
తాజా వార్తలు
శతకం చేశాక సెలబ్రేట్ చేసుకోను: లబుషేన్
ఇంటర్నెట్డెస్క్: బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆసక్తిగా సాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరుగుతున్న చివరిదైన నిర్ణయాత్మక టెస్టులో ఆస్ట్రేలియా తొలిరోజు ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టును వన్డౌన్ బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్(108; 204 బంతుల్లో 9x4) శతకంతో ఆదుకున్నాడు. 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును లబుషేన్.. స్మిత్(36), వేడ్(45)తో కలిసి పోరాటంలో నిలిపాడు. తొలుత స్మిత్తో మూడో వికెట్కు 70 పరుగులు జోడించిన అతడు తర్వాత వేడ్తో నాలుగో వికెట్కు 113 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే సెంచరీ చేశాక ధాటిగా ఆడే క్రమంలో అరంగేట్రం పేసర్ నటరాజన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
కాగా, సెంచరీ చేసినా.. తాను సెలబ్రేట్ చేసుకోనని లబుషేన్ మ్యాచ్ అనంతరం చెప్పాడు. ‘శతకం సాధించాక ఎగిరి గంతులేయకుండా ప్రశాంతంగా ఉండాలనే అనుకుంటా. పరిస్థితులను బట్టి ముందుకు సాగుతా. సెంచరీ కొడితే సెలబ్రేట్ చేసుకోను. అయితే, ఈరోజు మ్యాచ్లో 108 తర్వాత ఔటవ్వడం కాస్త నిరాశ పర్చింది. ఇక టిమ్పైన్, గ్రీన్ బాగా ఆడుతున్నారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి మేం కాస్త ఆధిపత్యంలో ఉన్నాము’ అని లబుషేన్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా, లబుషేన్ ఔటయ్యాక ఆస్ట్రేలియా మిడిల్ఆర్డర్ బ్యాట్స్మెన్ కామెరాన్ గ్రీన్(28*; 70 బంతుల్లో 3x4), టిమ్పైన్(38; 62 బంతుల్లో 5x4) జాగ్రత్తగా ఆడారు. భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్లు కాపాడుకున్నారు. మంచి బంతులను గౌరవిస్తూనే చెడ్డ బంతులను బౌండరీకి తరలించారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 87 ఓవర్లలో 274/5 స్కోర్ సాధించింది.
ఇవీ చదవండి..
తొలి రోజు ఆస్ట్రేలియా 274/5
60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..