
తాజా వార్తలు
సచిన్ వదిలేశాడు.. ధోనీ అందిపుచ్చుకున్నాడు
మహీ సత్తాని ముందే పసిగట్టిన తెందూల్కర్
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ సత్తాని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ముందే పసిగట్టాడని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. భారత క్రికెట్లో ఆల్టైమ్ అత్యుత్తమ కెప్టెన్గా నిలిచిన ధోనీ తన సారథ్యంలో ఎన్నో ఘనతలు సాధించాడు. అయితే, అతడికి జట్టు పగ్గాలు అప్పగించడానికి ముందు అసలేం జరిగిందనే విషయాన్ని నాటి బీసీసీఐ అధ్యక్షుడు తాజాగా వెల్లడించారు.
2007 వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా ఘోర పరాభవం నేపథ్యంలో అప్పుడు కెప్టెన్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటాడని చెప్పాడని పవార్ గుర్తు చేసుకున్నారు. దాంతో సచిన్ను జట్టు పగ్గాలు చేపట్టమని అడిగితే.. అతడూ నిరాకరించాడని చెప్పారు. ఈ క్రమంలోనే తెందూల్కర్ మహీ పేరును తెరపైకి తెచ్చాడన్నారు. ఆదివారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన పవార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
‘2007లో టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నా. ద్రవిడ్ కెప్టెన్గా ఉన్నాడు. అతడు నా వద్దకు వచ్చి ఇకపై కెప్టెన్సీ చేయనని అన్నాడు. అది అతడి బ్యాటింగ్ ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని చెప్పాడు. కెప్టెన్సీ నుంచి తొలగించాలని కోరాడు. దాంతో నేను సచిన్ను జట్టును నడిపించమని కోరాను. కానీ అతడు కూడా నిరాకరించాడు. మీరిద్దరూ ఇలా తప్పుకుంటే మనం ముందుకెలా వెళతాం అని సచిన్ను అడిగాను. అప్పుడు టీమ్ఇండియాను నడిపించడానికి ఒక యువకుడు ఉన్నాడని మాస్టర్ బ్లాస్టర్ చెప్పాడు. అతడి పేరే మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు’. అలా మహీకి జట్టు పగ్గాలు అప్పగించినట్లు పవార్ గుర్తు చేసుకున్నారు.