News In pics: చిత్రం చెప్పే సంగతులు
Updated : 27 Jun 2022 11:41 IST
1/29
చింతకాని మండలం గాంధీనగర్ సమీపంలో మూడో రైల్వేలైను పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మట్టిని
తీసుకొచ్చిన ఓ భారీ టిప్పర్(లారీ) వెనుక చక్రాలు కొద్దిలోతు మట్టిలో కూరుకుపోయాయి. డ్రైవర్ టిప్పర్ను ముందుకు తీసుకెళ్లేందుకు
ప్రయత్నించగా మట్టి లోడ్ అధికంగా ఉండటంతో ముందు చక్రాలు రెండూ ఇలా నాలుగు అడుగుల మేర పైకి లేచాయి. ఈ దృశ్యాన్ని
‘న్యూస్టుడే’ క్లిక్ మనిపించింది.
2/29
యాదాద్రి ఆదివారం భక్తాద్రిగా మారింది. లక్ష్మీనారసింహుని క్షేత్రానికి ఆదివారం భారీగా భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకొని
తమ మొక్కులు చెల్లించుకున్నారు.
3/29
కాలికి గాయమై ఎగరలేని స్థితిలో ఉన్న ఓ పిచ్చుకకు కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది సపర్యలు చేశారు.
సిద్దిపేటలో కేంద్రీయ విద్యాలయ ఆవరణలో చెట్టుపై నుంచి ఎగురుతూ వెళ్తున్న పిచ్చుక అకస్మాత్తుగా కిందపడిపోయింది. ఎంతకూ
ఎగరలేకపోతున్న పక్షిని చూసిన సిబ్బంది పట్టుకొని నీరు తాగించారు. ఆహారం తినిపించారు. కాలికి గాయమైందని గ్రహించి ఎగిరేలా
చేసేందుకు యత్నించారు. కాసేపు తండ్లాడిన పిచ్చుక అనంతరం అక్కడి నుంచి ఎగిరిపోయింది.
4/29
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల సమీపంలోని దుసపాటిలొద్ది జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోంది. దట్టమైన అడవిలో
ఎత్తైన గుట్ట నుంచి పాలనురగలా జాలువారే నీటిధారలు కనువిందు చేస్తున్నాయి. కొంగాల గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల
దూరంలోని ఈ జలపాతానికి అడవిలో కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఇదే మండలంలోని బొగత జలపాతాన్ని చూసేందుకు వచ్చిన
సందర్శకులు, స్థానికులు ఇక్కడికి వరుస కడుతున్నారు. ఆదివారం భారీగా తరలొచ్చి ప్రకృతి అందాలను తిలకిస్తూ మైమరిచిపోయారు.
5/29
ఈ చిత్రాన్ని చూస్తే తొండలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్నట్లు ఉంది కదూ.. ములుగు జిల్లా మంగపేట మండలకేంద్రంలోని
టీచర్స్ కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పూసం రామయ్య ఇంటి ముందు ఈ చిత్రం ‘న్యూస్టుడే’ కెమెరా కంట పడింది.
6/29
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాకకు చెందిన నాంపల్లి శంకర్ తనకున్న రెండు ఎకరాలతో పాటు మరో రెండు
ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిసాగు చేస్తున్నారు. పంటను సాగు చేయడానికి, దున్నడానికి కాడెద్దులు కొనుగోలుకు ఆర్థిక స్థోమత లేదు.
యూట్యాబ్లో చూసి మూలనపడ్డ సైకిల్ తీసుకుని వెనక చక్రం కట్ చేయించారు. వెనక చక్రం ఉండే ప్రదేశంలో పత్తిలో దున్నడానికి
గుంటకను బిగించారు. సైకిల్, సాగు సామగ్రికి రూ.2 వేలు వెచ్చించి దీనిని తయారు చేశారు. రోజుకు ఎకరం పత్తి పొలంలో
దున్నుతున్నారు. ఫలితంగా పెట్టుబడి భారం తగ్గింది.
7/29
గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ సరకులు అందించే వాహనాలను సొంత పనులకు వినియోగించుకుంటున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి
18వ తేదీ వరకు లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించిన వాహనంలో రేషన్ సరకులు అందిచాలి. కానీ.. హొళగుంద మండలంలో ఓ
వాహనాన్ని పొలం పనులకు వినియోగిస్తున్నారు. కూలీలను పొలాలకు తీసుకెళ్లి, ఇళ్ల దగ్గర వదిలేసేందుకు ఉపయోగిస్తున్నారు. కోగిలతోట
సమీపంలో పొలం పనులకు వినియోగించుకుంటున్నారిలా.
8/29
బుక్కరాయసముద్రం నుంచి తాడిపత్రి వెళ్లే రహదారిలో శింగనమల క్రాస్ రోడ్డు వరకు రహదారి విభాగినిపై ఇరుపక్కలా ఉన్నచెట్లు ఏపుగా
పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సాధారణంగా విభాగినిపై చిన్నమొక్కలు పెంచుతారు. అయితే ఈ రహదారిలో పెద్దపెద్ద చెట్లు
పెంచటంతో పచ్చదనం కళకళలాడుతోంది.
9/29
శాంతిపురం మండలంలోని నాయనపల్లె వద్ద ఇలా తోటలోనే బంతిపూలు మగ్గిపోతున్నాయి. ధరలు పడిపోవడంతో రైతులకు నష్టాలు
తప్పడం లేదు. పశ్చిమ మండలాల్లో విస్తారంగా సాగు చేసిన బంతి(చెండుమల్లి) పూలకు ప్రసుత్తం మార్కెట్లో కనీస గిట్టుబాటు ధరలు
లభించని స్థితి ఏర్పడింది. కిలో పూలకు రూ.5 కూడా ధర లేనందున కనీసం పూల కోత కూలీ కూడా చేతికందని దుస్థితిని అన్నదాతలు
ఎదుర్కొంటున్నారు. ఫలితంగా తోటల్లోనే పూలు ఎండిపోతున్నాయి.
10/29
బ్రహ్మపుత్ర, గంగానది తీరాల్లో కనిపించే పక్షులు చిత్తూరు జిల్లాలో కనువిందు చేస్తున్నాయి. కొన్ని రోజులుగా జిల్లాలోని పులిచెర్ల మండలం
కల్లూరు గ్రామ ఎర్ర చెరువులో సందడి చేస్తున్నాయి. వీటిని ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్, రడ్డీ డక్గా పిలుస్తారని ఎస్వీ జూపార్కు, తిరుపతి
పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి డాక్డర్ ఎస్పీ అరుణ్ తెలిపారు. ఈ రెండు జాతుల బాతులు మన దేశానికి చెందినవే అయినా చైనా, జపాన్లో
ఎక్కువగా ఉంటాయన్నారు. బ్రహ్మపుత్ర, గంగానది ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితులను గ్రహించి ముందుగానే ఇలా వలస వచ్చి ఉండొచ్చని
ఆయన తెలిపారు.
11/29
నీటి ప్రాధాన్యం తెలిసినవారు పొదుపుగా వినియోగించడంతో పాటు వృథాను అరికడతారు. అలాగే వర్షపు, మురుగునీటిని సైతం పలు
అవసరాలకు ఉపయోగపడేలా చూస్తారు. ఇందుకోసం ఇంకుడుగుంతలతో పాటు కుంటలు నిర్మిస్తారు. ఇలాగే పై చిత్రంలో కనిపిస్తున్న
కుంటను కూడా నిర్మించారు. ఇది శంషాబాద్ సమీపంలో ముప్పై ఎకరాల్లో విస్తరించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ
(ఐఎంటీ) కళాశాలలోనిది. ఇక్కడి ప్రాంగణంలో దాదాపు 12 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో అర ఎకరం విస్తీర్ణం చొప్పున ఏడు
కుంటలు నిర్మించారు. కళాశాల భవనాల పైకప్పులపై కురిసిన వర్షం నీరు వృథా కాకుండా పైపుల ద్వారా వీటిలో పడేలా ఏర్పాటు చేశారు.
తద్వారా భూగర్భ జలం పెరగడానికి అవకాశముంటుంది. ఇక్కడ మురుగు నీటిని సైతం ట్రీట్మెంట్ ప్లాంటులో శుభ్రపరిచి చెట్లకు
అందిస్తారు.
