News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1(15-08-2022)
Updated : 15 Aug 2022 09:41 IST
1/20
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘త్రివర్ణ ప్రకాశం’ పేరుతో ఒంగోలులో ఆదివారం మూడు కిలోమీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. రవిప్రియ మాల్సెంటర్ నుంచి మినీ స్టేడియం వరకు సాగిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు, ప్రజలు దాదాపు 10వేల మందికిపైగా పాల్గొన్నారు.
2/20
తెలంగాణ నిర్మల్లోని గాంధీచౌక్- కాల్వగడ్డ ప్రాంతంలో నివసించే నూకల అశోక్ ఇంటిపై గాంధీజీ విగ్రహం ఉంటుంది. ఆయన తాతయ్య నూకల విఠల్కు గాంధీ అంటే వల్లమాలిన అభిమానం. ఉప్పు సత్యాగ్రహం సమయంలో బాపూజీ అరెస్టయి.. జైలు నుంచి విడుదలయ్యాక స్వయంగా ఆయనను కలిసి వచ్చారు. అంతటితో ఆగిపోలేదు. తాను ముచ్చటపడి కొనుగోలు చేసిన ఇంటి ప్రవేశద్వారంపై రెండడుగులకు పైగా ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన వారసులు కూడా మహాత్ముడి జయంతి, వర్ధంతినాడు ఆ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా పిలుపుతో ఆ విగ్రహం వద్ద జాతీయజెండాను ఎగరేశారు.
3/20
ఎల్.బీ.నగర్ హస్తినాపురం సంతోషిమాత కాలనీకి చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ ముంజంపల్లి విద్యాధర్ 48 గంటలపాటు శ్రమించి నువ్వు గింజపై ఒకవైపు మువ్వన్నెల జెండా, మరోవైపు హిందీలో మేరా భారత్ మహాన్ రాసి దేశభక్తిని చాటారు.
4/20
5/20
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం అంబర్పేట ప్రేమ్నగర్లోని హైమావతి ఉన్నత పాఠశాల వారు రూపొందించిన 75 అడుగుల జాతీయ పతాకం ర్యాలీని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్, ప్రధానోపాధ్యాయుడు నిరంజన్ ప్రారంభించారు.
6/20
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్పై నిర్వహించిన సండే - ఫన్ డే సందర్శకులతో కిటకిటలాడింది. కరోనాతో నిలిచిపోయిన కార్యక్రమం ఆదివారం పునఃప్రారంభమైంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని విద్యుత్తు దీపాలు, జాతీయ జెండాలతో పరిసరాలను అలంకరించారు. తేలికపాటి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నగరవాసులు కుటుంబ సభ్యులతో సందడి చేశారు. తినుబండారాలను కొనుగోలు చేసి ఆనందంగా గడిపారు. పలువురు జాతీయ జెండాలను చేతబూని సెల్ఫీలు దిగారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సందర్శకులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు.
7/20
8/20
కుత్బుల్లాపూర్కు చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఉట్టిపడేలా అలకరించుకొని తిరుగుతూ సుచిత్రా కూడలి వద్ద కన్పించాడు.
9/20
గర్భిణులు, అనారోగ్యానికి గురైన గిరిజనులను ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం గూడేల్లోకి రాలేని పరిస్థితి. దీంతో కర్రకు డోలి కట్టి భుజాలపై మోస్తూ కిలోమీటర్ల కొద్దీ అడవి మార్గంలో ప్రధాన రహదారికి చేరుకొని అక్కడి నుంచి వాహనంలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇలా మోయడం కష్టం కావడంతో సులభంగా ఉండేలా మహబూబ్నగర్ జిల్లా కంబాలపల్లికి చెందిన షణ్ముఖరావు ఓ పరికరాన్ని తయారు చేశారు. డోలికి ఉండే కర్ర స్థానంలో ఐరన్ పైప్ ఉపయోగించి.. దానికి రెండు సైకిల్ చక్రాలను బిగించారు. పైపు మధ్యలో డోలి కట్టి అందులో రోగిని కూర్చోబెట్టి తీసుకెళ్లొచ్చు. రహదారిపై వెళ్లే సమయంలో మోసే వ్యక్తులపై భారం పడకుండా చక్రాల సహాయంతో నెడుతూ.. దారి సరిగా లేనప్పుడు చక్రాలను పైకి జరిపి డోలిలా మోసుకెళ్లొచ్చు. ఈ పరికరాన్ని మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం జరిగే స్వాతంత్ర్యదిన వేడుకల్లో ప్రదర్శించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నేవేషన్ సెల్ ఎంపిక చేసిందని షణ్ముఖరావు తెలిపారు.
10/20
అంబర్పేట అలీకేఫ్ చౌరస్తాలోని ఫంక్షన్ హాలులో లయన్స్ క్లబ్ హైదరాబాద్ ఉడాన్ అధ్యక్షురాలు పద్మావతిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకలకు అలనాటి సినీనటి రోజారమణి, దివంగత మేజర్ పద్మపాణి ఆచార్య సతీమణి చారులత ఆచార్య తదితరులు హాజరయ్యారు.
11/20
భాజపా ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు ఆధ్వర్యంలో ముషీరాబాద్లో 75 అడుగుల జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. ఎంపీ డా.కె.లక్ష్మణ్, భాజపా నేతలు గౌతమ్రావు, శ్యాంసుందర్గౌడ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, భాజపా కార్పొరేటర్లు రచనశ్రీ, రవికుమార్చారి, మాజీ కార్పొరేటర్ అరుణజయేందర్బాబు, నేతలు రమేష్రామ్, సీకేశంకర్రావు, బొల్లంపల్లి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
12/20
హైదరాబాద్: చాంద్రాయణగుట్టలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ నుంచి తిరంగా బైక్ ర్యాలీని హైదరాబాద్ డిప్యూటీ కమాండెంట్ అశ్విని కుమార్ మిశ్రా ప్రారంభించారు. అసిస్టెంట్ కమాండెంట్లు పి.ఎన్.తివారీ, మల్లె శివనాగరాజు, లైజెనింగ్ ఆఫీసర్ యేసుదాస్, చాంద్రాయణగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎ.మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
13/20
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని దుర్గంచెరువు తీగల వంతెనపై ఆదివారం రాత్రి పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఆ వెలుగుల్లో దుర్గంచెరువు పరిసరాలు కాంతులు విరజిమ్మాయి. నగరంలోని ట్యాంకు బండ్ పరిసరాలూ బాణసంచా ధగధగల్లో తళుకులీనాయి.
-ఈనాడు, హైదరాబాద్
14/20
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దిల్లీలో ఆదివారం నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రలో పాల్గొన్న విద్యార్థులు
15/20
పంజాబ్లోని జలంధర్లో జాతీయ జెండాలు చేతబూని నర్మదా నదిలో ఈత కొడుతున్న యువకులు
16/20
పాకిస్థాన్ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పంజాబ్లోని వాఘా సరిహద్దు వద్ద ఆదివారం భారత జవాన్లకు మిఠాయిలు పంచుతున్న ఆ దేశ సైనికులు
17/20
18/20
20 టన్నుల తాజా కూరగాయాలు పేర్చి.. 7,625 చ.అడుగుల విస్తీర్ణంలో సృష్టించిన జాతీయ జెండా ఆకారం బెంగళూరులో ఆకట్టుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని వేకూల్ సంస్థ ఈ ప్రయత్నం చేసింది. బెంగళూరులోని కన్నమంగలలో సంస్థ వితరణ కేంద్రంలో క్యారెట్, ముల్లంగి, బెండ, బీన్స్, క్యాప్సికం, బంగాళదుంపలతో దీన్ని రూపొందించారు. ప్రదర్శన అనంతరం ఈ కూరగాయలను అక్షయ పాత్ర ఫౌండేషన్కు అందజేశారు.
- న్యూస్టుడే, బెంగళూరు (సదాశివనగర)
19/20
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబయిన విజయవాడలోని సెక్రటేరియట్
20/20
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబయిన విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!