News In Pics: చిత్రం చెప్పే సంగతులు
Updated : 04 Jul 2022 11:04 IST
1/16
బంగారు ఆభరణాలను చూస్తుంటే కళ్లు జిగేల్ మంటున్నాయి కదా.. ఇదేదో మంచి నగల దుకాణమే అనుకుంటున్నారా.. అదేం కాదండి.. జిల్లాలో జూన్ 28న శ్రీకూర్మం నుంచి శ్రీకాకుళం వస్తున్న ఇద్దరు బంగారు వ్యాపారుల కళ్లలో కారం కొట్టి దోపిడీకి పాల్పడిన ఘటనలో పట్టుబడిన ఆభరణాలివి. ఆదివారం ఆ వివరాలను ఎస్పీ రాధిక విలేకరులకు వెల్లడించారు.
2/16
పుంగనూరు పట్టణంలోని గాంధీ నగర్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో కూర్చోవడానికి విద్యార్థులు భయపడుతున్నారు. గది పైకప్పు పెచ్చులూడి పడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పైపైన పూతపని చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.
3/16
పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించినా పనులు పూర్తి కావడం లేదు. ఎమ్మిగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాత బల్లలను మిద్దెపై పారబోశారు. అదనపు తరగతిగది కొంత మేర నిర్మించి వదిలేశారు. పనులు త్వరితగతిన పూర్తిచేసి బల్లలు వాడుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
4/16
ఎత్తైన వివేకానంద విగ్రహం ఉన్న ప్రత్తిపాడు సమీప నరేంద్రగిరి విహంగ వీక్షణ చిత్రమిది. 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకొని ఇక్కడి కొండపై నెలకొల్పిన 54 అడుగుల ఎత్తుగల స్వామివారి విగ్రహంతో పాటు డ్రోన్ చిత్రంలో కొండలు.. సాగుకు సిద్ధమైన వ్యవసాయ క్షేత్రాలు..కొత్తగా వెలసిన కాలనీలు, పచ్చదనం.. ఇలా నియోజకవర్గ కేంద్రం భౌగోళిక వైవిధ్యంతో చూడ ముచ్చట అవుతోంది.
5/16
ఆత్రేయపురం మండలం ఉచ్చిలికి చెందిన భూపతిరాజు వెంకట సత్య సుబ్బరాజు తన చేలో వేసిన తైవాన్ జామ చెట్టుకు కాసిన కాయలు అబ్బుర పరుస్తున్నాయి. సాధారణంగా కాయలు 300 గ్రాముల వరకు బరువుంటాయి. ఈయన వేసిన చెట్టుకు 770 గ్రాముల వరకు తూగుతున్నాయి. దీనిపై ఉద్యాన అధికారి పీబీఎస్ అమర్నాథ్ను వివరణ కోరగా సేంద్రియ ఎరువులు వేయడంతోపాటు నేల సారవంతంగా ఉంటే బరువుతోపాటు ఆరోగ్యకరమైన కాయలు కాస్తాయన్నారు.
6/16
శ్రీవారి మాతృమూర్తి వకుళామాత కొలువైన తిరుపతి గ్రామీణ మండలంలోని పాతకాల్వ పేరూరు బండపై పచ్చదనం కనువిందు చేస్తోంది. గతనెల 23న ఆలయ మహాసంప్రోక్షణ జరిగింది. పేరూరు బండపై గడ్డి కూడా మొలవని పరిస్థితుల్లో తితిదే అధికారులు మట్టిని ఏర్పాటు చేసి నర్సరీల్లో లభించే గడ్డి ప్లేట్లను తెప్పించి అమర్చారు. ఆలయం చుట్టూ మొక్కలు నాటి పరిరక్షిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం హరితమయమైంది.
7/16
నగరంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణ జలమయమైంది. ఇక్కడ పలుచోట్ల గుంతలు ఉండడంతో వాన పడినప్పుడల్లా ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
8/16
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని దనంబోడులో ఉన్న బుద్ధుడి కాలం నాటి ఆనవాళ్లు, బౌద్ధ స్తూపం పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. మూడేళ్లుగా వీటిని పట్టించుకున్న వారే లేరు. పిచ్చిమొక్కలతో ఆ ప్రాంతం అధ్వానంగా తయారైంది. స్తూపంపై ఉన్న మట్టి వర్షాలకు కరిగి చుట్టూ ఉన్న పాలరాతి శిల్పాలు రంగు మారి రూపు కోల్పోతున్నాయి. ఆకతాయిలు స్తూపాలపై వ్యక్తుల పేర్లు చెక్కుతున్నారు. లోపలికి ప్రవేశించి మద్యం సేవించడం, పేకాట ఆడుతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చారిత్రక సంపదను పరిరక్షించాల్సిన పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు.
9/16
10/16
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలిక కార్యాలయ ఆవరణలో రూ.25లక్షల విలువైన ఓ బాబ్కార్ట్ మూడేళ్లుగా వృథాగా పడిఉంది. ఇప్పుడది తుప్పుపట్టి పోగా.., దాని చుట్టూ పుట్టలు పెరుగుతున్నాయి. పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం అన్ని పురపాలికలకు ఇలాంటి వాహనాలు అందించింది. ఈ విషయాన్ని కమిషనర్ శంకరరావు దృష్టికి తీసుకెళ్లగా.. ‘మరమ్మతులు చేసే కంపెనీ ప్రతినిధులకు లేఖ రాశాం. బాగు చేసేందుకు చర్యలు చేపడతాం’ అంటున్నారు.
11/16
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి ఉపరితల బొగ్గుగని చుట్టూ మట్టికుప్పలపై నాటిన మొక్కలు నేడు పచ్చందాలతో అలరారుతున్నాయి. మట్టిగుట్టకు దిగువన నీలిరంగులో మెరిసే కన్వేయర్ బెల్టు, పక్కనే పట్టాలపై నల్ల బంగారంతో మెల్లగా సాగిపోయే గూడ్సురైలు పరుగులు కనువిందుగా నిలుస్తున్నాయి.
12/16
చిత్రంలో కనిపిస్తున్న సంచి జనపనారతో రూపుదిద్దుకొంది. చూడడానికి ఒకటిగానే కనిపిస్తున్నా సంచిని తెరచిచూస్తే ఏడు అరలు ఉంటాయి. ఒక్కో అరలో ఒక్కో రకం సరకును పెట్టుకునే సౌలభ్యముంది. ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి ‘ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్’ను నిషేధించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన సాధికారత మండల సమాఖ్య మహిళా సభ్యులు ఈ సంచులను తయారుచేస్తున్నారు. ఒక్కోటి రూ.270 చొప్పున వీటిని విక్రయిస్తున్నట్లు సమాఖ్య ప్రతినిధి రాధిక చెప్పారు.
13/16
గ్రీన్ల్యాండ్ మంచు ప్రాంతం మీదుగా ఉత్తర, దక్షిణ ధ్రువాలను చుట్టిన తొలి భారతీయుడిగా ఘనత చాటిన పర్వతారోహకుడు అజీత్ బజాజ్
14/16
ఉక్రెయిన్లోని ప్రాంతాలపైకి ఆదివారం ఎస్యూ-25 యుద్ధ విమానం నుంచి రాకెట్లను ప్రయోగిస్తున్న రష్యా దళాలు
15/16
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు సైకత శిల్పి శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సోహిత, ధన్యత.అల్లూరి రూపంతోపాటు జాతీయ పతాకం, అశోక చక్రాన్ని రూపొందించారు. వీరుడా... అందుకో మా జోహార్లు.. అని రాసి నివాళులర్పించారు.
16/16
వైయస్ఆర్ జిల్లా సిద్దవటం మండలంలోని అటవీ ప్రాంతంలో కనిపించిన సీతాకోక చిలుకల గుంపు ఇది. ఆకుపచ్చ వర్ణంలో నేలపై పచ్చదనాన్ని పరిచినట్లు ఆకట్టుకున్నాయి. కాటోప్సిలియా పోమోనాగా వ్యవహరించే ఈ జాతి సీతాకోక చిలుకలు ఆసియాతోపాటు ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తాయని యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర అధ్యాపకుడు మధుసూదన్రెడ్డి తెలిపారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