రక్షణనిచ్చే రుచులు!

పండ్లంటే నోరూరించే రుచులు... పోషకాల ఖజానాలు...తక్షణ శక్తినిచ్చే పానీయాలు... అంతేకాదండోయ్‌! కాస్త వెరైటీగా తయారు చేస్తే...మండే ఎండల్లో మేనికి చల్లదనాన్నిస్తాయి...జబ్బుల నుంచి రక్షణనిచ్చే కవచాలుగా మారతాయి...వివిధ రకాల పండ్లతో ఆ లాభాలు పొందడం ఎలాగంటే...

Updated : 15 Jun 2021 12:40 IST

పండ్లంటే నోరూరించే రుచులు... పోషకాల ఖజానాలు...తక్షణ శక్తినిచ్చే పానీయాలు... అంతేకాదండోయ్‌! కాస్త వెరైటీగా తయారు చేస్తే...మండే ఎండల్లో మేనికి చల్లదనాన్నిస్తాయి...జబ్బుల నుంచి రక్షణనిచ్చే కవచాలుగా మారతాయి...వివిధ రకాల పండ్లతో ఆ లాభాలు పొందడం ఎలాగంటే...

మామిడి పండుతో..

కావాల్సినవి: మగ్గిన మామిడి పండు- ఒకటి, కొబ్బరినీళ్లు- కప్పు, తేనె- చెంచా, పుదీనా ఆకులు- నాలుగైదు.  
తయారీ: మామిడిపండు ముక్కలను మిక్సీలో వేసి, కాసిన్ని కొబ్బరినీళ్లు పోసి జ్యూస్‌ చేసుకోవాలి. దీన్ని గ్లాసులోకి తీసుకుని తేనె కలిపి పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకుంటే తియ్యతియ్యటి జ్యూస్‌ రెడీ.


ఆమ్‌ కా పన్నా..

కావాల్సినవి: మామిడికాయ- ఒకటి, బెల్లం- అర కప్పు, మిరియాలు- చెంచా, యాలకులు- నాలుగు, నల్లుప్పు- చెంచా, జీలకర్రపొడి- చెంచా, పుదీనా ఆకులు- గుప్పెడు, చల్లటి నీళ్లు- తగినన్ని.
తయారీ: మామిడి కాయను శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి ఐదారు కూతలు వచ్చేవరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి లోపలి గుజ్జును మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. (మామిడికాయలో విటమిన్‌-సి మెండుగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి పెంపులో తోడ్పడుతుంది.) ఇప్పుడు మరో గిన్నెను స్టవ్‌ మీద పెట్టి పొయ్యి వెలిగించాలి. కాసిన్ని నీళ్లు పోసి బెల్లం వేసి మెల్లగా కలపాలి. అర కప్పు మామిడికాయ గుజ్జుకు కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఆ ద్రవాన్ని వేరొక పాత్రలోకి వడకట్టాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్‌ పెట్టి అది వేడయ్యాక మామిడికాయ గుజ్జు వేసి కలపాలి. దీంట్లో బెల్లం నీళ్లు కలపాలి. ఇందులో కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి, యాలకులు, నల్లుప్పు వేసి గడ్డలు లేకుండా బాగా కలపాలి. దీన్ని సీసాలో నిల్వ చేసుకుని కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు.
డ్రింక్‌ తయారీ... గ్లాసు నీళ్లలో రెండు మూడు చెంచాల ఆమ్‌ కా పన్నా కలిపి పుదీనా వేసి తీసుకుంటే ‘ఆహా ఏం రుచి’ అని అనకుండా ఉండలేరు.


నిమ్మ, సబ్జా గింజలతో..

కావాల్సినవి: నిమ్మరసం- రెండు పెద్ద చెంచాలు, పుదీనా ఆకులు- నాలుగైదు, మిరియాల పొడి- పావు చెంచా, ఉప్పు- అరచెంచా, నీళ్లు- కప్పున్నర, సబ్జాగింజలు- రెండు చెంచాలు.
తయారీ: గిన్నెలో నీళ్లు తీసుకుని నిమ్మరసం, పుదీనా ఆకులు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి ఓసారి బ్లెండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు మరో గ్లాసులో నానబెట్టిన సబ్జాగింజలు వేసి తయారుచేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని పోయాలి. అంతే రుచికరమైన పుల్లపుల్లని, చల్లచల్లని నిమ్మరసం రెడీ.


ఫ్రూట్‌ మాక్‌టెయిల్‌...

కావాల్సినవి: అరకప్పు చొప్పున పైనాపిల్‌, పుచ్చకాయ, మామిడిపండు ముక్కలు, నీళ్లు -తగినన్ని, తేనె- రెండు చెంచాలు.
తయారీ: ఈ ముక్కలన్నింటినీ వేసి కొన్ని నీళ్లు పోసి బ్లెండ్‌ చేసుకుని జ్యూస్‌ను వడకట్టుకోవాలి. ఇందులో కాస్తంత తేనె కలిపి తాగితే చాలా బాగుంటుంది. ఈ పండ్లలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు ఆరోగ్యాన్నిస్తాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని