News In Pics : చిత్రం చెప్పే సంగతులు - (20-11-2022)
Updated : 20 Nov 2022 13:27 IST
1/22
యువ కథానాయకుడు నాగశౌర్య వివాహం వేడుకగా జరిగింది. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో అతడు మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు.
2/22
గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ దేవాలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ దర్శించుకున్నారు. ఆలయంలోని మూలవిరాట్కు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
3/22
కార్తిక మాసం.. ఆదివారం కావడంతో నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే మల్లన్న స్వామిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో దుకాణ సముదాయాలు సందడిగా కనిపించాయి.
4/22
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ శివారులోని గోదావరిలో మత్య్సకారుడు కృష్ణ శనివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లారు. వలకు చేపలతో పాటు వర్ణశోభితంగా ఉన్న తాబేలు చిక్కింది. దాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. విభిన్న రంగులతో ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ కూర్మం చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.
5/22
ధర ప్రియమైనా బిర్యానీ పేరు వింటే మాంసం ప్రియులకు నోరూరుతుంది. అలాంటిది హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ.10కే బిర్యానీ ఇస్తామంటే ఇక ఆగుతారా.. వందల మంది క్యూ కట్టారు. రూ.10 నాణెంతో వచ్చిన వారికి మాత్రమే ఈ ఆఫర్ అని చెప్పినా తొక్కిసలాట జరిగే స్థాయిలో జనం బారులు తీరారు. ఖమ్మం ముస్తఫానగర్లో కనిపించింది ఈ దృశ్యం.
6/22
హుజూరాబాద్ పోలీసు స్టేషన్లో సెంట్రీ డ్యూటీలో ఉన్నట్లు కనపడుతున్న ఈ దృశ్యాన్ని చూశారుగా... ఆయన నిజంగా పోలీసు అనుకుంటే పొరపడినట్లే... ట్రాఫిక్ పోలీసు రూపంలో ఉన్న బొమ్మను పోలీసుస్టేషన్ గేటు వద్ద గార్డ్ రూమ్లో విధుల్లో ఉన్న పోలీసు మాదిరిగా ఏర్పాటు చేశారు. స్టేషన్కు వచ్చే పలువురు నిజమైన పోలీసులాగా ఉన్నారని చర్చించుకుంటున్నారు.
7/22
రామచిలుక ఒకటి కనిపిస్తేనే ఆనందంగా చూస్తుంటాం. అలాంటిది పదుల సంఖ్యలో కనిపిస్తే ఆ దృశ్యం వర్ణనాతీతం. నిర్మల్ గ్రామీణ మండలంలోని రాణాపూర్ నుంచి నిర్మల్ వచ్చే మార్గంలో కనిపించిన దృశ్యాలివి.
8/22
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు పంపిన ధాన్యం వాహనాలు రోజుల తరబడి అక్కడే వేచి ఉంటున్నాయి. ధాన్యం నాణ్యత లేదని కొందరు, తరుగు పేరుతో క్వింటాకు 3 కిలోలు తగ్గిస్తామని మరికొందరు మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి బోధన్ వెళ్లే దారిలో నిత్యం ధాన్యం లారీలు ఇలా బారులు తీరి కనిపిస్తున్నాయి.
9/22
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్ దుస్థితి ఇది. తెదేపా హయాంలో రూ.30 లక్షల వ్యయంతో పాత ఆకాశ వంతెన కింది భాగంలో క్యాంటీన్ను నిర్మించారు. పూటకు 500 మంది భోజనం చేసేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లను తొలగించారు.
10/22
భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీలు పెరిగినా తట్టుకునే వరి వంగడాలను రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తాజాగా రూపొందించారు. ‘హీట్ టన్నెల్’లో వరి పండించి, వాతావరణంలో మార్పులకు తగ్గట్టుగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. వీటిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
11/22
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని పులికాట్ సరస్సులో ఆహారం కోసం వచ్చిన ప్లెమింగో పక్షులు కనువిందు చేస్తున్నాయి. అక్టోబరు, నవంబరు నెలల్లో సైబీరియా, నైజీరియా, ఆస్ట్రేలియా, కజకిస్తాన్ దేశాల నుంచి వేలాదిగా పక్షులు వస్తాయి. నేలపట్టులో సంతానోత్పత్తి చేసి మార్చిలో తిరిగి స్వస్థలాలకు వెళ్తుంటాయి.
12/22
నగరంలో మెట్లబావుల రూపు మారుతోంది. కొత్త సొబగులు అద్దుకుంటూ సరికొత్త పర్యాటక ప్రాంతాలవుతున్నాయి. ఈ జాబితాలో బన్సీలాల్పేట చేరనుంది. ఇక్కడ అభివృద్ధి చేసిన పురాతన మెట్ల బావిని ఈ నెలాఖరుకు ప్రారంభించనున్నారు. బావి పునరుద్ధరణతోపాటు పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాల పనులు చివరి దశలో ఉన్నాయి. నిజాం కాలంలో తాగునీటి అవసరాల కోసం నిర్మించిన దీన్ని నాగన్నకుంటగా పిలిచే వారని అధికారులు చెబుతున్నారు.
