
తాజా వార్తలు
‘ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ’
చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ
అమరావతి: పురపాలక ఎన్నికల్లో వైకాపా శ్రేణులు ఫోర్జరీ పత్రాలతో ప్రత్యర్థుల నామినేషన్లను బలవంతంగా ఉపసంహరించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలనే ఎస్ఈసీ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్కు ఆయన లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో వైకాపా అక్రమాలకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. వైకాపా నాయకులు, ఓ వర్గం అధికారులు, పోలీసులు కుమ్మక్కై తెదేపా నేతల ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తెదేపా అభ్యర్థుల్లో నటించిన వైకాపా నాయకులు రిటర్నింగ్ అధికారులకు నకిలీ ఉపసంహరణ పత్రాలు అందజేశారని ఆరోపించారు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా నామినేషన్ల ఉపసంహరణ అక్రమాలు కొనసాగాయని ఆక్షేపించారు. అసలు అభ్యర్థులకు తెలియకుండా జరిగిన ఈ ఉదంతాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. సమగ్ర విచారణ తర్వాతే చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలను ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.