
తాజా వార్తలు
రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషభ్పంత్ను ఐసీసీ కొనియాడింది. అతడిని ‘స్పైడర్ పంత్’గా పేర్కొంటూ ట్వీట్ చేసింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన గబ్బా టెస్టులో పంత్(89; 138 బంతుల్లో 9x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్కు చిరస్మరణీయ విజయం అందించిన సంగతి తెలిసిందే. దీంతో టీమ్ఇండియా వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పంత్ అందరిచేతా ప్రశంసలు పొందుతున్నాడు.
ఇక సోమవారం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా కెప్టెన్ టిమ్పైన్(27) బ్యాటింగ్ చేస్తుండగా పంత్ కీపింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో టీమ్ఇండియా కీపర్ ‘స్పైడర్ మ్యాన్’ సినిమా లిరిక్ను పాడుకున్నాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో ఐసీసీ చూసినట్లు ఉంది. ఈ క్రమంలోనే గతరాత్రి పంత్ను ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేసింది. ‘స్పైడర్ మ్యాన్’ పోస్టర్కు పంత్ ఫొటో అంటించి.. స్పైడర్-పంత్, స్పైడర్-పంత్.. అని పేర్కొంటూ అదే సినిమా లిరిక్ను పంత్ మీద రాసుకొచ్చింది. ‘స్పైడర్ ఏం చేయగలదో పంత్ అది చేస్తాడు. సిక్సులు కొట్టగలడు, క్యాచ్లు పట్టగలడు. టీమ్ఇండియాను విజయ తీరాలకు చేర్చగలడు. ఇదిగో ఇతడే స్పైడర్ పంత్’ అని పాట రూపంలో పొగిడింది.
కాగా, పంత్ ఈ సిరీస్లో కీలక సందర్భాల్లో రాణించిన సంగతి తెలిసిందే. తొలుత సిడ్నీ టెస్టులో భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియాను తన దూకుడు బ్యాటింగ్తో విజయం వైపు నడిపించాడు. ఆ మ్యాచ్లో 97 పరుగులు చేసిన అతడు త్రుటిలో శతకం చేజార్చుకొని ఔటయ్యాడు. ఒకవేళ ఔటవ్వకుండా అలాగే బ్యాటింగ్ చేసి ఉంటే ఆ మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించే అవకాశం ఉండేది. ఇక గబ్బా టెస్టులో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్న వేళ పుజారా(56), వాషింగ్టన్ సుందర్(22)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే చివర్లో మరింత దూకుడుగా ఆడిన పంత్ భారత్కు అపురూప విజయం అందించాడు. దాంతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికవ్వడమే కాకుండా తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో కెరీర్లోనే అత్యుత్తమ 13వ ర్యాంక్ సాధించాడు.
ఇవీ చదవండి..
2-1 కాదు 2-0!
ఇక చాలు