
తాజా వార్తలు
యువకులతో జట్టులో తాజాదనం: కోహ్లీ
కాన్బెర్రా: ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో విజయం.. మిగిలిన టీ20, టెస్టు సిరీసులకు ఉత్సాహం అందిస్తుందని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. ఆటగాళ్ల మార్పుతో జట్టులో తాజాదనం కనిపించిందని పేర్కొన్నాడు. చివరి మ్యాచులో 13 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత విరాట్ మీడియాతో మాట్లాడాడు.
‘ఆసీస్ ఇన్నింగ్స్ తొలి, రెండో అర్ధభాగాల్లో మేం పరీక్షకు గురయ్యాం. శుభ్మన్, ఇతర యువకులు రావడంతో జట్టులో తాజాదనం వచ్చింది. యువ పేసర్లు రాణించారు. జట్టుకు ఇలాంటి విజయం ఎంతో అవసరం. సిడ్నీతో పోలిస్తే కాన్బెర్రా పిచ్ బౌలర్లకు మెరుగ్గా ఉంది. దాంతో వారి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ పోరులో ఫీల్డింగ్, బౌలింగ్లో మేం అదరగొట్టాం’ అని కోహ్లీ అన్నాడు.
తన బ్యాటింగ్ ప్రదర్శన పట్ల కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. 63 పరుగులు సాధించాడు. ‘నా బ్యాటింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నా. ఇక ముందూ ఇదే జోరు కొనసాగించాలని అనుకుంటున్నా. ఇన్నింగ్స్ను చివరి వరకు తీసుకెళ్లాలని భావించాను కానీ కుదర్లేదు. పాండ్య, జడేజా భాగస్వామ్యం మాత్రం అదుర్స్. ఆస్ట్రేలియాను ఢీకొట్టాలంటే అలాగే ఆడాలి. కంగారూలతో ఆడేటప్పుడు కసిగా ఉండాలి. ఆ సవాల్కు సిద్ధంగా ఉండాలి’ అని విరాట్ పేర్కొన్నాడు.
టీమ్ఇండియాతో ఆఖరి పోరులో తాము బాగానే పోరాడమని ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ అన్నాడు. జడేజా, హార్దిక్ భారత్కు అద్భుతమైన భాగస్వామ్యం అందించారని పేర్కొన్నాడు. వారిలో ఎవరి వికెట్ తీసిన 240 పరుగులే ఛేదించాల్సి వచ్చేదని వెల్లడించాడు. కామెరాన్ గ్రీన్ బౌలింగ్, బ్యాటింగ్లో ప్రభావం చూపించాడని తెలిపాడు. ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవడంతో మంచే జరిగిందన్నాడు. కేరీతో కలిసి మాక్స్వెల్ తిరుగులేని భాగస్వామ్యం అందించాడని ప్రశంసించాడు. టీ20లకు మిచెల్ స్టార్క్ అందుబాటులో ఉంటాడని ధీమా వ్యక్తం చేశాడు.