News in Pics: చిత్రం చెప్పే సంగతులు-01(04-02-2023)
Updated : 04 Feb 2023 10:38 IST
1/24
ప్రస్తుతం చిల్లర గలగల అంతటా తగ్గింది. నిజామాబాద్ జిల్లా బడాపహాడ్లో ఏటా జరిగే ఉర్సు ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం స్థానికంగా కొందరు చిరువ్యాపారులు భారీగా చిల్లర అందుబాటులో ఉంచి విక్రయిస్తుంటారు. ఒకటి, రెండు, మూడు, ఐదు, 20, 25, 50 పైసల నాణాలు ఇక్కడ చూడొచ్చు.
2/24
కర్నూలు జిల్లా మద్దికెరలోని మద్దమ్మ బావి ఆలయంలో వెలసిన శ్రీకృష్ణ, ఆంజనేయస్వామికి ఆలయ అర్చకులు ఆనంద్స్వామి ఆధ్వర్యంలో తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బావిలో ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలు ఆకట్టుకున్నాయి.
3/24
బాపట్ల జిల్లాలోని చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో ఓ పాడుబడిన బావి ఉంది. దీని పక్క నుంచే విద్యార్థులు రాకపోకలు సాగిస్తుండటం ప్రమాదకరంగా ఉంది.
4/24
నిజామాబాద్ జిల్లాలోని బడాపహాడ్ దర్గా దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఎదురవుతున్నాయి. నీటి కోసం కోతులు కూడా భక్తుల వెంట పడుతున్నాయి. దీంతో వాటి దుస్థితి చూసిన కొందరు ఇలా బాటిళ్లతో తాగిస్తున్నారు.
5/24
మచ్చబొల్లారం సంజీవ్రెడ్డి హాల్ రోడ్డు మార్గంలో తాగునీటి పైపులైన్కు లీకేజీ ఏర్పడింది. నిత్యం నీరుపైకి ఉబికొస్తూ 200 మీటర్ల వరకు రోడ్డుపై పారుతోంది. రెండు వారాలుగా ఇదే పరిస్థితి ఉన్నా.. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
6/24
సైదాబాద్-సరూర్నగర్ ప్రధాన మార్గం (తారు రోడ్డు) ఎత్తుగా.. అంచుల్లో పల్లంగా ఉండటంతో గతంలో వాహనదారులు అదుపుతప్పి తరచూ ప్రమాదాల బారిన పడేవారు. ఈ విషయం ఎమ్మెల్యే అహ్మద్ బలాల దృష్టికి వెళ్లడంతో అంచుల్లో సమాంతరంగా సిమెంటు రోడ్డు నిర్మించేందుకు రూ. 10 లక్షలు మంజూరు చేయించారు. ఏ5 ఫంక్షన్ హాల్ నుంచి పర్ఫెక్ట్ విజన్ వరకు చేపట్టిన ఈ పనులు శుక్రవారంతో పూర్తయ్యాయి. ఇకపై ప్రమాదాల భయం లేకుండా ప్రయాణించవచ్చని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
7/24
సుభాష్నగర్ డివిజన్ సూరారం రాజీవ్ గృహకల్ప కాలనీలో రెండు రోజుల కిందట చంద్రిక(37) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం మృతిచెందడంతో బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్లగానే వారికి ఎదురైన బురద దారితో పాడెను ఎత్తుకొని సర్కస్ ఫీట్లు చేయాల్సి వచ్చింది.
8/24
భావితరాలకు వ్యవసాయం గురించి తెలిసేలా రామంతాపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు సాగుపై ప్రత్యక్షంగా మెలకువలు నేర్పిస్తున్నారు. పాఠశాల ఆవరణలో అర ఎకరంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. వీటి పెంపకం, ఇతర పనులన్నీ విద్యార్థులే చూసుకుంటున్నారు.
9/24
అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరిసరాల్లో శుక్రవారం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఖాన్ లతీఫ్ఖాన్, ఏఆర్ పెట్రోల్ బంక్ కూడలి, బషీర్బాగ్ ఫ్లైఓవర్ కూడలి, హిల్ఫోర్ట్ (కళాంజలి)రోడ్డు, రవీంద్రభారతి కూడలి ఇలా అడుగడుగునా పోలీసులే కనిపించారు. అనుమానం వచ్చిన వాళ్లను ఠాణాలకు తరలించారు.
10/24
అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడ, మండలంలోని కితలంగి పంచాయతీ మారుమూల గ్రామం పాములపుట్టు గ్రామానికి ఇప్పటికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం అంతా చందాలు వేసుకుని మట్టిరోడ్డుతో పాటు, లోయను దాటేందుకు తాత్కాలికంగా కర్రల సాయంతో వంతెనను ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి గ్రామస్థులకు ఏర్పడింది.
11/24
ఖమ్మం నగర శివారులోని దానవాయిగూడెంలో నాగార్జునసాగర్ కాల్వపై జలసవ్వడులు కనువిందు చేస్తున్నాయి. కాల్వ కింద పక్కపక్కనే రైలు, వాహనాలు రయ్మంటూ దూసుకెళ్తున్నాయి.
12/24
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం పరిసర ప్రాంతాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సురభిరాజుల పాలనలోనే వెయ్యేళ్ల కిందట ఈ గ్రామంలో లింగాకారంలోని శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం వెలసింది. సింగోటం ప్రాంతం ఎక్కువ ఎత్తులో ఉండటంతో కిలోమీటరు పొడవున కరకట్ట నిర్మించి తటాకం తవ్వారు.
13/24
సృజనకు పదును పెట్టారు. ఆటపాటలతో అలరించారు. హైదరాబాద్ జిల్లా చిక్కడపల్లిలోని న్యూఎరా జూనియర్ కళాశాల వార్షికోత్సవం శుక్రవారం సుందరయ్య కళానిలయంలో నిర్వహించారు. విద్యార్థుల సంప్రదాయ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
14/24
పోటీలకు సిద్ధమవుతున్న క్రీడాకారుల్లా కనిపిస్తున్న వీరంతా హైదరాబాద్లోని వీఎం హోం సరూర్నగర్ విద్యార్ధులు. రోజువారీ వ్యాయామంలో భాగంగానే నిత్యం మైదానంలో సాధన చేస్తుంటారు. ఆరు నుంచి ఎనిమిది తరగతుల వారు శుక్రవారం ఉదయం ఇలా కనిపించారు.
15/24
రంగారెడ్డి జిల్లా,శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న సమతా కుంభ్-2023 ఉత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. చిన జీయర్ స్వామి గరుడ పట ఆరాధన, ధ్వజారోహణం చేశారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ప్రవచించారు. కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. వైభవంగా వాహన సేవలు నిర్వహించారు.
16/24
చక్కగా ఉన్న రోడ్డును తవ్వేసి కొత్త రోడ్డు వేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని మూసాపేట పరిధి శ్రీహరినగర్ చౌరస్తా నుంచి మూడు నెలల కిందట భూగర్భ కాలువను నిర్మించారు. అందుకోసం రోడ్డును ఓ వైపు తవ్వారు. వాస్తవానికి తవ్విన రోడ్డుకు మరమ్మతులు చేపడితే సరిపోతుంది. అధికారులు మాత్రం రోడ్డంతా తవ్వేసి.. కొత్తది వేసే పనులకు శ్రీకారం చుట్టారు.ప్రజాధనం వృథా చేస్తున్నారు.
17/24
హైదరాబాద్లోని జేఎన్టీయూ మొదటి గేటు నుంచి రెండో గేటు వరకు పాదబాట నిర్మించి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. మధ్యలో నిర్మాణం సగం వదిలేశారు. పూర్తి చేసిన పనుల్లోఅయినా శుభ్రత లేక విద్యార్థులు రోడ్డుపై నడవాల్సి వస్తోంది.
18/24
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంతగా చెప్పినా కొందరికి చెవికెక్కడం లేదు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఓ చిరు వ్యాపారి ద్విచక్రవాహనంపై ప్రమాదకరంగా కూర్చొని.. తన తోపుడుని పట్టుకుని ఇలా ప్రయాణించారు.
19/24
చెరువు గట్టుపైనున్న తుప్పలు కాల్చేందుకు ఓ రైతు పెట్టిన మంటలు వ్యాపించడంతో సమీప పొలాల్లోని ధాన్యం బస్తాలు, నగదు కాలిపోయిన సంఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట మండలంలో జరిగింది.ప్రమాదంలో మిర్తివలసకు చెందిన గండబోను సింహాచలం, తుమరాడకు చెందిన దాసరి మజ్జయ్య, పడాల అప్పయ్య, విమల, సత్యనారాయణ తదితరులు 17 మందికి చెందిన సుమారు రూ.8లక్షల విలువైన 370 బస్తాల ధాన్యం కాలిబూడిదైంది..
20/24
పాకిస్థాన్- భారత్ సరిహద్దుల్లో గత కొంత కాలంగా డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. పంజాబ్ సరిహద్దులోని అమృత్సర్ సెక్టార్లో తాజాగా ఓ డ్రోన్ కనిపించింది. శుక్రవారం ఉదయం దానిని కూల్చిన భద్రతా అధికారులు మూడు కిలోలు బరువున్న ఓ సంచిని స్వాధీనం చేసుకున్నారు.
21/24
గుజరాత్ నవ్సారిలో ఓ పెళ్లి ఊరేగింపు వినూత్నంగా పొక్లెయిన్లో జరిగింది. పొక్లెయిన్ ముందు భాగంలో వధూవరులకు సోఫా ఏర్పాటు చేసి ఊరేగించారు. రంగు రంగుల పూలు, వస్త్రాలతో వాహనాన్ని అందంగా అలంకరించారు. కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేస్తుండగా.. వెనుక పొక్లెయిన్లో వధూవరులు వచ్చారు.
22/24
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. రాజస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైపుర్లో ఆందోళన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు.
23/24
రష్యా క్షిపణి దాడి కారణంగా ఉక్రెయిన్లోని ఖేర్సన్లో ఓ షాపింగ్ కాంప్లెక్స్లో చెలరేగిన మంటలు.
24/24
పురాతన నలందా విశ్వవిద్యాలయం సమీపంలో 1200 ఏళ్ల నాటి రెండు రాతి విగ్రహాలను కనుగొన్నారు. బిహార్లోని సర్లిచక్ గ్రామ సమీపంలోని తార్సిన్హ్ కొలనులో పూడిక తీస్తుండగా ఈ విగ్రహాలు బయటపడ్డాయి
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
-
ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
-
మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్లకు ఈసీ షోకాజ్ నోటీసులు
-
కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. నెట్టింట్లో వైరల్గా మారిన ఫొటో
-
మెదక్ జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి
-
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్