చిత్రం చెప్పే సంగతులు-1 (18-08-2022)
Updated : 18 Aug 2022 12:03 IST
1/30
సముద్ర కెరటాల ఉద్ధృతికి కాకినాడ జిల్లాలోని కొన్ని తీరప్రాంతాల గ్రామాలు వణుకుతున్నాయి. అలల తాకిడి నుంచి రక్షణకు ఉప్పాడ కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాళ్ల కట్ట, జియోట్యూబ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో సముద్ర జలాలు గ్రామాల్లోకి చొచ్చుకుపోతుండడం వల్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
2/30
సాలూరు మండలం తోణాం పంచాయతీ బొర్రమామిడివలస గ్రామంలో కనిపిస్తున్న ఈ రేకుల షెడ్డు పశువుల పాక అనుకుంటే పొరపాటే. ఇది ప్రాథమిక పాఠశాల. ఇక్కడ పది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గతంలో చేపట్టిన పాఠశాల భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో ఇందులో నిర్వహిస్తున్నారు. దీనిపై ఎంఈవో మల్లేశ్వరరావు మాట్లాడుతూ నాడు-నేడులో నిధులు మంజూరు కావాల్సి ఉందని తెలిపారు.
3/30
ఈ చిత్రం చూడగానే ఎడారిలా ఉందనుకుంటే... మీరు పొరపాటు పడినట్టే. విశాఖ నగర శివారులోని అగనంపూడి ఇసుక డిపోలో నిల్వలివి. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక విక్రయాలు చేపట్టేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి దిగుమతి చేశారు. నాసిరకంగా ఉందని వినియోగదారులు కొనుగోలు చేయకపోవడంతో... డిపో ఆవరణలోనే ఓ పక్కన ఇలా డంప్ చేసి వదిలేశారు. ఆ మేటలపై మొక్కలు పెరిగి ఇదిగో ఇలా కనిపిస్తోంది.
4/30
భీమిలి విచ్చేసే సందర్శకులను ఆకట్టుకోవటానికి ఇదివరకు ఏర్పాటు చేసిన లవ్భీమిలి ఆకృతి కొత్త అందాలను సంతరించుకుని చూపరులకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం భీమిలి వచ్చే పర్యాటకులు ఈ ఆకృతి వద్ద ఫొటోలకు పోటీపడుతున్నారు.
5/30
పాత గాజువాక లంకా మైదానంలో ఎస్వీ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 89 అడుగుల ఎత్తైన గణపతి మండపంలో విగ్రహానికి బుధవారం పాదపూజ నిర్వహించారు. ఖైరతాబాద్ విగ్రహ తయారీదారుల పర్యవేక్షణలో మండప పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పాద పూజ వేడుకలో గాజువాక వైకాపా ఇంఛార్జి తిప్పల దేవన్రెడ్డి, భాజపా నాయకులు నర్సింగరావు, కృష్ణంరాజు, శ్రీను పాల్గొన్నారు. ఈనెల 20వ తేదీ సాయంత్రానికి విగ్రహం తుది మెరుగులు దిద్దుకుంటుందని నిర్వాహక కమిటీ సభ్యుడు కె.గణేష్ తెలిపారు.
6/30
గుంటూరు జిల్లా పరిషత్ భవనం చుట్టూ మొక్కలు పెరిగి పెద్దవవుతున్నాయి. భవనం పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారింది. మొక్కల వేళ్లు భవనం లోపలికి దిగి పలు కార్యాలయాలు శిథిలావస్థకు చేరుతుండడంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. చుట్టూ ఏపుగా పెరిగిన చెట్లను తొలగించి కనీస మరమ్మత్తులైనా చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
7/30
తిరుమలలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొదటి ఘాట్ రోడ్డులోని మాల్వాడిగుండం జలపాతం ప్రవహిస్తోంది. శేషాచల అటవీ ప్రాంతంలో ఎత్తైన అందమైన ప్రదేశంలో ఏర్పడిన ఈ ప్రకృతి రమణీయమైన జలపాతాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
8/30
స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లికి చెందిన కొందరు యువకులు వినూత్నంగా తమ ఊరిలో ఎత్తుగా ఉండే కోనగుట్టపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పచ్చని గుట్టపై రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆ దృశ్యాన్ని ‘ఈనాడు’ క్లిక్ మనిపించింది.
9/30
చుట్టూ నిర్మానుష్యం. ఉన్నది ఒకటే ఇల్లు. ఆ ఒక్క ఇంటికి ఇంత పెద్ద నీటి ట్యాంక్ ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా..? కరివెన జలాశయ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన తిమ్మాజిపేట మండలం చింతగట్టుతండాను వేరే చోటకు తరలించారు. గ్రామస్థులు తమ నిర్మాణాలన్నింటిని తొలగించి సామగ్రిని తీసుకెళ్లిపోయారు. ఈ ఇంటి యజమాని తలుపులు, కిటికీలు అవసరమైన సామగ్రిని తీసుకెళ్లాడు.. భవనాన్ని కూల్చేయకుండా వదిలేశాడు. తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ట్యాంకు కూడా అలాగే ఉండిపోయింది. దీంతో ఆ ప్రాంతానికి కొత్తగా వెళ్లిన వారికి ఉన్న ఒక ఇంటికి ఇంత పెద్ద నీటి ట్యాంకు ఎందుకబ్బా అని ఆశ్చర్యం వేయక మానదు.
10/30
భీంపూర్ మండలంలోని ఇందూర్పల్లి-అర్లి-టి గ్రామాల నడుమ ఉన్న వంతెన సమీపంలోని గుంతలో ఆర్టీసీ బస్సు ఇలా కూరుకుపోయింది. ఆ బస్సును బయటకు తీసేందుకు ట్రాక్టరు ఉపయోగించాల్సి వచ్చింది. అధికారులు ఇప్పటికైనా రోడ్డు దుస్థితిని బాగు చేయాలని మండల వాసులు కోరుతున్నారు.
11/30
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రజ్యోత్సింగ్ చౌహాన్ రిథమిక్ యోగాసనంలో భాగంగా వేసిన పరివృత్త ఉపవిష్ఠ కోణాసనం అదిరింది. వజ్రోత్సవాలను పురస్కరించుకొని దిల్లీలోని ఎర్రకోట వద్ద ఆయా రాష్ట్రాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, యోగాసనాలు వేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ-32 పటాలంకు చెందిన ఈ ఎన్సీసీ విద్యార్థి పాల్గొన్నారు.
12/30
స్వస్థ్ రథం..కంటైనర్ వాహనంలో అన్ని సదుపాయాలతో నిర్వహిస్తున్న మొబైల్ ఆసుపత్రి ద్వారా బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో వైద్య శిబిరం నిర్వహించారు. చెన్నై కేంద్రంగా సేవలందిస్తున్న అపీరాన్ (ఏపీఈఐఆర్ఓఎన్) మొబైల్ మెడికేర్ మిషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వాహనానికి స్వస్థ్ రథ్గా నామకరణం చేశారు. మినీ ఆసుపత్రిలా ఉన్న ఈ వాహనంలో 120 రకాల వైద్య పరీక్షలు, సేవలు అందిస్తున్నారు.
13/30
విజయవాడ స్క్యూబ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ జగన్నాథ మందిరం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాలకు చెందిన సుమారు 2000కిలోల పుష్పాలతో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామికి మహా పుష్పాభిషేకం జరిపారు. చిన్నారులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.
14/30
15/30
రాజధాని నిర్మాణాలు జరుగుతున్న రోజుల్లో నిత్యం భారీ వాహనాల రాకపోకలతో సందడిగా ఉండే రహదారి ఇది. నిర్మాణ సామగ్రి తరలింపు, భారీ క్రేన్లు రావడానికి వీలుగా ఉండేది. మూడేళ్లుగా నిర్మాణ పనులు జరగకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగిపోయి కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లడానికి వీలులేనంతగా మారిపోయి కుంగిపోయాయి. ఇప్పుడు మనుషుల జాడ కూడా లేనంతగా తయారయ్యింది.
16/30
బండలాగుడు పోటీల్లో విజేతలుగా నిలవడానికి రాజధాని గ్రామమైన వెంకటపాలెంలో రైతులు ఎద్దులకు శిక్షణ ఇస్తున్నారు. ఎద్దులకు వెనుక టైరు కట్టి దానిపై రైతులు కూర్చుని రోడ్లు మీద పరుగులు పెట్టిస్తున్నారు.
17/30
ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం తిరిగి ప్రగతి భవన్కు వెళ్తుండగా.. బుధవారం సాయంత్రం తిరుమలగిరి ప్రాంతంలో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా, కాలిబాటపై తిరగనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పది నిమిషాలపాటు జనం కాస్త అసహనానికి లోనయ్యారు.
18/30
ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన విద్యార్థులు తీజ్ ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మహిళా వసతి గృహం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తొమ్మిది రోజులుగా బంజారా అమ్మాయిలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించిన తీజ్ను నిమజ్జనం చేశారు.
19/30
20/30
ముంబయిలో త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. బుధవారం రోడ్లపై ఇలా దర్శనమిచ్చాయి.
21/30
మెహిదీపట్నం: గుడిమల్కాపూర్ సాయిబాబా దేవాలయం చౌరస్తాలో హైమాస్టు ల్యాంపులు నిరంతరం వెలుగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో ఇక్కడి వీధి దీపాలు మొరాయించాయి. గ్రేటర్, వీధి దీపాల విభాగం అధికారులు మరమ్మతులు చేపట్టి వెలిగేలా చేశారు. అప్పటి నుంచి 24 గంటలూ వెలుగుతూనే ఉన్నాయి. విద్యుత్తు వృథాను అరికట్టి, దీపాలు సాయంత్రం వెలిగి, ఉదయం ఆరిపోయేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
22/30
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం నగరంలో చేపట్టిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించింది. స్థానిక ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య, ఇతర ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా 200 శిబిరాలు ఏర్పాటయ్యాయి. 10 వేల మంది రక్తదానం చేసినట్లు బల్దియా వైద్యాధికారులు అంచనా వేశారు. సనత్నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించగా, మహేశ్వరంలోని అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు.
23/30
24/30
జీవహింస నేరమని పలు చట్టాలు చెబుతున్నా పట్టించుకోని వైనమిది. ఓ యువకుడు మేకను తన ద్విచక్ర వాహనానికి సంచిలో కట్టేసుకుని ట్రాఫిక్లో ప్రమాదకరంగా తీసుకువెళుతున్న చిత్రం లక్డీకాపూల్లో కనిపించింది
25/30
స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రంలో వైభవంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో బుధవారం చార్మినార్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు చేపట్టిన తిరంగా బైక్ ర్యాలీని ఆయన మువ్వన్నెల జెండా ఊపి ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ సేవలను కొనియాడారు. రాష్ట్ర అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్కుమార్జైన్ తదితరులు పాల్గొన్నారు.
26/30
సిటీ బస్సులో ప్రయాణించే విద్యార్థినుల అవస్థలు తెలిపే ఈ చిత్రం అల్వాల్ బస్టాండ్ సమీపంలోది. వీరంతా శామీర్పేట తదితర శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిన వారే. కళాశాలల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు గంటలు పడిగాపులు కాస్తూ అరకొరగా ఉంటున్న బస్సుల్లో ఇలా కష్టాలతో వెళుతున్నారు.
27/30
అల్లాపూర్ డివిజన్ లక్ష్మినగర్లో ప్లాటు నం12 సమీప డ్రైనేజీ మ్యాన్హోల్ మూత కుంగిపోయి ప్రమాదకరంగా మారి వారం అవుతోంది. ఏ ప్రమాదం జరగక ముందే మరమ్మతులు చేయాలి.
28/30
కూకట్పల్లి సంగీత్నగర్ రావూస్ స్కూల్ సమీపంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. నిత్యం తొలగించకపోతుండడంతో అధ్వానంగా అపరిశుభ్రంగా మారి స్థానికులు అవస్థలు పడుతున్నారు.
29/30
ఇటీవల కొత్తగా ట్రాఫిక్ పోలీసులు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి పోలీస్స్టేషన్కు 2 చొప్పున ఈ బైకులనిచ్చారు. రద్దీ ప్రాంతాల వివరాలు వీరు తెలుసుకుని అక్కడికి వెళ్లి ట్రాఫిక్ను క్లియర్ చేస్తారు. ఆ బైకుపై వెళ్తున్న పోలీసు కూకట్పల్లిలో ఇలా కనిపించారు
30/30
మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో గూడ్సు రైలును ఢీకొన్న అనంతరం పట్టాలు తప్పిన ప్యాసింజర్ బోగీల వద్ద సహాయక చర్యలు. ఈ ప్రమాదంలో 50మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!