13/22
శీతాకాలం రాకతో మన్యం పులకిస్తోంది. మోతుగూడెం నుంచి సీలేరు, మారేడుమిల్లి మార్గంలో ఎత్తైన కొండలను అలముకుంటున్న మంచు పొరలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఈ అందాలను తిలకించడానికి తెల్లవారుజామున వణికించే చలిని సైతం లెక్కచేయకుండా సందర్శకులు ఈ ప్రాంతాలకు చేరుకుంటున్నారు.
14/22
తెదేపా ఎన్ఆర్ఐ విభాగం సాధికార కేంద్రం ఉచిత శిక్షణా కార్యక్రమం మొదటిదశలో శిక్షణ పొందిన వారితో పార్టీ అధినేత చంద్రబాబు. చిత్రంలో పార్టీ నేతలు వర్ల రామయ్య, అచ్చెన్నాయుడు.
15/22
పరిమితికి మించి బరువు మోయమంటే మనిషికైనా, వాహనానికైనా కష్టమే మరి. పాడేరులో ఓ ఆటోలో శనివారం పరిమితికి మించి లోడు వేశారు. చిన్న మలుపు వద్ద ముందు భాగంపైకి లేచింది. చుట్టుపక్కల వారంతా సహకరించి సామగ్రిని తీశారు.
16/22
‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర కథానాయకుడు అల్లరి నరేష్ కోరారు. చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం యూనిట్ సభ్యులు దువ్వాడ విజ్ఞాన్ కళాశాలలో సందడి చేశారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించి.. సినిమా విశేషాలు తెలియజేశారు. కథానాయికి ఆనంది, హాస్యనటుడు ప్రవీణ్, సరిలేరు నీకెవ్వరు ఫేమ్ సేతురామన్, దర్శకుడు ఏఆర్.మోహన్ హాజరయ్యారు.
17/22
కర్నూలు-హైదరాబాద్ జాతీయ రహదారిపై నగర శివారులో తుంగభద్ర నదిపై వంతెనకు మరమ్మతు పనులతోపాటు పుల్లూరు వద్ద ఇజ్తెమా కార్యక్రమం పెద్దఎత్తున జరుగుతోంది. ఫలితంగా శనివారం రాత్రి సమయంలో వాహనాలు రహదారిపై పెద్దఎత్తున నిలిచిపోయాయి.
18/22
నెల్లూరు విజయమహల్ రైల్వేగేటు సమీపంలోని శ్రీనివాస అగ్రహారం కృష్ణసాయి కన్వెన్షన్లో శనివారం శ్రీమతి నెల్లూరు-2022 అందాల పోటీల ఆడిషన్స్ ఉత్సాహంగా సాగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాంప్ వాక్తో చూపరులను కట్టిపడేశారు. ఈ నెల 27న శ్రీమతి నెల్లూరు గ్రాండ్ ఫైనల్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
19/22
కొవిడ్ నేపథ్యంలో అమలు చేసిన ‘ఇంటి నుంచి పని’ అవకాశాన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు క్రమంగా రద్దు చేస్తున్నాయి. దీంతో కార్యాలయాలకు వస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ ఐటీ కారిడార్లోని కార్యాలయాలు సందడిగా మారుతున్నాయి. ఈ క్రమంలో సిబ్బంది ఆహ్లాదకర వాతావరణంలో పనిచేసేలా వివిధ సంస్థలు తమ కార్యాలయాలను విభిన్నంగా తీర్చిదిద్దుతున్నాయి.
20/22
విదేశాల్లో ట్రాక్పై కార్లు పరుగెడుతుంటే టీవీల్లో చూసిన అభిమానులు.. ఇప్పుడు అలాంటి రేసులను హైదరాబాద్లో వీక్షించారు. దేశంలోనే మొట్టమొదటిగా ఇండియన్ రేసింగ్ లీగ్ నగరంలోని హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్లో శనివారం ఆరంభమైంది. లీగ్లో భాగంగా తొలి రౌండ్ పోటీలకు హుస్సేన్సాగర్ పరిసరాల్లో నిర్మించిన కొత్త ట్రాక్ వేదికైంది. ఈ రేసులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆదివారం ప్రధాన రేసులు జరుగుతాయి.
21/22
జాతీయ స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ పురస్కారాన్ని విజయనగరం జిల్లా జమ్ము ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్మోహనరావు అందుకున్నారు. శనివారం దిల్లీలోని ఆకాశవాణి భవన్లో నిర్వహించిన పురస్కార కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ నుంచి ఆయన ఈ అవార్డును స్వీకరించారు.
22/22
పవిత్ర కార్తిక మాసంలో కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఒకేరోజు రికార్డు స్థాయిలో స్వామివారి వ్రతాలు జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచే వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభించారు. ఈ ఒక్కరోజే అధిక సంఖ్యలో 11,497 వ్రతాలు జరిగాయి. వ్రతాలు, పూజలు, దర్శనాలు, ప్రసాద విక్రయాలు తదితరాల ద్వారా రూ.1,08,49,715 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?