News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (01-06-2023)
Updated : 01 Jun 2023 20:40 IST
1/23
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దంపతులు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు.
2/23
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో విద్యుద్దీపాల అలంకరణలో కాంతులీనుతున్న పోలీసు కమాండ్ కంట్రోల్ భవనం.
3/23
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి లోకేశ్కు సమస్యలు తెలిపారు. ఆయనతో పలువురు సెల్ఫీలు తీసుకొని సంబరపడ్డారు.
4/23
టీమిండియాకు సంబంధించిన మూడు ఫార్మాట్ల నూతన క్రికెట్ జెర్సీల వీడియోను అడిడాస్ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
5/23
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్లోని మైదానంలో భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
6/23
నిఖిల్ హీరోగా భరత్కృష్ణమాచారి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ను ‘స్వయంభూ’గా చిత్రబృందం ఖరారు చేసింది. నిఖిల్ పోస్టర్ను ట్విటర్ వేదికగా విడుదల చేసింది.
7/23
భారతదేశ పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందని రాష్ట్రపతి తెలిపారు..
8/23
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జైలర్’. మోహన్లాల్, శివరాజ్కుమార్, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో రజనీకాంత్, తమన్నా తదితర చిత్రబృందం కేకు కోసి వేడుకలు చేసుకుంది.
9/23
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్.. తమిళనాడు సీఎం స్టాలిన్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దిల్లీలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్పై పోరాటానికి తమకు మద్దతు పలకాలని వారు స్టాలిన్ను కోరారు.
10/23
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్లోని మైదానంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఈ నెల 7నుంచి 11వ తేదీ మధ్య జరగనున్న ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
11/23
సినీనటి రష్మిక తన తాజా ఫొటోను ఇన్స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘కోలుకో.. నేర్చుకో.. ఎదుగు.. ప్రేమించు’ అని పోస్టు పెట్టారు. ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్ ముగ్ధులవుతున్నారు.
12/23
తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంచు మోహన్ బాబు, దగ్గుబాటి అభిరామ్, నటి సంఘవి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
13/23
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘బీఎస్ఎస్10’ (వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను గురువారం ముహూర్తపు షాట్తో ప్రారంభించారు.
14/23
అర్ష్దీప్సింగ్, ఉమ్రాన్ మాలిక్ కలిసున్న ఫొటోను ‘సన్రైజర్స్ హైదరాబాద్’ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ఇద్దరూ ఫాస్ట్బౌలర్స్ కావడంతో ‘సే స్పీడ్’ అని ఫన్నీగా పోస్టు పెట్టింది.
15/23
కర్నూలు జిల్లా పత్తికొండలో ‘వైఎస్ఆర్ రైతుభరోసా’ నిధులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 52.31లక్షల మంది రైతుల ఖాతాల్లో మొదటి విడతగా రూ.3,923.21 కోట్లను జమ చేశారు.
16/23
హైదరాబాద్లోని గోల్కొండ కోటను కేంద్రమంత్రి కిషన్రెడ్డి సందర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ కోసం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
17/23
భారతదేశపు మొట్టమొదటి డీలక్స్ రైలు డెక్కన్ క్వీన్ను సరిగ్గా ఇదే రోజున 1930లో ప్రారంభించారు. ఇది ముంబయి, పుణెల మధ్య సేవలందిస్తోంది. ఈ రైలు 93 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో రైల్వే శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
18/23
సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చిన పదేళ్లలో సాధించిందేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ పది ప్రశ్నలతో కూడిన పోస్టర్ను వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఆవిష్కరించారు. గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
19/23
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్, సద్దుల చెరువును మంత్రి జగదీశ్రెడ్డి పరిశీలించారు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రఖ్యాత డిజైనర్లతో ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పారు.
20/23
భారతదేశ పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ దిల్లీలో నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరుదేశాల పరస్పర సహకార సంబంధాలపై వారు చర్చించుకున్నారు.
21/23
క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ ముంబయిలో భగవద్గీత చేతపట్టుకొని కెమెరాకు చిక్కారు. ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఐపీఎల్ 16వ సీజన్ ట్రోఫీని ధోనీ నేతృత్వంలో సీఎస్కే ఇటీవల గెలుచుకున్న సంగతి తెలిసిందే.
22/23
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ లండన్లో ఇలా ఫొటో తీసుకున్నారు.
23/23
అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు ఆయనతో సెల్ఫీ తీసుకొని సంబరపడ్డారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM