News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (01-12-2022)
Updated : 01 Dec 2022 13:50 IST
1/29
సినీనటి జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించున్నారు. బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి కాలినడకన ఆమె తిరుమల చేరుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
2/29
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ రూపొందించిన వర్చువల్ రియాలిటీ సినిమా ఎక్స్పీరియన్స్ ‘లే మస్క్’ను సూపర్స్టార్ రజనీకాంత్ వీక్షించారు. ఆ ఫొటోను రెహమాన్ తన ఇన్స్టా ఖాతాలో పంచుకున్నారు.
3/29
‘పుష్ప ద రైజ్’ ఈ నెల 8న రష్యాలో విడుదల కానుంది. అందులో భాగంగా మాస్కోలో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అర్జున్, రష్మిక పాల్గొని సందడి చేశారు.
4/29
రాజ్తరుణ్ కథానాయకుడిగా ఏ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తాజాగా ‘తిరగబడర స్వామి’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ కొట్టారు.
5/29
ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ట్రాన్స్జెండర్లు
6/29
హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు డిసెంబరు 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో తెలంగాణ పోలీస్ అకాడమీలో స్థల పరిశీలన చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
7/29
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లోని రూపఖేడి వద్ద సాగుతోంది. యాత్రలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ పాల్గొని రాహుల్కు సంఘీభావం తెలిపారు.
8/29
పరిమాణం చిన్నదైనా కొల్లేరు పక్షి ప్రేమికులను కనువిందు చేసే విహంగం ఉల్లంకి పిట్ట (కామన్ శాండ్పైపర్). చూసేందుకు పిచ్చుక ఆకారంలో ఉండి 250- 400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. చిన్న చేపలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. ప్రస్తుతం కొల్లేరులో 4 వేల వరకు ఈ రకం పక్షులు ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.
9/29
ఈ చెట్టు ఆకుపై పేరు రాసుకుంటే సుమారు పదేళ్లపాటు చెక్కు చెదరదు. దీని శాస్త్రీయ నామం క్లూజియా.. రోజియా. దీన్ని ఆటోగ్రాఫ్, సిగ్నేచర్ చెట్టుగా కూడా పిలుస్తుంటారు. పెదవాల్తేరు జీవ వైవిధ్య ఉద్యానవనంలో ఈ ఆటోగ్రాఫ్ మొక్కలను పెంచుతున్నారు.
10/29
విశాఖ సాగర్నగర్ సముద్రతీరంలో మత్స్యకారుల వలకు దాదాపు ఒకే పరిమాణంలో ఉన్న కొంగమూతి కదుర్లు చేపలు చిక్కాయి. రుచికరమైన చేపలుగా పేరొందిన వీటిని ఆహారంగా మాత్రమే వినియోగిస్తారని, కిలో సుమారు రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలుకుతాయని చెప్పారు.
11/29
విజయవాడ ధర్నాచౌక్లో నిరసన కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలోకి ఎక్కిస్తుండగా ఓ సన్నివేశం జరిగింది.. గుణదల ఎస్సై సత్య శ్రీనివాస్ తన చిన్ననాటి పాఠశాల మిత్రుడు తూర్పుగోదావరికి చెందిన సూరిబాబును గుర్తుపట్టారు. పక్కకు పిలిచి ఆప్యాయంగా మాట్లాడారు. తర్వాత అందరితోపాటుగా అతన్ని కూడా వ్యానులో ఎక్కించి పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు.
12/29
చల్లని వాతావరణం.. కొండ లోయల నడుమ జలపాతాలు.. ప్రకృతి సోయగాలతో పాటు పూల అందాలు మన్యంలో ఆహ్లాదాన్నిస్తున్నాయి. జైపూర్ కూడలి నుంచి చాపరాయి జలవిహారి వరకు రోడ్డుకు ఇరువైపులా పసుపు వర్ణంతో కూడిన పొద్దు తిరుగుడు పూల తోటలు పర్యటకులను కట్టి పడేస్తున్నాయి. పొద్దు తిరుగుడు పూల తోటల్లో సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదంగా గడుపుతున్నారు.
