News In Pics: చిత్రం చెప్పే సంగతులు -1 (30-11-2022)
Updated : 30 Nov 2022 13:24 IST
1/25
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘RC 15’(వర్కింగ్ టైటిల్) న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తయింది. ఇక్కడి అద్భుతమైన ప్రదేశాల్లో ఓ పాటను చిత్రీకరించినట్లు వెల్లడిస్తూ రామ్చరణ్ ఈ చిత్రాలను తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
2/25
ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు కలపర్రు టోల్గేట్ వద్ద స్వాగతం పలుకుతున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
3/25
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గాయకుడు, బిగ్ బాస్ ఫేం శ్రీరామ చంద్ర
4/25
పాన్ ఇండియా సినిమాగా విడుదలై ఓ ఊపు ఊపేసిన ‘పుష్ప ద రైజ్’ డిసెంబర్ 8న రష్యన్ భాషలో విడుదల కాబోతోంది. డిసెంబర్ 1న మాస్కో, 3న సెయింట్ పీటర్స్ బర్గ్లో స్పెషల్ ప్రీమియర్ వేయనున్నారు. దీంతో అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ రష్యా చేరుకున్నారు. అక్కడి అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు.
5/25
చుట్టూ పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం.. ఈ ప్రకృతి సోయగాల నడుమ ఓ గిరిజనుడు పూర్తిగా వెదురు కర్రలతో ఒక ఇంటిని నిర్మించుకున్నాడు. మారేడుమిల్లి పంచాయతీ పరిధిలోని కూడూరు గ్రామంలో ఉన్న ఈ నిర్మాణం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
6/25
గుంటూరు కలెక్టరేట్ రహదారిలోని మూడు బొమ్మల కూడలిలో చాచా నెహ్రూ విగ్రహం మెడకు ఉరివేసినట్లుగా వైకాపా ఫ్లెక్సీని కట్టారు. మన నాయకులను గౌరవించుకునేది ఇలాగేనా అని నగరవాసులు విమర్శిస్తున్నారు.
7/25
విశాఖ తీరంలో నావికాదళ సన్నాహక విన్యాసాల్లో మంగళవారం యుద్ధ విమానం నుంచి వదిలిన నమూనా బాంబుల వెలుగులిలా.
8/25
విశాఖ సాగర్నగర్ బీచ్ సమీపంలో ప్రమాదకరమైన అయిదడుగుల సముద్ర పాము మత్స్యకారుల వలకు చిక్కింది. సాగర జలాల్లో చాలా లోపల సంచరించే ఈ సర్పం విషపూరితమైనదని మత్స్యశాఖాధికారి డాక్టర్ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. వలలో పడిన దీనిని మత్స్యకారులు తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టారు.
9/25
బొప్పాయి చెట్టుకు కాసిన ఓ కాయ పక్షి ఆకారంలో పలువుర్ని ఆకర్షిస్తోంది. తణుకు పట్టణం పాతవూరుకు చెందిన కాకర్ల రాజేంద్రప్రసాద్ ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టుకు ఈ కాయ ఉండటంతో అటుగా వెళ్లేవారు వింతగా చూస్తున్నారు.
10/25
వర్షాలతో తడిసి ముద్దైన నెల్లూరు జిల్లాను ప్రస్తుతం పొగమంచు కమ్మేస్తోంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహన చోదకులకు దారి సరిగా కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చలితో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
11/25
కలపతో శిల్పాలను మలుస్తున్న ఈయన పేరు మర్రి గోపాల్రెడ్డి. వయసు 80. హనుమకొండ నగరం అడ్వకేట్స్ కాలనీలో నివాసం ఉండే ఈయన తన ఇంటినే ప్రదర్శనశాలగా మార్చారు. వందలాది సంఖ్యలో కలప, టెర్రాకోట్, రాతి శిల్పాలను మలుస్తున్నారు. ఉపాధ్యాయుడిగా 20 ఏళ్ల క్రితమే పదవీ విరమణ చేసిన ఈయన కళాఖండాలను మలచడమే వ్యాపకంగా పెట్టుకున్నారు.
12/25
ద్విచక్ర వాహనంపై గడ్డి భలే పెంచారే అని అనుకుంటున్నారా? అది ప్లాస్టిక్తో చేసిన ఆకుపచ్చని స్పాంజ్ మ్యాట్. బండి యజమాని అలంకరించుకున్నారు. దుబ్బాక పట్టణానికి చెందిన అనిల్కుమార్ తన దుకాణాన్ని ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా లోపల గోడలకు ప్లాస్టిక్ గడ్డిలా కనిపించే మ్యాట్ అమర్చారు. మిగిలిన ముక్కలను తన ద్విచక్ర వాహనంపై పెట్టారు. వాహనం వినూత్నంగా కనిపించేలా చేశారు.
13/25
మంచిర్యాల జిల్లాకు చెందిన మల్లయ్య, శాంతమ్మ దంపతులు ఖమ్మం నగరంలో మైకులో ప్రచారం చేస్తూ, గాడిద పాలు అమ్మారు. చలికాలం శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారు గాడిద పాలు తాగితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. జండూబామ్ సీసా పరిమాణంలో రూ.200 చొప్పున విక్రయించారు. రోజుకు రూ.2వేల వరకు సంపాదిస్తూ జిల్లాలు దాటి వ్యాపారం చేస్తున్నామని చెప్పారు.
14/25
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు వట్టిమల్ల లక్ష్మి వేసిన జొన్న చేనులో కొన్ని మొక్కలు 20 అడుగుల ఎత్తు వరకు పెరిగి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎలాంటి రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతిలో పక్షుల ఆహారం కోసం మాత్రమే జొన్న పంటను పండించామని మహిళా రైతు లక్ష్మి కుమారుడు పూర్ణచందర్ తెలిపారు.
15/25
ఇంటి నుంచి బయల్దేరిన విద్యార్థులు తరగతి గది చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిపడినన్ని బస్సులు లేకపోవడమే ఇందుకు కారణం. శివారు ప్రాంతాల్లో చదువుకుంటున్న వారి పరిస్థితి మరింత ఘోరం. ఎదురు చూడగా చూడగా వచ్చిన ఒకటీ రెండు బస్సులు క్షణాల్లో నిండిపోతున్నాయి. నిలబడి వెళ్దామన్నా చోటు లేనిస్థితిలో నరకం అనుభవిస్తున్నారు. ఈ చిత్రాలు మెహదీపట్నంలోనివి.
16/25
మంగళవారం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్ పద్మారావునగర్ స్కందగిరి ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
17/25
రష్యాదళాలు ప్రయోగించిన మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ షెల్స్ ఇవి. ఉక్రెయిన్లోని ఖర్కివ్లో ఆ దేశ సైన్యం వీటన్నింటినీ ఇలా ఓ చోట పోగుచేసి ప్రదర్శిస్తోంది.
18/25
మాదాపూర్ మెట్రో స్టేషన్ పక్కన జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 38 రహదారి గుంతలమయంగా మారింది. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో మురుగు నీరు నిలుస్తుండటంతో దుర్వాసన వస్తోంది.
19/25
భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం సాష్టాంగ నమస్కారం చేశారు.
20/25
ట్యాంకుబండ్కు నిత్యం వచ్చే సందర్శకులకు ఆహ్లాదం కల్పించేందుకు అనేక ఏర్పాట్లు చేస్తున్నా తర్వాత నిర్వహణ పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న ఓ ఫౌంటేన్ చాలా రోజులుగా పనిచేయడం లేదు. మరమ్మతులు చేయించాల్సిన యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.
21/25
కశ్మీర్లోని ఓ దుకాణంలో విక్రయానికి ఉంచిన కూరగాయలు ఇవి. చూడడానికి వనమూలికల్లా ఉన్నాయనేగా మీ సందేహం. శీతాకాలం వచ్చిందంటే కశ్మీర్ అంతటా మంచు దుప్పటి పరుచుకుంటుంది. కూరగాయల సాగు దాదాపు అసాధ్యం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కశ్మీరులు ఎండాకాలంలో వంకాయలు, టమాటాలు, ఆనపకాయలు, తుర్నిప్ వంటివి ఎండబెట్టుకుని దాచుకుంటారు. వాటిని శీతాకాలంలో వినియోగించుకుంటారు. దుకాణాల్లోనూ వీటిని విక్రయిస్తారు.
22/25
ఈ పక్షిని చూస్తే రెండు తలలు ఉన్నట్లుగా కనిపిస్తుంది కదూ! వాస్తవానికి అక్కడ రెండు పక్షులు ఉన్నాయి. నీటిలో ఉన్న పక్షి తల. ఒడ్డున ఉన్న పక్షి తల కలిసి ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఆదిలాబాద్ జిల్లా అంకోలి సమీప నీటి వనరులో కనిపించిన ఒరియంటల్ డాక్టర్ అనే ఈ నీటి పక్షులను వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ తన కెమెరాలో బంధించారు.
23/25
గృహాలంకరణకు హైదరాబాద్ నగరవాసులు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో రహదారుల పక్కన వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు విభిన్న కళాకృతులను విక్రయిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సమీపంలో ఏర్పాటైన ఓ దుకాణంలో వెదురుతో తయారైన ఈ ఆకృతులు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
24/25
రెండు పుష్కరాల క్రితం పొలాలు, కొండలతో ఉన్న గ్రామం నేడు ఆకాశహర్మ్యాలు, లక్షలాది మంది పని చేసే ఐటీ కార్యాలయాలు, కీలక ప్రాంతాలను కలిపే ఆధునిక రహదారులు, కూత లేకుండా పరుగుపెట్టే మెట్రో రైళ్లతో విశ్వవ్యాప్త సైబరాబాద్గా పేరుపొందింది. రహేజా మైండ్ స్పేస్ వద్ద తీసిన చిత్రమిది.
25/25
చేవెళ్ల పట్టణంలోని ఎత్తయిన కొండపై నిజాం కాలంలో రాజు విడిది కోసం డాక్బంగ్లా నిర్మించి రెండు అడవి మల్లె చెట్లను పెంచారు. రెండేళ్ల క్రితం ఈదురుగాలులకు ఓ చెట్టు పడిపోయింది. మరో చెట్టు ఈ ఏడాది కురిసిన వర్షాలకు విరబూసింది. చల్లని గాలి వీచినప్పుడల్లా మల్లెపూల వాసన పరిసరాల్లో వెదజల్లుతుండటంతో అక్కడికి వెళ్లిన వారు మంత్రముగ్ధులవుతున్నారు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’