News In Pics: చిత్రం చెప్పే సంగతులు (05-12-2022)
Updated : 05 Dec 2022 12:44 IST
1/23
నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద పావురాలు గుంపులుగుంపులుగా ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి. పలువురు సందర్శకులు తమ చిన్నారులతో వచ్చి వాటికి ఆహారంగా ధాన్యపు గింజలు వేస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు.
2/23
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాసర ‘వేద భారతి పీఠ’ వేద విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వేద విద్యార్థుల నుంచి ఆశీర్వచనం పొందారు. భాజపా అధికారంలోకి వస్తే వేద పాఠశాలల సంఖ్య మరింతగా పెంచేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.
3/23
కడియం నర్సరీల్లో సన్డ్రాప్ ఫ్రూట్ అబ్బురపరుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ఈ మొక్క నుంచి తొలిపంట పండింది. నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు మాట్లాడుతూ విటమిన్ సి అధికంగా ఉండే ఈ ఒక్క పండు నుంచి ఏడు గ్లాసుల రసం తయారు చేయవచ్చని, మళయాల సూపర్స్టార్ మమ్ముట్టి ఈ మొక్కలను ఆయన గార్డెన్లో స్వయంగా పెంచుతున్నారని చెప్పారు.
4/23
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు ఆమెకు ఇస్తీకఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
5/23
రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక ఆదివారం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్ముకు విజయవాడ పోరంకిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించింది. ఈ సభకు హాజరయ్యేందుకు కొందరు తమకు అందిన ఆహ్వానపత్రాలు తీసుకొని, చంటిపిల్లలతో వచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో వారు నిరాశగా వెనుదిరిగారు.
6/23
చిత్రంలోని నారు.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి- నాయుడుపేట మార్గంలో జాతీయ రహదారి పక్కన కన్నలి వద్ద ఉన్న నర్సరీలోనిది. మిషన్ నాటుతో చాలా తక్కువ సమయంతోపాటు, కూలీల అవసరం ఉండదు, వరిలో పిలకలూ ఎక్కువ వస్తాయని నర్సరీ నిర్వాహకుడు సురేష్ తెలిపారు.
7/23
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని జీఎన్టీ రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న చెట్లను నరికి వాటికి వైకాపా జెండా తరహా రంగులు వేశారు. ఇప్పటికే ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలకు ఇలాంటి రంగులు వేసి విమర్శలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ చెట్లకూ రంగులు వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పురపాలక కమిషనర్ శ్రీకాంత్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా ‘చెట్లు ఏపుగా పెరగడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని తొలగించాం. గుర్తు తెలియని వ్యక్తులు వాటికి రంగులు వేశారు’ అని తెలిపారు.
8/23
హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన వెంకటరెడ్డి ఇంట్లో 10 అడుగులకు పైగా పెరిగిన వాము మొక్క ఇది. సాధారణంగా ఈ మొక్క ఒకటి నుంచి మూడు అడుగుల వరకు పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన విత్తనం, జన్యులక్షణం వల్ల ఇలా మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
9/23
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రానికి ఏటా విదేశీ విహంగాలు వచ్చి సందడి చేస్తాయి. వీటిని చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. అలాంటి కేంద్రాన్ని శుభ్రంగా ఉండచాల్సింది పోయి.. చెత్తతో నింపేస్తున్నారు. వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో పర్యాటకులు ఇబ్బందిపడుతున్నారు.
10/23
కొన్నాళ్లుగా హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. తెల్ల గీత దాటితే భారీగా జరిమానా విధిస్తున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ఖైరతాబాద్ కూడలి వద్ద ఆదివారం రాత్రి జీబ్రా లైన్ దాటి వాహనదారులు ఇలా ముందుకు వెళ్లారు.
11/23
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు అధిక వేగంతో దూసుకెళ్తుంటాయి. ఈ రోడ్డు మధ్యలో ఉన్న విభాగానిల్లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత హెచ్ఎండీఏ పారిశుద్ధ్య సిబ్బందిదే. ప్రస్తుతం వారంతా ప్రమాదకరంగా విధులు నిర్వహించాల్సి వస్తోంది. పనులు చేసే ప్రదేశాల్లో రక్షణ లోపించడంతోపాటు సూచికల ఏర్పాటునూ అధికారులు పూర్తిగా విస్మరించారు. పనుల్లో నిమగ్నమైన వేళ ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. తాము ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
12/23
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాజిల్లా పోరంకి ఎం.రిసార్ట్లో ఆదివారం పౌరసన్మానం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి కాన్వాయ్ రావడానికి 5 నిమిషాల ముందు రిసార్టు ఎదుట ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం ఒరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దానిని నిలబెట్టి పడిపోకుండా నిలువరించారు. రాష్ట్రపతి వచ్చి వెళ్లేంతవరకూ ఆ స్వాగత ద్వారం పడిపోకుండా పట్టుకునే ఉన్నారు.
13/23
సెలవు రోజని మేఘాలు దాటి వచ్చేందుకు సూరీడూ బద్దకించినట్లున్నాడు. దీంతో ఆదివారం ఉదయం హైదరాబాద్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. కనీసం 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలూ కనిపించని పరిస్థితి. ఉదయం 9 గంటల వరకు వాహనదారులు నెమ్మదిగా ముందుకు కదిలారు. మరోవైపు హుస్సేన్ సాగర్ను మంచు కమ్మేయగా మధ్యలోని బుద్ధుడి విగ్రహం సైతం మసకమసకగా కనిపించింది.
14/23
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారుపల్లె రావులపల్లిలో ఉన్న పాండవుల గుట్టలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చెట్ల పసరుతో వేసిన వివిధ రకాల బొమ్మలు ఇక్కడ కనిపిస్తాయి. కొండపైన పాము పడగ ఆకారంలో ప్రధాన గుహ కనిపిస్తుంది. ఏనుగు ఆకారం, శంఖం ఆకారంలో ఉన్న గుహలు దర్శనమిస్తాయి.
15/23
హైదరాబాద్ నగరంలో క్రిస్మస్ సందడి మొదలైంది. ఇప్పటికే కేక్ మిక్సింగ్ వేడుకలు జరుగుతుండగా వివిధ రకాల అలంకరణ సామగ్రితో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దుకాణదారులు ప్రయత్నిస్తున్నారు. మియాపూర్లో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ వద్ద యువత ఫొటోలు దిగుతూ సందడి చేస్తోంది.
16/23
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని సెయిన్ నదిలో ఆదివారం నిర్వహించిన సూపర్ స్టాండప్ పాడిల్(చిన్న తెప్ప) పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు
17/23
మధ్యప్రదేశ్లోని లాలాఖేడి గ్రామంలో జానపద గాయకుడు ప్రహ్లాద్ సింగ్ టిపానియాతో రాహుల్
18/23
గుంటూరులో రాధామాధవ కల్చరల్ అసోసియేషన్, రాధామాధవ నృత్య క్షేత్రం, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి నృత్య పోటీలు ఆదివారం మరింత హుషారుగా సాగాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు బృంద నృత్యాలను ప్రదర్శించారు.
19/23
అహోబిలం లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ఆదివారం ఏకాదశి సందర్భంగా విశేష పూజలు చేశారు. ఉదయం ఆలయ ముఖద్వార మండపంలో ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు.
20/23
పాఠ్య పుస్తకాలతో, కంప్యూటర్లతో ఆరు రోజులు కుస్తీ పట్టే కుర్రోళ్లు, బాలలు ఆదివారం వచ్చిందంటే సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి పోటెత్తుతారు. ఆదమరచి ఆటల్లో మునిగితేలుతారు.
21/23
ట్యాంక్బండ్కు వచ్చే సందర్శకుల్లో దివ్యాంగుల వాహనాల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మించారు. కొందరు సందర్శకులు వాటికి అడ్డంగా బండ్లు నిలపడం వల్ల నిర్మాణ లక్ష్యం నెరవేరకపోగా, ఇబ్బంది కలుగుతోంది.
22/23
రద్దీ రహదారుల పక్కన బండ్లు నిలిపి అల్పాహారాలు చేసొచ్చే లోపు పోలీసులు చలానాలు రాసేస్తారు. పెద్ద వాహనాలైతే కదలకుండా టైర్లకు తాళం తగిలిస్తారు. ఈ జంజాటాలేవీ లేకుండా ఆరుబయట ఆహారాన్ని ఆస్వాదించేలా మాసబ్బ్యాంకు విజయనగర్ కాలనీలో జీహెచ్ఎంసీ ఫుడ్స్ట్రీట్ ఏర్పాటు చేసింది. పక్కకు వాహనాలు ఆపి, కాలిబాటపైన కూర్చొని కోరుకున్న తిండి తినొచ్చు.
23/23
కాకతీయ వైద్య కళాశాల వార్షికోత్సవం, మెడికల్ ఫెస్ట్లో భాగంగా ఆదివారం ఉదయం కేఎంసీ నుంచి హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వరకు వైద్య విద్యార్థులు మానసిక ఆరోగ్యం మనిషికి అసలైన ఆరోగ్యం అని తెలియజేస్తూ 5 కి.మీ పరుగు నిర్వహించారు.ఈ సందర్భంగా యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ అలరించారు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’