్యపుస్తకాలు కూడా అందలేదు. దీంతో ఖమ్మంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కొత్త, పాత పుస్తకాలతో కొందరు, ఓకే పుస్తకంతో ఇద్దరు, ముగ్గురు చదువులు కొనసాగిస్తున్నారు. గురుకుల వసతి గృహాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉపాధ్యాయులు ఏటా పరీక్షలు అవగానే తరగతుల వారీగా విద్యార్థుల నుంచి పుస్తకాలు సేకరించి.. తరువాత సంవత్సరం విద్యార్థులకు అందజేస్తున్నారు. దీంతో కొంత ప్రయోజనం చేకూరుతున్నా.. అవికూడా అరకొరగానే ఉంటున్నాయి.
41/44
చార్మినార్ పరిధిలోని ఖిల్వత్ చౌమొహల్లా సమీప మోతీగల్లీలోని పార్కింగ్ స్థలం వ్యర్థాలు, మురుగుతో అధ్వానంగా ఉంది. బస్సు టర్మినల్ సమీప వాహనాల పార్కింగ్ స్థలం కూడా డంపింగ్యార్డుగా కన్పిస్తుంది. పార్కింగ్ స్థలాల్లో అపరిశుభ్రత లేకుండా చూడాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.
42/44
43/44
స్వాతంత్ర్య వజ్రోత్సవాలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. పలు ప్రాంతాలు మువ్వన్నెల శోభ సంతరించుకుంటున్నాయి. కూడళ్లు విద్యుత్తు దీపాలతో వెలుగొందుతున్నాయి. మాసాబ్ట్యాంక్ మెహిదీపట్నం మార్గంలోని ఎన్ఎండీసీ పాదచారుల వంతెనపై కళారూపాలకు ఏర్పాటు చేసిన తళుకులివి.
44/44
నిర్వహణ కొరవడటంతో కొన్నిచోట్ల బస్స్టాపులను ఉపయోగించడం కష్టంగా మారింది. హైదరాబాద్-సాగర్ ప్రధాన రహదారిలో నాలుగు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పైకప్పు దెబ్బతిని.. చెట్లు, పొదలతో ఉండటంతో ప్రయాణికులు వాటి వైపు చూడటం మానేశారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?