
తాజా వార్తలు
అసలు ఊహించలేదు..కలలా ఉంది: నటరాజన్
ఇంటర్నెట్డెస్క్: ఒకే పర్యటనలో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్గా టి. నటరాజన్ చరిత్ర సృష్టించాడు. అయితే అన్ని ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తానని అసలు ఊహించలేదని నట్టూ అంటున్నాడు. తొలి మ్యాచ్ ఎంతో ఒత్తిడిలో ఆడానని తెలిపాడు. నెట్బౌలర్గా తొలుత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన అతడు అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
‘‘వన్డేల్లో అవకాశం వస్తుందని అసలు ఊహించలేదు. జట్టులో ఉన్నానని చెప్పినప్పుడు ఒత్తిడికి లోనయ్యా, అలానే ఆడా. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. మొత్తంగా ఆడటమేగాక వికెట్లు సాధించా. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఇదంతా కలలా ఉంది. కోచ్, ఆటగాళ్లు ఎంతో మద్దతుగా నిలిచారు. స్ఫూర్తినిచ్చారు. చక్కని ప్రదర్శన చేశానంటే వాళ్లే కారణం. ఇక విరాట్ కోహ్లీ, అజింక్య రహానె ఎంతో ప్రోత్సహించారు. వాళ్ల సారథ్యంలో ఆడినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని నటరాజన్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేతో నటరాజన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్లో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. పది ఓవర్లు వేసిన అతడు 70 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అనంతరం పొట్టిఫార్మాట్లోనూ చోటు సంపాదించి భారత్ టీ20 సిరీస్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక సిరీస్లో ఆఖరిదైన గబ్బా టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు. మూడు వికెట్లతో సత్తాచాటాడు.
ఇదీ చదవండి
అది నా గొప్పతనం కాదు: ద్రవిడ్
పంత్ క్రీజులో ఉంటే బౌలర్లపైనే ఒత్తిడి: సుందర్