
తాజా వార్తలు
ఫీల్డర్లు సహకరించకపోతే బౌలర్లు నొచ్చుకుంటారు
ఇంటర్నెట్డెస్క్: ఫీల్డర్లు సహకరించకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయని టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్సింగ్ అన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన తొలి వన్డేలో భారత్ అన్ని విభాగాల్లో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇండియా టుడే లైవ్లో మాట్లాడిన భజ్జీ.. భారత్ ఈ మ్యాచ్లో అక్కడక్కడా మెరిసిందని, పూర్తి స్థాయిలో రాణించలేకపోయిందని చెప్పాడు. శుక్రవారం పరిస్థితులు టీమ్ఇండియాకు అనుకూలంగా వెళ్లలేదని, ఆదివారం జరిగే రెండో వన్డేలో తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ విభాగం పూర్తిగా చేతులెత్తేసిందని తెలిపాడు. ఆటగాళ్లు పలు క్యాచ్లు వదిలేశారని, అంతర్జాతీయ క్రికెట్లో ప్రతీ క్యాచ్ ముఖ్యమేనన్నాడు.
‘అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆటగాళ్లు ప్రతీ క్యాచ్ అందుకోవాలనుకుంటారు. దురదృష్టం కొద్ది ఈ రోజు అలా జరగలేదు. టీమ్ఇండియా ఫీల్డర్లు పలు క్యాచ్లు వదిలేశారు. ఫీల్డర్లు బౌలర్లకు సహకరించకపోతే వాళ్లు నొచ్చుకుంటారు. ఈ రోజు మ్యాచ్లో అదే జరిగింది. షమీకి మినహా ప్రతీ బౌలర్కు ఇదో చేదు అనుభవం. ఈ పర్యటనలో ఇదే తొలి మ్యాచ్ అయినందున అక్కడి పరిస్థితులను అర్థం చేసుకొని బౌలింగ్ చేయాలి. బౌన్స్ను సరిగ్గా ఉపయోగించుకోవాలి. అయితే, ఆదిలోనే కొత్త బంతితో షార్ట్పిచ్ బంతులేసి కాస్త మంచి ప్రయత్నం చేశారు. కానీ వికెట్లు తీయలేకపోవడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. దాంతో టీమ్ఇండియాకు ఛేదన కష్టమైంది’ అని హర్భజన్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, టీమ్ఇండియా బౌలర్లలో షమి 59/3, జడేజా 63/0 పొదుపుగా బౌలింగ్ చేశారు. బుమ్రా, సైని, చాహల్ 73, 83, 86 పరుగులిచ్చి తలా ఓ వికెట్ పడగొట్టారు.