News in Pics: చిత్రం చెప్పే సంగతులు-01(06-02-2023)
Updated : 06 Feb 2023 10:22 IST
1/20
శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం ఇద్దివానిపాలెం సముద్ర తీరంలో ప్లాట్ఫారాలు లేకపోవడంతో మత్స్య సంపదను ఇసుక దిబ్బలపై ఇలా ఎండబెడుతున్నారు.
2/20
సుందర.. మనోహర సముద్ర తీరం. చుట్టూ ఇసుక తిన్నెలు, ఎగసిపడే అలల హొయలు మధ్య నుంచి జీవకోటికి వెలుగు ప్రసాదించేందుకు సూర్య భగవానుడు వస్తున్న సమయం ఆకట్టుకుంది. కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడరేవు సముద్ర తీరంలో ఈ దృశ్యం కనువిందు చేసింది.
3/20
వానరాల బెడద పల్లెల్లో తీవ్రమైంది. పెంకుటిళ్ల పైకప్పులు ఏటా సర్దుకుంటుండగా కోతుల గుంపులు కొన్నాళ్లకే పీకి పడేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా దోమకొండలో గజవాడ అనసూయ అనే మహిళ ఇంటికి ఏటా పెంకులు కప్పించటానికి రూ. లక్ష ఖర్చయ్యేది. ఆ బాధలు పడలేక రూ. 3.50 లక్షలు ఖర్చు చేసి పెంకుటిల్లు పైకప్పును పూర్తిగా రేకులతో కప్పేశారు. భవంతి మధ్యలో గాలి కోసం ఎయిర్ఫిల్టర్ అమర్చారు.
4/20
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి జాతీయ రహదారి పక్కన ఓ మోడు చివరిలో రావిచెట్టు పెరుతుగూ చూపరులను ఆకర్షిస్తోంది.
5/20
ఖమ్మం నగరంపై మంచు దుప్పటి కమ్ముకొంది. బైపాస్, ఇల్లెందు, వైరా రోడ్లపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. బైపాస్ మున్నేరు వంతెన రహదారిపై కనిపించిన మంచు దృశ్యం ఇది.
6/20
కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండల గ్రామాల్లోని రైతులు పంట పొలాల్లో క్రిమిసంహారక మందు పిచికారీ చేసేందుకు డ్రోన్ వినియోగిస్తూ కూలీలకు వెచ్చించే డబ్బులు ఆదా చేసుకొంటున్నారు. మండలంలోని తాడికల్లో ఓ రైతు తన వరి పొలంలో ఇలా డ్రోన్ సహాయంతో స్ప్రే చేశారు.
7/20
విశాఖ బీచ్రోడ్డు వుడాపార్కులో ఆదివారం నిర్వహించిన డాగ్షో అలరించింది. శునకాలను చక్కగా అలంకరించి తీసుకొచ్చిన యజమానులు వాటి ప్రతిభను చూసి మురిసిపోయారు.
8/20
మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవం సందర్భంగా ఆదివారం భక్తజనం పోటెత్తారు. మహబూబ్నగర్ - రాయచూరు ప్రధాన రహదారి మొదలు కొండపై వరకు ఎటు చూసినా భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి మన్యంకొండ రాయుడిని దర్శించుకోవడానికి తండోప తండాలుగా కదిలివచ్చారు. అర్ధరాత్రి అనంతరం రథంపై ఊరేగిన శ్రీవారిని మనసారా తిలకించారు.
9/20
వరంగల్లోని హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన రకరకాల బొమ్మలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గార్డెన్లో ధ్యాన కేంద్రం, చదరంగం, తదితర బొమ్మలు సజీవంగా కనిపిస్తున్నాయి. సంప్రదాయం నేర్పించేలా నమస్కారం చేస్తున్న బొమ్మ, చిరునవ్వు చిందించే బాలికల బొమ్మలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
10/20
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురంలోని చెరువులో నీటిలో ఉన్న పలు వృక్షాలు ఎండిపోయాయి. ఆకులన్నీ రాలిపోయి మోడులయ్యాయి. ఆహారం కోసం ఇక్కడికి వందల సంఖ్యలో వచ్చిన కొంగలు గుంపులుగా ఆ చెట్లపై వాలాయి. దీంతో.. బోసిపోయిన ఆ తరువులు కొత్త అందాలను సంతరించుకున్నాయి. చెట్లకు తెల్లని పూలు పూసినట్లుగా తలపిస్తున్నాయి.
11/20
ఒక గూడ్స్ రైలు వ్యాగన్ల నిండా జేసీబీలను తీసుకోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్ దాటుతున్నప్పుడు కొంత మంది తమ చరవాణుల్లో చిత్రీకరించారు. ఒక్కసారిగా గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు తీయడం చూసి ప్లాట్ ఫారాలపై వేచి ఉన్న ప్రయాణికులు ముచ్చట పడ్డారు.
12/20
కొంగకు రెండు కళ్లు ఒకవైపే ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. దాని మెడ భాగంలో ఉన్న ఖాళీలో నుంచి అవతల పచ్చని మొక్కలు కనిపిస్తున్నాయి. దీంతో అది కూడా రెండో కన్ను అని భ్రమపడతారు. ఈ అరుదైన దృశ్యం ఆదిలాబాద్లోని, తాంసి మండలం మత్తడివాగు వద్ద కెమెరాకు చిక్కింది.
13/20
హైదరాబాద్లో మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న ఫార్ములా ఈ-రేసింగ్కు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
14/20
హైదరాబాద్లోని, రామంతాపూర్ - ఉప్పల్ ప్రధాన రహదారిలో మోడరన్ బేకరీ ఎదురుగా ఉన్న షీ టాయిలెట్లకు తాళాలు వేసి టీ తాగడానికి, సిగరెట్లు, శీతల పానీయాలు కొనుగోలుకు వచ్చేవారికి పరదాలు కట్టి, బల్లలు వేసి కొందరు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా బల్దియా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. వాటికి తాళాలు ఉండటంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు.
15/20
ఆకులన్నీ రాలిపోయి కేవలం కాయలు మాత్రమే చెట్టునిండా బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఈ దృశ్యం హైదరాబాద్లోని, మెహిదీపట్నం భోజగుట్ట రిజర్వాయర్ వద్ద చూపరులను కనువిందు చేస్తోంది.
16/20
హైదరాబాద్లోని, అబిడ్స్ సందర్శకులతో నుమాయిష్ కిక్కిరిసింది. ఆదివారం కావడంతో సందర్శకుల ప్రవాహం రాత్రి తొమ్మిది గంటల వరకు 90 వేల సంఖ్యను దాటింది. దీంతో ఇప్పటి వరకు సందర్శకుల సంఖ్య 15.5 లక్షలు దాటిందని సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనరు బి.హన్మంత్రావు తెలిపారు.
17/20
ఇరవై రోజుల కిందట జరిగిన పతంగుల పండగ రోజు తెగిన గాలిపటాలన్నీ చెట్లకు చిక్కుకోగా తీసిన చిత్రమిది.హైదరాబాద్లోని గండిపేట జలాశయం దిగువన ఉన్న చిట్టడవి నిండా కొన్ని వేల పతంగులు చిక్కుకొని చెట్ల కొమ్మలన్నీ రంగులమయమయ్యాయి.
18/20
ఢిల్లీ:రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్లో ఆదివారం భార్య కల్పనాదాస్, పెంచుకుంటున్న కుమార్తెలు మహీ, ప్రియాంకలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్.
19/20
పంజాబ్లోని లుధియానాలో మినీ ఒలింపిక్స్ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం జరిగిన సీనియర్ సిటిజన్ల 100 మీటర్ల పరుగు పోటీలో సురీందర్ శర్మ (72) బంగారు పతకాన్ని సాధించారు. దీంతోపాటు 200 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్ రేసులోనూ ఈయన పాల్గొన్నారు.
20/20
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ బద్దిపోచమ్మ అమ్మవారికి ఆదివారం కళాకారులు, భక్తులు బోనాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు. ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన యూట్యూబ్ కళాకారులు ‘గూగుల్ అమ్మతల్లికి యూట్యూబ్ బోనాలు’ పేరిట పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహించారు.