
తాజా వార్తలు
ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారు: చంద్రబాబు
కర్నూలు: వైకాపా పాలనతో రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలులో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఏబీసీడీ పాలన సాగుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన, బీ బాదుడు, సీ అవినీతి, డీ అంటే విధ్వంసమని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
తెదేపా హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్ విధ్వంసానికి పెద్దపీట వేశారని చంద్రబాబు ఆక్షేపించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైకాపా నేతలు బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? అని ప్రశ్నించారు. తెదేపా గెలిచిన స్థానాలనూ వైకాపా నేతలు వారి ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఓటేసే అవకాశమే లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా? ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా?’’ అని ప్రశ్నించారు. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు.