
తాజా వార్తలు
వాళ్లనెవరూ అడగరు.. స్పిన్నర్ల విషయంలోనే ఇలా!
ఓజా
ఇంటర్నెట్డెస్క్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల మొతేరా పిచ్పై అనేక విమర్శలు వస్తున్నాయి. టెస్టు మ్యాచ్కు ఇలాంటి పిచ్ ఉండకూడదని పలువురు మాజీలు సైతం అభిప్రాయపడ్డారు. స్పిన్కు అనుకూలించే పిచ్పై ఇరు జట్ల బ్యాట్స్మెన్ పరుగులు సాధించలేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే మొత్తం మ్యాచ్లో 30లో 28 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. దీంతో ఇక్కడ బ్యాట్స్మెన్ విఫలమయ్యారా? లేక స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. వీటికి దీటుగా బదులిచ్చాడు వెటరన్ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజా.
తాజాగా ఓ జాతీయ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ.. ఎవరైనా బాట్స్మెన్ ఒక ఇన్నింగ్స్లో 400 లేదా 300 పరుగులు సాధిస్తే ఎవరూ అడగరు అని ఓజా పేర్కొన్నాడు. ‘ఇది పోటీపడే వికెట్. బ్యాట్స్మెన్ బాగా ఆడాల్సింది. కానీ, స్పిన్నర్లు మంచి ప్రదర్శన చేసినప్పుడే ఇలా ఎందుకు అడుగుతారు? బ్యాట్స్మెన్ భారీ స్కోర్ సాధిస్తే ప్రపంచ రికార్డు నెలకొల్పాడని మెచ్చుకుంటారు. పేసర్లు వికెట్లు తీస్తే బంతిని బాగా స్వింగ్ చేశాడని ప్రశంసిస్తారు. అలాంటిది స్పిన్నర్ల విషయంలోనే పిచ్ ఎందుకిలా ప్రవర్తిస్తుంది? అంటూ ప్రశ్నలు వేస్తారు’ అని ఓజా అసహనం వ్యక్తం చేశాడు. కాగా, ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 7 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లాండ్ స్పిన్నర్లలో లీచ్ 4, రూట్ 5 వికెట్లు తీశారు.