
తాజా వార్తలు
స్టీవ్స్మిత్ను కావాలనే వదిలేసిన ఆర్సీబీ
ఎందుకో తెలుసా?
ఇంటర్నెట్డెస్క్: గతవారం జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ను దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ రూ.2.2 కోట్ల తక్కువ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వేలంలో అతడిపై తొలుత పాటపాడి తర్వాత తప్పుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందే నిర్ణయించుకుంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను ఆర్సీబీ జట్టు మంగళవారం ‘బోల్డ్ డైరీస్’ పేరిట ట్విటర్లో పంచుకుంది. తమ ప్రణాళికల్లో భాగంగా స్మిత్ను ఇతర జట్లు కొనుగోలు చేసేలా వ్యూహరచన చేసినట్లు అందులో వివరించింది.
ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ ప్రణాళిక ప్రకారం.. ఈ వేలంలో స్మిత్ను కొనుగోలు చేయాలనే ఆలోచనే ఆ జట్టుకు లేదు. ఎందుకంటే ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ బౌలింగ్ చేయలేడని హెసన్ పేర్కొన్నాడు. తాము కొనుగోలు చేసే ఆటగాడు బ్యాట్తోనే కాకుండా బంతితోనూ ఉపయోగపడాలని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ జట్టు.. స్టార్ ఆల్రౌండౌర్ అయిన గ్లెన్ మాక్స్వెల్ను రూ.14.25 కోట్ల అధిక ధరకు కొనుగోలు చేసింది. అయితే, స్మిత్ విషయంలో ఆదిలోనే పాట పాడి పక్కకు తప్పుకోవాలని హెసన్ వివరించాడు. ఒకవేళ చెన్నై ఆస్ట్రేలియా మాజీ సారథిని దక్కించుకుంటే అప్పుడు ఆర్సీబీ మాక్స్వెల్ను సొంతం చేసుకునే వీలుంటుందని అభిప్రాయపడ్డాడు.
ఈ వేలంలో తమకు చెన్నై జట్టు ఒక్కటే గట్టి పోటీ ఇస్తుందని ఆర్సీబీ డైరెక్టర్ సందేహం వెలిబుచ్చాడు. ఒకవేళ తామే స్మిత్ను కొనుగోలు చేయాల్సి వస్తే రూ.2 కోట్లతో నష్టపోయేది ఏమీ లేదని వివరించాడు. చివరికి స్మిత్ రూ.4 కోట్లకు మించి ధరపలకడని జోస్యం చెప్పాడు. కాగా, స్మిత్ గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడగా మెరుగైన ప్రదర్శన చేయలేదు. దీంతో అతడిని ఆ జట్టు వదిలేసింది. ఇక వేలంలో ఏ జట్టూ అతడిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. రూ.2 కోట్ల కనీస ధరతో వచ్చిన అతడిని దిల్లీ దక్కించుకుంది.