ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అతి పెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్ షో (సీఈఎస్) 2021 ఎప్పటిలానే సరికొత్త ఆవిష్కరణలతో సందర్శకులను అలరిస్తూనే ఉంది. తొలి రోజు ప్రదర్శనలో భాగంగా రోలింగ్ డిస్ప్లే, 3డీ ఫింగర్ ప్రింట్ స్కానర్, సూపర్ఫిన్ ప్రాసెసర్, ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓఎల్ఈడీ స్క్రీన్, స్మార్ట్ గ్లాసెస్, తర్వాతి తరం ల్యాప్టాప్లు వంటి వాటిని ఆవిష్కరించారు. అలానే త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్న మరికొన్ని ఉత్పత్తులను రెండో రోజు ఆవిష్కరించారు. మరి అవేంటో చూద్దామా..
ఆసుస్ ఆర్ఓజీ ల్యాప్టాప్
ఆసుస్ కంపెనీ ఆర్ఓజీ సిరీస్లో మూడు కొత్త గేమింగ్ ల్యాప్టాప్లను విడుదల చేసింది. ఆర్ఓజీ ఫ్లో ఎక్స్13, ఆర్ఓజీ జెఫిరస్ డ్యూయో 15 ఎస్ఈ, ఆర్ఓజీ స్ట్రిక్స్ స్కార్ 17 పేరుతో వీటిని తీసుకొచ్చారు. ఆర్ఓజీ ఫ్లో ఎక్స్13 మోడల్ డిస్ప్లేని 360-డిగ్రీల కోణంలో తిప్పుకోవచ్చు. ఆర్ఓజీ ఫ్లో ఎక్స్13 ల్యాప్టాప్లో ఏఎమ్డీ రైజెన్ 9 5980హెచ్ఎస్ ప్రాసెసర్ను ఉపయోగించారు. ఇక ఆర్ఓజీ జెఫిరస్ డ్యూయో 15 ఎస్ఈ మోడల్లో ఆర్ఓజీ స్క్రీన్ పాడ్, ఏఎమ్డీ రైజెన్ 9 5900హెచ్ఎక్స్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇక ఆర్ఓజీ స్ట్రిక్స్ స్కార్ 17 మోడల్లో 360హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో 17-అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారు. ప్రపంచంలోనే వేగవంతమైన ల్యాప్టాప్ డిస్ప్లే ఇదేనని ఆసుస్ తెలిపింది. ఏఎమ్డీ రైజెన్ 9 5900హెచ్ఎక్స్ ప్రాసెసర్ను ఉపయోగించారు. 16జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ ఇస్తున్నారు.
లెనోవా థింక్బుక్ ల్యాప్టాప్
షోలో తొలి రోజు యోగా సిరీస్లో ల్యాప్టాప్లను విడుదల చేసిన లెనోవా..రెండో రోజు థింక్బుక్ సిరీస్లో నాలుగు ల్యాప్టాప్లను తీసుకొచ్చింది. థింక్బుక్ ప్లస్ జెన్ 2, థింక్బుక్ 13ఎక్స్, థింక్బుక్ 16పీ, థింక్బుక్ 14పీ పేరుతో తీసుకొస్తున్న ఈ ల్యాప్టాప్లలో 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. థింక్బుక్ ప్లస్ జెన్ 2 మోడల్లో 12-అంగుళాల ఈ-ఇంక్ టచ్ స్క్రీన్ ఇస్తున్నారు. ఈ ల్యాప్టాప్ బ్యాటరీ 15 నుంచి 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీనికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇవి ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభ ధర సుమారు రూ. 1,15,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.
రేజర్ స్మార్ట్మాస్క్
రేజర్ కంపెనీ ప్రాజెక్ట్ హేజిల్, ప్రాజెక్ట్ బ్రూక్లిన్ పేరుతో స్మార్ట్మాస్క్, గేమింగ్ కుర్చీని తీసుకొచ్చింది. ప్రాజెక్ట్ హేజిల్ స్మార్ట్మాస్క్ని గీతలు పడకుండా, నీటిలో తడిచినా పాడవకుండా ఉండేలా ప్రత్యే ప్లాస్టిక్తో తయారు చేశారు. మన హావభావాలు అవతలి వ్యక్తులకు తెలిసేలా పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఇందులో ఎన్ 95 ఫిల్టర్ కూడా ఉంది. మాస్క్ ధరించి ఉన్నప్పుడు వెలుతురులేని ప్రదేశాల్లోకి వెళ్లినా కాంతిని అందించేలా లోపలి భాగంలో ప్రత్యేక లైటింగ్ టెక్నాలజీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మనం మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా వినిపించేలా మాస్క్ లోపలి భాగంలో ఏఎమ్పీ టెక్నాలజీ సహాయంతో మైక్ ఇస్తున్నారు. మాస్క్తో పాటు ప్రత్యేక ఛార్జింగ్ కేస్ ఇస్తున్నారు. ఇది వైర్లెస్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో యూవీ స్టెరిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది.
ప్రాజెక్ట్ బ్రూక్లిన్ గేమింగ్ కుర్చీలో 60-డిగ్రీల రోలింగ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఇస్తున్నారు. దీన్ని అవసరమైనప్పుడు తెరిచి ఉపయోగించేలా డిజైన్ చేశారు. గేమింగ్ ప్రియులకు పూర్తి అనుకూలంగా ఉండేలా ఇందులో 4డీ ఆర్మ్ రెస్ట్ ఉంది. దీన్ని కాంపాక్ట్ టేబుల్, మౌన్, కీబోర్డ్లా మార్చుకోవచ్చు. గేమ్ ఆడేప్పుడు ప్రత్యేకమైన అనుభూతి కోసం క్రోమా లైటింట్, వైబ్రేషన్ ఫీచర్స్ ఉన్నాయి.
శాంసంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్
శాంసంగ్ కంపెనీ ఎక్సినోస్ 2100 మొబైల్ ప్రాసెసర్ను విడుదల చేసింది. 5జీ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులోని ట్రై-కోర్ ఎన్పీయూ ఆర్కిటెక్చర్ ఉంది. ఇది ప్రాసెసర్ ఏఐ సామర్థ్యాన్ని అందుకునేందుకు సహాయపడుతుంది. దీన్ని త్వరలో విడుదలకానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్21 మోడల్లో ఉపయోగించారు.
జీఎం ఎగిరే కారు
జనరల్ మోటార్స్ కాడిల్లాక్ వర్చువల్ టేకాఫ్ అండ్ లాండింగ్ (వీటీఓఎల్) ఎగిరే కారును ఆవిష్కరించింది. నగరాల్లో ఇంటి పై నుంచి గాల్లోకి ఎగిరేలా దీన్ని రూపొందించారు. ఇది గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 90కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉపయోగించారు.
ఏఎమ్డీ కొత్త ప్రాసెసర్
ప్రాసెసర్ తయారీ కంపెనీ ఏఎమ్డీ హెచ్, యూ సిరీస్లో మొబైల్ వెర్షన్ ప్రాసెసర్లను విడుదల చేసింది. వీటిలో 7ఎన్ఎమ్ జెన్3 టెక్నాలజీని ఉపయోగించారు. హెచ్ సిరీస్ రైజెన్ ప్రాసెసర్లు గేమింగ్, కంటెంట్ క్రియేటర్స్ కోసం రూపొందించారు. అలానే యూ సిరీస్ ప్రాసెసర్లు లైట్ గేమింగ్ ల్యాప్టాప్ల కోసం తీసుకొచ్చారు. ఇప్పటికే లెనోవా కంపెనీ రైజెన్ సిరీస్ ప్రాసెసర్తో ల్యాప్టాప్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
ఇవీ చదవండి..