News In Pics: చిత్రం చెప్పే సంగతులు (12-08-2022)
Updated : 12 Aug 2022 13:03 IST
1/20
అరే చూడముచ్చటగా ఉన్న ఈ రాఖీలు మొక్కలకు కాశాయేంటని అనుకుంటున్నారా.. వీటి శాస్త్రీయ నాయం ఫాసీ ఫ్లోరా. ఇది లాటిన్ పదం. ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్యాషన్ ఫ్లవర్గా పేర్కొంటే.. జపాన్లో క్లాక్ ఫ్లవర్(గడియార పుష్పం), మన దేశంలో కృష్ణ కమలం, రాఖీ ఫుష్పంగా పిలుస్తారు. మహాభారతం కాలం నుంచి దీనికి గుర్తింపు ఉన్నట్లు చెబుతారు. ఈ పుష్పం చుట్టూ ఉన్న రెక్కలను కౌరవులుగా.. ఐదు పసుపు రెక్కలను పాండవులుగా.. మధ్యలోనిది సుదర్శన చక్రంగా అభివర్ణిస్తారు. ఇది జులై - సెప్టెంబరు మధ్య పుష్పిస్తుందని నిజామబాద్లోని వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు లత వివరించారు. ఈ పుష్పాల సువాసనలు ఒత్తిడి, ఆందోళనలు తగ్గిస్తాయని చెప్పారు.
2/20
నాగార్జునసాగర్ జలాశయానికి పై నుంచి వరద రాకతో గేట్లు ఎత్తారు. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. యువతీయువకులు సుందర దృశ్యాలను చరవాణుల్లో బంధించారు.
3/20
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగబంధం వెలకట్టలేనిది. డబ్బు, ఆస్తిపాస్తులకు అతీతమైంది. దీని ప్రతీకగా రామకోటి భక్తసమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు రాఖీ పండుగకు సృజనాత్మకత చాటారు. గజ్వేల్ పట్టణానికి చెందిన ఆయన గురువారం 15 వేల నాణేలతో పది అడుగుల రాఖీని ప్రదర్శన కోసం రూపొందించారు. రాఖీలో కనిపిస్తున్న నాణెం వెనుక సోదర, సోదరీమణుల అభిమానం, ఆత్మీయత దాగి ఉంటుందన్నారు.
4/20
రాఖీ పండగ సందడి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత దూరంలో ఉన్నా అన్నల వద్దకు వెళ్లి చెల్లెళ్లు రక్షాబంధన్ను కట్టడం ఆనవాయితీ. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళ దుమ్ముగూడెం మండలం బండారుగూడెంలోని సోదరులకు రాఖీ కట్టేందుకు గురువారం బయలుదేరారు. కన్నాయిగూడెం-బండారుగూడెం మధ్యలో ప్రధాన రహదారి గోదావరి వరదతో మునిగిపోయింది. రోడ్డు మీద నడుము లోతు నీళ్లు ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం కల్లా ప్రవాహం పెరిగే వీలుందని తెలియడంతో తన కోడళ్లు మౌనిక, వనిత సాయంతో వరద నీటిని దాటి పుట్టింటికి చేరుకుంది. ఆమె పట్టుదలను చూసి స్థానికులు ఔరా అనుకున్నారు.
5/20
కరీంనగర్లోని ప్రధాన పోస్టాఫీసు వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ బోర్డు వద్ద జెండాలు కొనుగోలు చేసిన కస్టమర్లను పోస్టాఫీసు సిబ్బంది ఫొటోలు తీశారు. ఇక్కడ జాతీయ జెండాను చేత పట్టుకొని ఫ్రేమ్లో నిలబడి చిత్రాలు తీయించుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు. కొందరు సెల్ఫీలు తీసుకున్నారు.
6/20
కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో కార్గో, పార్సిల్ బుకింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకం పలువుర్ని ఆకట్టుకుంటుంది. చిన్నపాటి బస్సు బొమ్మను తయారు చేసి దానికి జాతీయ జెండాను అమర్చారు. నిత్యం అక్కడికి వేలాది మంది వస్తుంటారు. దేశభక్తిని చాటేలా జాతీయ పతాకం ఏర్పాటు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
7/20
హుస్సేన్సాగర్ పాదబాటపై ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాల జంక్షన్ బాక్స్ల మూతలు ఊడిపోయి వైర్లు బయటకు వేలాడుతున్నాయి. సందర్శకులు వాటిని గమనించకుండా ఇలా ఫొటోలు దిగుతున్నారు.
8/20
నాగార్జున సాగర్ 26 గేట్లూ బార్లా తెరుచుకున్నాయి. ఇరవై ఏళ్లలో ఎనిమిదిన్నర గంటల వ్యవధిలో మొత్తం గేట్లు తెరుచుకోవడం ఇదే మొదటిసారి. ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో గేట్లను మరికొద్ది రోజులు తెరిచి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం జలాశయ నీటి మట్టాన్ని 585 అడుగుల వద్ద కొనసాగించనున్నారు.
9/20
కర్ణాటకలోని హసన్ నుంచి చర్లపల్లిలోని ప్లాంటు వరకు 649 కిలోమీటర్ల దూరం పైపుల ద్వారా ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేసేందుకు హెచ్పీసీఎల్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఔటర్పై రావిర్యాల వద్ద నిర్మిస్తున్న వాల్వ్ స్టేషన్ ఇది.
10/20
హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన స్పోర్ట్స్ డే వేడుకల్లో ప్రసంగిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్. చిత్రంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు.
11/20
75వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని హెచ్ఐసీసీలో నిర్వహించే ఓ వస్త్రాభరణాల ప్రదర్శనకు సంబంధించి ముందస్తు ఫ్యాషన్షో గురువారం బంజారాహిల్స్లోని మార్క్స్ మీడియా కార్యాలయంలో నిర్వహించారు. వర్ధమాన సినీతారలు రితిక చక్రవర్తి, శ్రీలేఖ రూపదర్శినిలతో కలిసి సందడి చేశారు.
12/20
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నగరవ్యాప్తంగా ‘పరుగు’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రెవెన్యూ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మాదాపూర్ హైటెక్స్ కమాన్ వద్ద నిర్వహించిన 4కె రన్లో పాల్గొన్న అనంతరం జాతీయ జెండాలతో ఐటీ ఉద్యోగులు, పోలీసులు, బల్దియా సిబ్బంది నినాదాలు.
13/20
సుప్రీంకోర్టు అదనపు భవనంలో గురువారం న్యాయవాదుల గదులను ప్రారంభిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ. చిత్రంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్సింగ్
14/20
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు వారం రోజులుగా త్రివర్ణ వెలుగుల్లో జిగేల్మంటోంది. బురుజు ముందు భాగంలో భారీ జాతీయ జెండా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం కృష్ణానగర్లోని సర్వేపల్లి విద్యానిలయం పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. కృష్ణానగర్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ తీశారు. 500మీటర్ల జెండాతో కొండారెడ్డి బురుజును చుట్టేశారు!
15/20
చరిత్ర సాక్ష్యాలను భద్రపరచి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన మ్యూజియంపై అశ్రద్ధ కారణంగా లక్ష్యం నెరవేరడం లేదు. నిజాం నవాబుల కాలంలో యుద్ధాల్లో వాడిన రకరకాల ఫిరంగులను హైదరాబాద్ పబ్లిక్గార్డెన్స్లోని స్టేట్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. నిర్వహణ లోపం కారణంగా అవి తుప్పుపడుతున్నాయి. ఫిరంగి బండి చక్రాలు విరిగిపోయి దర్శనమిస్తున్నాయి. ఎండకు ఎండి వానకు తడిసి ఫిరంగుల దిమ్మెలకు నాచు పట్టి కనిపిస్తోంది. దీంతో చరిత్ర తెలుసుకోవాలని ఉత్సాహంతో వచ్చే సందర్శకులకు నిరాశే మిగులుతోంది.
16/20
విశాఖ నగరంలోని బీచ్రోడ్డులో హెచ్.పి.సి.ఎల్., సి.ఐ.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో గురువారం 1240 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
17/20
రాజస్థాన్ అజ్మేర్లో జైలులో ఉన్న తనకు సోదరి రాఖీ కడుతుండగా ఓ ఖైదీ భావోద్వేగం
18/20
ఎరిత్రియా, సూడాన్లకు చెందిన 40 మంది వలసజీవులతో వెళుతున్న చెక్క పడవ ఇటలీలో లాంపెడూసా ద్వీపం సమీపంలో తిరగబడింది. స్పెయిన్ స్వచ్ఛంద సంస్థ ‘ఓపెన్ ఆర్మ్స్’ ప్రతినిధులు, ఇటలీ తీరప్రాంత రక్షకదళ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి వారిని కాపాడారు.
19/20
మెక్సికోలో కరవు కరాళనృత్యం చేస్తోంది. పశువులు తినేందుకు పచ్చగడ్డి, తాగేందుకు నీరు సైతం దొరకడం లేదు. చెరువులు ఎండిపోయి నేల బీటలువారిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా అనేక మూగజీవాలు చనిపోతున్నాయి. చిచౌహా రాష్ట్రం మాన్యుయెల్ బెనావిడెస్ మున్సిపాలిటీ పరిధిలో మరణించిన జంతువుల మృత కళేబరాలివి
20/20
జమ్ములో గురువారం భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో రాళ్లు, బురదలో ఇరుక్కున్న కారు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం