గరంగరం... సమోసా!

సమోసాలు తయారుచేసే మైదా పిండిలో ఉప్పు, వాము, నూనె/నెయ్యి, కాసిన్ని నీళ్లు కలిపి ఓ అరగంట పక్కన పెట్టాలి. ఈ పిండి కలిపే విధానం అన్ని సమోసాలకు ఒకే రకంగా ఉంటుంది. అలాగే సమోసాలను చుట్టే విధానం కూడా.

Updated : 25 Jul 2021 06:14 IST

చిరుజల్లులవేళ.. చల్లని సాయంత్రాలప్పుడు... గరంగరంగా ఆరగిస్తే స్వర్గం దిగి రావాల్సిందే! ఇదీ సమోసా మహిమ!! ఎప్పుడూ ఒకేతీరేనా? అంటే ఇలా వెరైటీగా ప్రయత్నించొచ్చు. పుట్టగొడుగులతో చేస్తే.. పొట్ట నిండాల్సిందే! చికెన్‌తో కలిపితే చిటికెలో ప్లేట్‌ ఖాళీ... కూరగాయలు కూరితే మనం ఆవురావురుమనాల్సిందే... రాగిపిండితో చేశారా? ఆ రుచికి సాగిలపడాల్సిందే.


ఆలూతో...

కావాల్సినవి: తరిగిన ఉల్లిపాయ- ఒకటి, తరిగిన పచ్చిమిర్చి- మూడు, అల్లం తరుగు- చెంచా, ఆలూ- ఆరు, బఠాణీలు- పావు కప్పు, జీలకర్ర- అర చెంచా, కాజూ- గుప్పెడు, కిస్‌మిస్‌- ఏడెనిమిది, గరంమసాలా, చాట్‌ మసాలా- చెంచా చొప్పున, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేయాలి. ఇందులోనే బఠాణీలను వేసి నాలుగైదు కూతలు వచ్చేవరకు ఉడికించాలి. ఇప్పుడు వీటిని చల్లార్చి పొట్టుతీసి మెదిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక జీలకర్ర, కాజూ, కిస్‌మిస్‌ వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు కూడా కలిపి మరికాసేపు వేయిస్తే సరి. ఉల్లిపాయలు కాస్త గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత ఉడికించిన ఆలూ, బఠాణీలు కూడా వేసి కలపాలి. దీంట్లో గరంమసాలా, చాట్‌ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే సమోసాలకు మసాలా కూర సిద్ధమైనట్లే. ఈ కూరను త్రికోణాకారంలో చుట్టుకున్న చపాతీలో పెట్టి అంచులు మూసేయాలి. వీటిని కాగే నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. గ్రీన్‌ చట్నీ, టొమాటో సాస్‌తో తీసుకుంటే బాగుంటాయి.


పుట్టగొడుగులతో...

కావాల్సినవి: మష్రూమ్‌ తరుగు- కప్పు, అల్లం తరుగు- చెంచా, తరిగిన పచ్చిమిరపకాయలు- మూడు, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా. జీలకర్ర పొడి, చాట్‌ మసాలా, నిమ్మరసం- చెంచా చొప్పున, నూనె- వేయించడానికి సరిపడా, ఉడికించిన బంగాళాదుంపలు- రెండు.

తయారీ: పొయ్యి మీద పాన్‌పెట్టి నూనె వేసి పచ్చిమిర్చి, అల్లం తరుగును వేయించుకోవాలి. దీంట్లోనే సన్నగా తరిగిన మష్రూమ్‌ను వేసి కాసేపు వేయించాలి. దీనికి ఉడికించిన ఆలూ, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా, కొద్దిగా నిమ్మరసం జత చేయాలి. చివరగా కొత్తిమీరను కూడా వేసి చక్కగా కలపాలి. దీన్ని చల్లార్చుకోవాలి.

పొడి పిండి చల్లుకుంటూ పూరీలా చేసుకోవాలి. దీన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక్కో ముక్కను తీసుకుని మష్రూమ్‌ ముద్దను పెట్టి సమోసాలా చేసుకోవాలి. దీన్ని కాగే నూనెలో వేస్తూ గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకు వేయించాలి.


చికెన్‌తో...

కావాల్సినవి: చికెన్‌ ముద్ద- 200 గ్రా., నూనె- మూడు చెంచాలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు- రెండు చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, పసుపు- పావు చెంచా, కారం- చెంచాన్నర, గరంమసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి- అరచెంచా చొప్పున, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- కాస్తంత, నిమ్మరసం- రెండు చెంచాలు.

తయారీ: పాన్‌లో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద జత చేయాలి. ఆ తర్వాత చికెన్‌ వేసి కలపాలి. దీంట్లో కారం, పసుపు, ధనియాల పొడి, గరంమసాలా, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. చికెన్‌ ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపేయాలి. ఈ మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి తీసుకుని చల్లార్చాలి. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకుని కోడిగుడ్డు ఆకారంలో కాస్త మందంగా పూరీలా చేసుకోవాలి. దీంట్లో చికెన్‌ మిశ్రమాన్ని కూర్చి సమోసాలా చేయాలి. ఇలా తయారుచేసి పెట్టుకున్న సమోసాలను వేడి నూనెలో మంటను మధ్యస్థంగా పెట్టి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని టొమాటో కెచప్‌తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.


చీజ్‌తో..

కావాల్సినవి: ఉడికించిన బంగాళాదుంపలు- రెండు, ఉడికించిన స్వీట్‌కార్న్‌- కప్పు, చీజ్‌ తురుము- 100 గ్రా., అల్లం తరుగు- చెంచా, తరిగిన పచ్చిమిర్చి- మూడు, కారం, జీలకర్రపొడి, చాట్‌ మసాలా- చెంచా చొప్పున, ఉప్పు- తగినంత, నిమ్మరసం- రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా.

తయారీ: పెద్ద గిన్నె తీసుకుని పై పదార్థాలన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమోసా ఆకారంలో చేసిన చపాతీలో పెట్టి అంచులు మూసేయాలి. దీన్ని వేడి వేడి నూనెలో మంటను మధ్యస్థంగా పెట్టి లోపలి పదార్థాలన్నీ ఉడికేలా వేయించుకోవాలి.


రాగిపిండితో...

కావాల్సినవి: రాగిపిండి- కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, ఉప్పు- తగినంత, జీలకర్ర- పావు చెంచా, అల్లం తరుగు, చింతపండు గుజ్జు - పెద్ద చెంచా చొప్పున, తరిగిన పచ్చిమిర్చి- రెండు, జీడిపప్పు, కిస్‌మిస్‌- ఏడెనిమిది చొప్పున, కీర ముక్కలు, బఠాణీ- అర కప్పు చొప్పున, పసుపు- చిటికెడు, బంగాళాదుంప- ఒకటి, నూనె- తగినంత, వాము- కొద్దిగా.

తయారీ: గిన్నెలో రాగిపిండి, ఉప్పు, వాము, నూనె వేసి చపాతీ పిండిలా కలపాలి. దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి డ్రైఫ్రూట్స్‌ను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరికాస్త నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పసుపు, ఉప్పు, వాము, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఉడికించిన బఠాణీ, ఆలూ ముక్కలు; కీర ముక్కలు, చింతపండు గుజ్జు వేసి మరికాసేపు వేయించాలి. చివరగా డ్రైఫ్రూట్స్‌ వేసి కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు రాగిపిండిని చపాతీలా చేసి డ్రైఫ్రూట్‌, ఆలూ మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసి చివర్లు మూసేయాలి. ఇలా చేసుకున్న సమోసాలను డీప్‌ ఫ్రై చేసుకుంటే సరి. అవెన్‌లోనూ బేక్‌ చేసుకోవచ్చు.


సూచన

సమోసాలు తయారుచేసే మైదా పిండిలో ఉప్పు, వాము, నూనె/నెయ్యి, కాసిన్ని నీళ్లు కలిపి ఓ అరగంట పక్కన పెట్టాలి. ఈ పిండి కలిపే విధానం అన్ని సమోసాలకు ఒకే రకంగా ఉంటుంది. అలాగే సమోసాలను చుట్టే విధానం కూడా. సమోసా చేసే పిండిని మొదట గుడ్డు ఆకారంలో చపాతీలా చేసుకోవాలి. దాన్ని రెండు సమాన భాగాలుగా కోయాలి. ఒక్కోభాగం అంచులను కలుపుతూ కోన్‌లా చేయాలి. ఇందులో మిశ్రమం పెట్టి పై అంచులను నీటితో తడుపుతూ మూసేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని