ఎంపీసీలోనే ఎదగాలంటే?

ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌తో పూర్తిచేసి అదే మార్గాన్ని కొనసాగించాలనుకునే వాళ్లకు ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి. వీటిల్లో సీట్లను ఇంటర్‌ స్థాయిలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లేదా వాటిలో కొన్ని సబ్జెక్టులను చదివిన వారికి మాత్రమే కేటాయిస్తారు.  ఇంజినీరింగ్‌ మొదలు ఆర్కిటెక్చర్‌ నుంచి సైన్స్‌, మ్యాథ్స్‌ల్లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల వరకూ ఉన్నత విద్యకు ఎన్నో రకాల అవకాశాలు ఈ అభ్యర్థులకు ఉన్నాయి. ఒక్క వైద్యవిద్య తప్ప మిగిలిన అన్ని కోర్సులనూ ఎంచుకునే అవకాశం ఇంటర్‌ ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు ఉంటుంది.

Published : 14 Apr 2020 01:48 IST

ఇంటర్‌ తర్వాత?

ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌తో పూర్తిచేసి అదే మార్గాన్ని కొనసాగించాలనుకునే వాళ్లకు ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి. వీటిల్లో సీట్లను ఇంటర్‌ స్థాయిలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లేదా వాటిలో కొన్ని సబ్జెక్టులను చదివిన వారికి మాత్రమే కేటాయిస్తారు.  ఇంజినీరింగ్‌ మొదలు ఆర్కిటెక్చర్‌ నుంచి సైన్స్‌, మ్యాథ్స్‌ల్లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల వరకూ ఉన్నత విద్యకు ఎన్నో రకాల అవకాశాలు ఈ అభ్యర్థులకు ఉన్నాయి.

ఒక్క వైద్యవిద్య తప్ప మిగిలిన అన్ని కోర్సులనూ ఎంచుకునే అవకాశం ఇంటర్‌ ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు ఉంటుంది. కానీ కొన్ని కోర్సులు ఎంపీసీ అభ్యర్థులకు మాత్రమే ప్రత్యేకం. అలాంటి వాటిపై అవగాహన పెంచుకుంటే తమ ఆసక్తి, వ్యక్తిగత అభిరుచులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తగిన మార్గాన్ని ఎంచుకునే వీలుంటుంది.


పదోతరగతి తర్వాత ఎంపీసీ తీసుకోవాలనుకునే విద్యార్థులూ ఈ కోర్సులపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా తగిన భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోడానికి వీలవుతుంది.


ఇంజినీరింగ్‌

ఎంపీసీ విద్యార్థుల్లో ఎక్కువమంది ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరిలో అధిక శాతం ఐఐటీల్లో బీటెక్‌ కోసం పోటీ పడుతున్నారు. తర్వాతి ప్రాధాన్యంలో బిర్లా సంస్థలు, ఐఐఎస్‌టీ, పాతతరం ఎన్‌ఐటీలు, ప్రైవేటు డీమ్డ్‌ వర్సిటీలు ఉంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు, పేరున్న ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరడానికి పోటీ ఉంటుంది. జేఈఈ స్కోరుతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని సంస్థలూ ప్రవేశం కల్పిస్తున్నాయి. ప్రాంగణ నియామకాల ద్వారా ఆకర్షణీయ వేతనాలతో అవకాశాలు లభించడంతో విద్యార్థులు బీటెక్‌ని తమ కెరియర్‌ను మలుపు తిప్పే కోర్సుగా విశ్వసిస్తున్నారు.

ఇండియన్‌ ఆర్మీ, నేవీలు 10+2 టెక్నికల్‌ ఎంట్రీ విధానంలో బీటెక్‌ విద్యను ఉచితంగా అందిస్తున్నాయి. కోర్సు పూర్తిచేసుకున్నవారికి లెఫ్టినెంట్‌, సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటున్నాయి. జేఈఈ స్కోర్‌, ఇంటర్‌ మార్కుల మెరిట్‌, ఇంటర్వ్యూలో ప్రతిభ ప్రాతిపదికన అవకాశం కల్పిస్తున్నాయి. ఏడాదికి రెండుసార్లు వీటిల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడతాయి. బీటెక్‌ అనంతరం ఎంఎస్‌ లేదా ఎంటెక్‌ ఆ తర్వాత పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు.గేట్‌, సీఎస్‌ఐఆర్‌ నెట్‌లతో బీటెక్‌ అర్హతతోనే స్ట్టైపెండ్‌ సదుపాయంతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ చేయడానికీ అవకాశం ఉంది. పరిశోధనల్లో పాలు పంచుకోవాలనుకునేవారు ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీకి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.


ఆర్కిటెక్చర్‌

ఇంజినీరింగ్‌లో ఒక ప్రత్యేక విభాగంగా దీన్ని చెప్పుకోవచ్చు. నిర్మాణాలు, కట్టడాల్లో సృజనాత్మకత చూపడానికి ఇష్టపడేవారు, డ్రాయింగ్‌ నైపుణ్యం ఉన్నవారు ఆర్కిటెక్చర్‌ వైపు అడుగులేయవచ్చు. జేఈఈలో మరో పేపర్‌ అదనంగా రాయడం వల్ల ఈ సీట్లకు పోటీ పడవచ్చు. అలాగే నాటాతోనూ దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఆర్కిటెక్చర్‌ చదువుల కోసం ప్రత్యేక సంస్థలూ వెలిశాయి. బీఆర్క్‌ తర్వాత ఎంఆర్క్‌ చదువుకోవచ్చు. అనంతరం పీహెచ్‌డీ పూర్తి చేసుకోవచ్చు.


ఫ్యాషన్‌ టెక్నాలజీ

నిఫ్ట్‌లతోపాటు చాలా సంస్థలు బీటెక్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సు అందిస్తున్నాయి. నిఫ్ట్‌లు నిర్వహించే ఉమ్మడి పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఫ్యాషన్‌ రంగంపై అవగాహన, ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులో చేరవచ్చు. వ్యవధి నాలుగేళ్లు. అనంతరం ఎంటెక్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సును ఎంచుకోవచ్చు. పీజీలో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. పీజీ తర్వాత పరిశోధనల దిశగా అడుగులేయవచ్చు.


ఇంటర్‌ తర్వాత ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులో చేరితే అయిదేళ్లలోనే పూర్తవుతుంది. కానీ విద్యార్థులు మాత్రం నాలుగేళ్ల బీటెక్‌ కోర్సులవైపే మొగ్గు చూపుతున్నారు. అందులోనూ కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌ బ్రాంచీలకే ప్రాధాన్యమిస్తున్నారు.


పైలట్‌

పైలట్‌ కావడమనేది ఎంతోమంది యువత కల. ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులు చదివినవారికే ఆ అవకాశం దక్కుతుంది. దేశంలో ఎన్నో ప్రైవేటు సంస్థలు పైలట్‌ కోర్సు అందిస్తున్నాయి. కానీ  ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించడం తప్పనిసరి. ఉచితంగా పైలట్‌ కోర్సు పూర్తిచేసుకునే అవకాశం యూపీఎస్సీ నిర్వహించే ఎన్‌డీఏ పరీక్షతో లభిస్తుంది. ఎంపికైనవారు ఒక వైపు బీటెక్‌ చదువుకుంటూనే పైలట్‌ శిక్షణ పొంది ఎయిర్‌ ఫోర్స్‌లో సేవలు అందించవచ్చు. ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడతాయి.


బీఎస్సీ

ఎంపీసీ విద్యార్థులు బీటెక్‌ తర్వాత బీఎస్సీ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లకు ఎక్కువమంది పోటీ పడుతున్నారు. బీఎస్సీలో డేటాసైన్స్‌లాంటి కాంబినేషన్లు ఎంచుకోవచ్చు. ఆనర్స్‌ కోర్సులూ చదువుకోవచ్చు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ అందించే మూడేళ్ల  బీస్టాట్‌, బీమ్యాథ్స్‌ కోర్సులకు గిరాకీ ఎక్కువ. చెన్నై మ్యాథమేటికల్‌  ఇన్‌స్టిట్యూట్‌ ఆనర్స్‌ విధానంలో బీఎస్సీ అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ బీఎస్సీ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ కోర్సులు అందిస్తోంది. ప్రవేశానికి ఏప్రిల్‌ 20లోగా దరఖాస్తు చేసుకోవాలి. బోధన, పరిశోధనల్లో రాణించడానికి ఈ సంస్థల కోర్సులు ఉపయోగపడతాయి.


బీఫార్మసీ

ఎంపీసీ విద్యార్థులు ఆసక్తి ఉంటే బీఫార్మసీ వైపు అడుగులేయవచ్చు. ఎంసెట్‌ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ వారికి చెరి సగం కేటాయించారు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. అనంతరం వివిధ స్పెషలైజేషన్లతో ఎంఫార్మసీని ఎంచుకోవచ్చు. నైపర్లు పీజీ కోర్సులకు ప్రసిద్ధ సంస్థలు. ఇంటర్‌ తర్వాత నేరుగా ఫార్మ్‌-డి కోర్సులోనూ చేరడానికి అవకాశం ఉంది. వ్యవధి ఆరేళ్లు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. వీరికి మందుల తయారీ, రిసెర్చ్‌ ల్యాబ్‌లు తదితరాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.


బీఎస్‌-ఎంఎస్‌

ఐఐఎస్సీ నాలుగేళ్ల బీఎస్‌ కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరినవారు ఆసక్తి ఉంటే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని ఎంఎస్‌ పట్టా పుచ్చుకోవచ్చు. ఇదే తరహాలో ఐఐఎస్‌ఈఆర్‌లు బీఎస్‌-ఎంఎస్‌ కోర్సులను అయిదేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించడానికి ఈ కోర్సులను రూపొందించారు. పరీక్షలో చూపిన ప్రతిభ, జేఈఈ స్కోర్‌తో ప్రవేశాలు లభిస్తాయి. కేవీపీవైకు ఎంపికైనవారు నేరుగా అర్హత సాధిస్తారు. ఈ సంస్థల విద్యార్థులకు ప్రతి నెలా స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు.


ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ

ప్రతి ఐఐటీలోనూ ఏదో ఒక ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సు ఉంది. ఈ సీట్లను జేఈఈ స్కోరుతో భర్తీ చేస్తారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందించే కోర్సుల్లో చేరడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. నెస్ట్‌తో నైసర్‌-భువనేశ్వర్‌, ముంబయి విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరడానికి అవకాశం లభిస్తుంది. ఇలా ప్రవేశం పొందినవారు ప్రతి నెలా స్ట్టైపెండ్‌ పొందవచ్చు. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలూ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు అందిస్తున్నాయి.


ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌

బోధనపై ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, మైసూరు ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎడ్‌ కోర్సును నాలుగేళ్ల వ్యవధితో, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సు ఆరేళ్ల వ్యవధితో అందిస్తోంది. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. అజీం ప్రేమ్‌ జీ విశ్వవిద్యాలయం ఫిజికల్‌ సైన్సెస్‌, మ్యాథమెటిక్స్‌ల్లో బీఎస్సీ బీఎడ్‌ కోర్సులు అందిస్తోంది. ప్రవేశాలకు ఏప్రిల్‌ 20లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. తేజ్‌పూర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ కోర్సులు అందిస్తోంది. ఇటీవలి కాలంలో ఏర్పడిన కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనూ బీఎస్సీ ఎడ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని