
తాజా వార్తలు
అతడి స్థానంలో పంత్కు చోటు ఇవ్వండి
ఇంటర్నెట్డెస్క్: సుదీర్ఘ ఫార్మాట్లో సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా వికెట్కీపర్ రిషభ్ పంత్ను పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులోకి కూడా తీసుకురావాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో పంత్ను ఆడించాలని తెలిపాడు. లేదా సంజు శాంసన్కు బదులుగా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు. భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో పంత్ స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ వికెట్కీపర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
‘‘పంత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అతడిని పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులోనూ తీసుకురావాలి. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో పంత్ రెండు వీరోచిత ఇన్నింగ్స్లు ఆడాడు. కంగారూల గడ్డపై ఆడిన ఇన్నింగ్స్లు అంటే ప్రత్యేకంగా భావించాలి. పంత్కు బౌలింగ్ చేయాలంటే కాస్త శ్రమించాల్సి ఉంటుంది. అతడు వైవిధ్యమైన షాట్లు ఆడుతుంటాడు. అయితే శ్రేయస్ అయ్యర్ స్థానంలో అతడికి చోటు ఇవ్వాలి. లేదా సంజు శాంసన్కు బదులుగా ఆడించాలి. కాగా, ఆల్రౌండర్లను జట్టులోకి తీసుకువచ్చేలా టీమిండియా ప్రయత్నించాలి. అప్పుడు బౌలింగ్, బ్యాటింగ్లో మరింత బలం పెరుగుతుంది’’ అని హాగ్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో భారత్ ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టులు, అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
విరాట్ కోహ్లీ, అజింక్య రహానె కెప్టెన్సీ గురించి బ్రాడ్ హాగ్ మాట్లాడాడు. ‘‘కెప్టెన్గా రహానె ఆస్ట్రేలియాతో ఆఖరి మూడు టెస్టుల్లో సత్తాచాటాడు. అతడు ఎలాంటి ఆందోళన లేకుండా చాలా ప్రశాంతంగా జట్టును నడిపించాడు. జింక్స్ గొప్ప నాయకుడు. అయితే టీమిండియాకు కెప్టెన్గా కోహ్లీనే ఉండాలి. రహానె వైస్ కెప్టెన్గానే ఉండాలి. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉంటే మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడు. అతడిని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తే టీమ్ఇండియా సంస్కృతిని నాశనం చేసినట్టు అవుతుంది. అది కోహ్లీ బ్యాటింగ్ పైనా ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఇలా జరగాలని అతడు కోరుకోకపోవచ్చు. కానీ, అలా జరిగే అవకాశాల్ని కొట్టిపారేయలేం’’ తెలిపాడు. కోహ్లీ గైర్హాజరీలో రహానె ఆసీస్తో జరిగిన ఆఖరి మూడు టెస్టులకు కెప్టెన్సీ వహించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
అరంగేట్రం ఆటగాళ్లకు కొత్త కార్లు
రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్ చెప్పలేదు