13/29
కొణిజర్ల మండలం పల్లిపాడు నుంచి ఏన్కూరుకు వెళ్లే బైపాస్ మార్గంలో అంజనాపురం వద్ద కనిపించిన దృశ్యమిది. రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడటంతో స్థానికులు రెండు కర్రలకు ప్లాస్టిక్ కవర్లు కట్టి ప్రమాద హెచ్చరికగా ఏర్పాటు చేశారు. వాహనదారులు ఈ సూచికను గమనించి జాగ్రత్తగా ప్రయాణం సాగిస్తున్నారు.
14/29
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చినదొడ్డిగుంటలో నల్ల కోతిపిల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. చెట్టుపై సాధారణ కోతిపిల్లతో కలిసి నల్లకోతి గంతులు వేస్తూ కనిపించింది. దాని మెడలో తాడు ఉంది. దీనిపై రంగంపేట పశు సంవర్ధకశాఖ అధికారి షేక్ జహంగీర్ స్పందిస్తూ.. జన్యుపరమైన లోపాలతో పుట్టిన పిల్లల శరీరంలో అనేక మార్పులు వస్తాయని, ఈ కోతిపిల్లకు రంగులో మార్పు వచ్చిందని తెలిపారు.
15/29
కృష్ణా జిల్లా పామర్రులోని బాపూజీపేటలో అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం ఒకే భవనంలో నడుస్తున్నాయి. ఇళ్ల నుంచి వస్తున్న మురుగు నీటి కాలువ నిర్వహణ సక్రమంగా లేక నీరంతా భవనం చుట్టూ చేరుతోంది. పిల్లలు ఆటలాడుతున్నప్పుడు ప్రమాదవశాత్తూ మురుగులో పడిపోయే అవకాశాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
16/29
ఇళ్లపైన సాధారణంగా నీటి ట్యాంకులు చతురస్ర, దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్లో చేప ఆకారంలో నిర్మించారు. ఇది చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
17/29
విశాఖ సాగర తీరంలో ఈ నెల 4వ తేదీన జరగనున్న నౌకాదళ దినోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన నమూనా విన్యాసాలు వీక్షకులను అబ్బురపరిచాయి. ఇసుకలో, సాగర జలాల్లో పేల్చిన బాంబులతో రేగిన మంటలను, త్రివర్ణ పతాక రంగుల ఆకారంలో పైకి లేచిన జలాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
18/29
ఏలూరు జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెంకు చెందిన లక్ష్మీనారాయణ ఇప్పటి వరకు 12సార్లు.. 12 విధాలుగా (పాదయాత్ర, బస్సు, రైలు, మౌనవ్రతం ఆచరిస్తూ, భోజనం చేయకుండా..) శబరిమలకు వెళ్లారు. ఈ ఏడాది పదమూడోసారి ఇలా గుర్రపు బండిలో 3 రోజుల క్రితం పయనమయ్యారు. పాలకొల్లుకు చెందిన ఈ బండిని రూ.1.85 లక్షలకు మాట్లాడుకుని యాత్ర సాగిస్తున్నట్లు చెప్పారు.
19/29
దుర్గం చెరువు నుంచి రోడ్డు నం.45 మార్గంలో ఉన్న అనుసంధాన దారులన్నింటినీ మూసేశారు. ఎందుకు మూసేశారో సూచికలు పెట్టలేదు. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
20/29
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కల గుట్ట పంచాయతీ పరిధి గాంధారిఖిల్లా పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలివీ. చుట్టూ ఎత్తయిన కొండలు.. మధ్యలో నిలిచిన నీరు. ఆ నీటిలో కొండల ప్రతిబింబం. అక్కడికి కొద్ది దూరంలోని అందుగుల పేట శివారు అటవీ ప్రాంతంలో జాలువారుతున్న క్షీర జలపాతమూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
21/29
నడిరోడ్డుపై చేతిపంపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడ్డిఅన్నారం డివిజన్లోని పటేల్నగర్ కాలనీలో సుమారు మూడు దశాబ్దాల క్రితం ఓ చేతిపంపును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది నిరుపయోగంగా మారింది. ఘనత వహించిన మన అధికారులు.. ఆ చేతిపంపును తొలగించకుండానే సీసీరోడ్డు వేశారు. రోడ్డుమధ్యలో ఉండడంతో రాత్రివేళ వాహనదారులు దానిని ఢీకొట్టి గాయాలపాలవుతున్నారు.
22/29
ప్రతీ ఒక్కరూ డిజిటల్ పద్ధతిలో నగదు చెల్లింపులను పాటిస్తున్నారు. తామేం తక్కువా అన్నట్లు ఈ గంగిరెద్దుల వాళ్లు గంగిరెద్డు ముఖానికి క్యూర్ కోడ్ ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ఎస్సార్నగర్ కమ్యూనిటీహాల్ కూడలిలో కనిపించిందీ దృశ్యం.
23/29
పోలీసు యూనిఫాంతో కనిపిస్తున్న వీరంతా జీడిమెట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8, 9 తరగతుల విద్యార్థులు. సమాజంలో నేరాలు అరికట్టాలంటే విద్యార్థి దశ నుంచే అవగాహన ఉండాలనే ఉద్దేశంతో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ (ఎస్పీసీ) ఏర్పాటుకు 2018లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఇచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 40 పాఠశాలల విద్యార్థులు ఎస్పీసీలో ఉన్నారు. వీరికి రోడ్డు భద్రత, పోలీసు స్టేషన్లు, కోర్టు కేసులు, జైళ్ల సందర్శన వంటి 15 అంశాల్లో శిక్షణ ఇస్తారు.
24/29
అందాల శ్రీమతి కిరీటం కోసం మహిళామణులు పోటీపడ్డారు. హైదరాబాద్కు చెందిన మిసెస్ ఇండియా తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మమతా త్రివేది ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిసెస్ ఇండియా తెలంగాణ 2022-23’ 5వ ఆడిషన్స్ బుధవారం బంజారాహిల్స్లోని ఓ హోటల్లో నిర్వహించారు. 20 నుంచి 70 ఏళ్ల వరకు వయసున్న శ్రీమతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాంప్పై అందంగా నడుస్తూ సందడి చేశారు.
25/29
పొడవాటి మీసాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ వ్యక్తి మంగన్ఖాయ్ సోలంకి. ఎన్నికల్లో హిమ్మత్నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
26/29
మేడ్చల్ పట్టణంలోని రైల్వే కాలనీ సూచిక బోర్డు పొదల్లో ఉంది. దారి తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు.
27/29
ఉదయం 8 గంటలు దాటినా హైదరాబాద్ నగరాన్ని మంచు వీడడంలేదు. జగద్గిరిగుట్ట నుంచి షాపూర్నగర్ వెళ్లే బుధవారం ఉదయం హెచ్ఎంటీ దారిని కమ్మేసిన మంచు.
28/29
నిర్మల్ జిల్లా మామడ మండలం రాంపూర్ శివారులోని నడుమ గూడెం అడవిలోని చేనులోనే మూడు కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. అక్కడ విద్యుత్తు వ్యవస్థ లేదు. ఈ స్థితిలో ఓ ఆలోచన మెరుపులా మెరిసింది. పురుగుముందు పిచికారీ చేసే స్ప్రేయర్ బ్యాటరీతో బల్బు వెలిగించుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. ఉదయం పూట పక్క ఊరిలో తెలిసిన వారి ఇంటికి వెళ్లి ఛార్జింగ్ పెట్టుకుని.. రాత్రి వేళలో బల్బును వెలిగించుకుంటున్నారు.
29/29
జేఎన్టీయూ నుంచి మలేసియన్ టౌన్షిప్ పైవంతెన సమీపంలోని ఏసీ బస్టాప్ ఇది. ప్రయాణికుల కోసం నిర్మించిన షెల్టర్ ప్రకటనలకు మాత్రమే ఉపయోగపడుతోంది. ఎప్పుడూ మూసి ఉండడంతో ప్రయాణికులు ఇక్కడ వేచి ఉండడం లేదు. మరోవైపు లోపల గోడలు పెచ్చులూడుతున్నాయి.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు