
తాజా వార్తలు
గబ్బా టెస్టు: వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ నిలిచిపోయింది. రెండో సెషన్ పూర్తయ్యేసరికి భారత్ 62/2తో నిలవగా, ఛెతేశ్వర్ పుజారా(8), అజింక్య రహానె(2) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆదిలోనే శుభ్మన్ గిల్(7) వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్లో గిల్ స్మిత్ చేతికి చిక్కాడు. ఆపై రోహిత్(44; 74 బంతుల్లో 6x4), పుజారాతో కలిసి రెండో వికెట్కు 49 పరుగులు జోడించాడు. అయితే, అర్ధశతకానికి చేరువైన హిట్మ్యాన్ను లైయన్ బోల్తా కొట్టించాడు. ఊరించే బంతి వేయడంతో భారీ షాట్ ఆడేందుకు యత్నించి మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆపై రహానె క్రీజులోకి రాగా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. టీ విరామానికి భారత్ 62/2తో నిలిచింది. ఆపై వర్షం కురవడంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చదవండి..
రోహిత్ను సరదాగా ట్రోల్ చేసిన డీకే