12/29
‘విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని భక్తులు దర్శించుకునే ప్రధాన మార్గాలైన ఘాట్ రోడ్డు, మహా మండపం, మెట్ల దారి
ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు వినియోగించకూడదు. కొండపైకి వచ్చే వారిని తనిఖీ చేసి, సిగరెట్లు, పాన్పరాగ్, గుట్కా, ఖైనీ వంటి పొగాకు
ఉత్పత్తులను ‘కోప్టా’ చట్టం ప్రకారం అనుమతించకుండా నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని’ దుర్గగుడి ఈవో, గుడి సెక్యూరిటీ, వైద్య,
ఆరోగ్య, పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శనివారమే ఘాట్రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులపై నిషేధమని
బోర్డు మాత్రం పెట్టారు. తనిఖీలు చేయకుండా టోల్ ఫీజు మాత్రం వసూలు చేసి భక్తులను కొండపైకి పంపించేస్తున్నారు. మహామండపం
వద్ద భక్తుల మధ్యే సిగరెట్లు తాగుతూ కనిపించారు. ఇదే ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ గుట్కా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి.
13/29
14/29
15/29
క్వారీల్లో పని చేసే కార్మికులతో కనీస భద్రత చర్యలు తీసుకోకుండా యజమానులు పనులు చేయిస్తున్నారు. తలకు హెల్మెట్, కాళ్లకు బూట్లు,
చేతులకు గ్లౌజులు, నడుముకు కట్టుకునేందుకు తాళ్లు లేకుండా కొండలపై అంచున నిల్చుని ప్రమాదకరంగా బండరాళ్లు బద్దలుకొట్టే పనులు
చేస్తున్నారు. ఏమాత్రం కాలు జారినా జరిగే పరిణామాలను ఊహించుకోవచ్చు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కిలేశపురం క్వారీల్లో కనిపించిన
దృశ్యాలివి.
16/29
17/29
హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుండలా ఉండటంతో సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. సాగర్ వద్దకు అనుమతి లేకపోవడంతో కొందరు రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప జాలీ కింద నుంచి వెళ్లి అక్కడి బండరాళ్లపై సేద తీరుతున్నారు. ప్రమాదకరమని రక్షణ చర్యలు తీసుకుని నిబంధనలు పెట్టినా కొందరు పర్యాటకులు వాటిని అతిక్రమిస్తున్నారు. విహారం కోసం వచ్చిన వారు విషాదం బారిన పడొద్దంటే నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చూసినవారు హెచ్చరిస్తున్నారు.
18/29
యూసుఫ్గూడలోని కోట్ల విజయ భాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో హిందు సేవా సమితి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవం ఆదివారం రాత్రి సందడిగా జరిగింది. 75 మంది చొప్పున వీణ వాద్య కళాకారులు, నృత్య కళాకారులు, కర్ణాటక సంగీత విద్వాంసుల ప్రదర్శన హైరేంజ్ బుక్స్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది.
19/29
ఉప్పల్ చౌరస్తాలో గతేడాది దాదాపుగా రూ.2 కోట్లతో నిర్మించిన థీమ్ పార్కు ఇది. పచ్చదనంతో కళకళలాడుతూ ఉంది. చిన్నారులు ఆడుకోవడానికే కాకుండా పెద్దలు సైతం సేద తీరేందుకు, ప్లగ్ అండ్ వర్క్ పేరుతో ల్యాప్ట్యాప్లో పనిచేసే విధంగా ఏర్పాట్లు చేశారు. రాతి బెంచీలు, కర్ర నిర్మాణాలు, చెట్టు ఆకారంలో వాటర్ ఫౌంటెయిన్ ఆకట్టుకుంటున్నాయి.
20/29
21/29
ఇటీవల ప్రారంభమైన కైతలాపూర్ కొత్త వంతెనపై ప్రమాద ఘంటికలు మోగే అవకాశం ఉంది. వేగంగా వాహనాలు ప్రయాణిస్తున్నా పిల్లలు ఖాతరు చేయకుండా అటుఇటు పరుగులు పెడుతున్నారు. కొందరు ఫొటోలు దిగుతుండగా ఇంకొందరు వాహనం నడుపుతూనే వీడియోలు తీసుకుంటున్నారు.
22/29
23/29
24/29
సైబర్ టవర్స్-కూకట్పల్లి మార్గంలో ఖానంమెట్ నుంచి హైటెక్స్ వెళ్లేందుకు లింకు రహదారి ఉన్నా వాహనదారులకు ఉపయోగపడని పరిస్థితి. గత ఏడాది ఖానంమెట్ వద్ద టీఎస్ఐఐసీ తమ భూములను వేలం వేసింది. ఆ స్థలంలో అంతకు ముందు బహుళ అంతస్తుల నిర్మాణ సమయంలో వేసిన మట్టి కుప్పలు గుట్టలుగా మారాయి. అవి తొలగిస్తే తప్ప అక్కడ నిర్మాణాలకు అవకాశం లేదు. దీంతో రాకపోకలు నిలిపేసి ఆరు నెలల నుంచి రహదారి మూసి నిత్యం పదుల సంఖ్యలో పొక్లెయిన్లతో మట్టిని తొలగిస్తున్నా నేటికీ కొలిక్కి రాలేదు. మళ్లీ వర్షాలు మొదలైతే మట్టితోపాటు బండరాళ్లు జారే ప్రమాదం పొంచి ఉంది.
25/29
అంధులకు దారి చూపే సెన్సార్ స్టిక్(దండం)ను విశాఖపట్నంలోని ‘వారిజ’ అంధ విద్యార్థులు, అధ్యాపకులు రూపొందించారు. శంషాబాద్ ముచ్చింతల్లో, చినజీయర్స్వామి ఆధ్వర్యంలో నడుస్తున్న నేత్ర విద్యాలయలోని అంధ విద్యార్థులకు ఈ కర్ర ఎంతో ఉపయుక్తంగా ఉంటోంది. అడ్డంకి మూడడుగుల దూరంలో ఉన్నప్పుడే ఇది శబ్దంతో హెచ్చరిస్తుంది.
26/29
పంజాగుట్ట పేరిట ఉన్న ఈ అగ్నిమాపక కేంద్రం ఉన్నది ఎక్కడో తెలుసా.. ఏడు కి.మీ.ల దూరంలోని ఫిలింనగర్లో. రెండు అగ్నిమాపక శకటాలు నిలిపేందుకు సరిపడా స్థలం లేక ఇంత దూరంలో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సాధారణ సమయంలో ఫిలింనగర్ నుంచి పంజాగుట్ట అగ్నిమాపక శకటం చేరుకునేందుకు పట్టే సమయం సుమారు అరగంట. ఇక ట్రాఫిక్ స్తంభిస్తే అంతే సంగతులు.
27/29
తేలిగ్గా ఉన్న ఈ చిన్న వాహనం మాసబ్ట్యాంక్లో కన్పించింది. ‘4 గంటల విద్యుత్తు ఛార్జింగ్తో 90 కి.మీ. ప్రయాణించవచ్చు. అందుకు సగం యూనిట్ కాలుతుంది. 125 కిలోల వరకు బరువు మోయగలదు. బండికి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్అవసరం లేదు’ అని వాహనదారుడు బద్రి విశాల్ తెలిపారు.
28/29
ఇది ఉస్మానియావర్సిటీలోని ఉపన్యాస వేదిక(డిస్కోర్స్ సెంటర్). ఆర్ట్స్ కళాశాల ఎదుట నిర్వహించే నిరసన ప్రదర్శనలను ఇకపై ఇక్కడే నిర్వహించాలని వర్సిటీ అధికారులు సూచించారు. మే 21న ప్రారంభించినా, అందుబాటులోకి రాలేదు. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో తాళం వేసి వెళ్లిపోయాడు.
29/29
పాఠశాలలు తెరిచి దాదాపు రెండు వారాలు కావస్తున్నా ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు రాలేదు. ఇంకా ముద్రణే పూర్తికాలేదని చెబుతుండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో పిల్లలకి దిక్కు తోచట్లేదు. పైతరగతికి వెళ్లిన విద్యార్థులను అడిగితే, పోటీ పరీక్షలకు సాధన చేస్తున్న వారికి ఇచ్చేశామన్న సమాధానం వస్తోంది. పాత పుస్తకాల దుకాణాల్లో కొన్ని సబ్జెక్టులవి దొరక్కపోగా, మరికొన్ని పేజీలు చిరిగిపోయి కన్పిస్తున్నాయి. పదో తరగతి విద్యార్థుల పరిస్థితి మరీ అగమ్యగోచరంగా మారింది. గత్యంతరం లేక కొందరు కొన్ని చిరిగిపోయిన బుక్స్ కొనుగోలు చేస్తూ కోఠిలో ఇలా కన్పించారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు