నేనే  శివుడు!

ఎవరు ‘నేను’?ఈ ప్రశ్న మనిషిని సాధకుడిని చేసింది. శోధకుడిని చేసింది. మహర్షిని చేసింది. మహోన్నతుడిని చేసింది. ‘నేను’ అనే పరమ సత్యాన్ని కనుక్కోవడమే సిసలైన జ్ఞానంగా చెబుతారు.నాకు జ్ఞానాన్నివ్వండి అని కోరిన భట్టపాదుడికి ఆదిశంకరులు అదే చెప్పారు.మనిషి సమగ్ర రూపాన్ని ఆవిష్కరించి జ్ఞానాన్ని ప్రసాదించారు.మోక్ష మార్గాన్ని చూపించిన ఆ జ్ఞాన సంపదేనిర్వాణ షట్కం....

Updated : 08 Jul 2021 19:08 IST

నిర్వాణ మార్గం

ఎవరు ‘నేను’?

ఈ ప్రశ్న మనిషిని

సాధకుడిని చేసింది. శోధకుడిని చేసింది.

మహర్షిని చేసింది. మహోన్నతుడిని చేసింది.

‘నేను’ అనే పరమ సత్యాన్ని కనుక్కోవడమే సిసలైన జ్ఞానంగా చెబుతారు.

నాకు జ్ఞానాన్నివ్వండి అని కోరిన భట్టపాదుడికి ఆదిశంకరులు అదే చెప్పారు.

మనిషి సమగ్ర రూపాన్ని ఆవిష్కరించి జ్ఞానాన్ని ప్రసాదించారు.

మోక్ష మార్గాన్ని చూపించిన ఆ జ్ఞాన సంపదే

నిర్వాణ షట్కం.

రుద్రపురం...

కాశీక్షేత్రానికి రెండు వందల మైళ్ల దూరంలో ఉన్న ఊరు.

పండితుడైన భట్టపాదుడు అగ్ని గుండాన్ని ఏర్పాటు చేసుకుని, దాని మధ్యలో కూర్చుని ఆత్మార్పణకు సిద్ధమయ్యాడు. మంటలు అలుముకుంటున్నాయి.

సరిగ్గా అదే సమయంలో అక్కడకు నవ యువకుడైన ఆది శంకరాచార్య ప్రవేశించారు. దీంతో అగ్ని మధ్యలో కూర్చుని కళ్లు మూసుకుని ఉన్న భట్ట పాదుడికి ఒక్కసారిగా శరీరమంతా చల్లనిగాలులు సోకాయి. శంకరులు వచ్చినట్లు గుర్తించిన భట్టపాదుడు ‘తండ్రీ వందనాలు... గురువుగారికి ద్రోహం చేసినందుకు ప్రాయశ్చిత్తంగా నేను ఈ పని చేస్తున్నాను. నన్ను అనుగ్రహించి, జ్ఞానాన్నివ్వండి’ అని వేడుకున్నాడు.

అంతే...

ఆదిశంకరుల నోటి నుంచి అద్భుతమైన ఆరు శ్లోకాలు వెలువడ్డాయి. సృష్టిలోని ప్రతిదాంట్లోనూ ఉన్న శివతత్త్వాన్ని ఆవిష్కరిస్తూ సాగే ఈ శ్లోకాల పరంపర నిర్వాణ షట్కంగా మారింది.

నిర్వాణం అంటే మోక్షం. ఆనందం, ప్రశాంతత, స్వేచ్ఛ మిళితమైన సచ్చిదానంద స్థితి. అన్ని విషయాల్లో సంపూర్ణ సమదృష్టి కలిగి ఉండడం. ఈ విషయాన్ని షట్‌ అంటే ఆరు శ్లోకాల్లో వివరించారు. అదే నిర్వాణ షట్కమైంది. అద్భుతమైన ఆత్మావిష్కరణ కూడా ఇందులో ఉండడం వల్ల దీన్ని ఆత్మషట్కం అని కూడా అంటారు. నీలో సచ్చిదానందం ఉంది. అందుకే నువ్వు సాక్షాత్తు శివుడివి అని ఆయన వెల్లడిస్తారు. ఉన్నదంతా ఆనందమే అని వివరిస్తూ, వైరాగ్యభావాన్ని బోధిస్తూ శంకరులవారి స్తోత్ర రచన సాగింది.

జగద్గురువు ఆదిశంకరులు అనేక స్తోత్రాలను రచించి జాతికి అందించారు. వాటిద్వారా జీవనమార్గాన్ని నిర్దేశించారు. ఆయన రచనలను రెండుగా విభజించవచ్ఛు మొదటిది భక్తి సాహిత్యం. రెండోది వైరాగ్య ప్రకరణం. నిర్వాణషట్కం రెండో రకం రచనగా చెప్పొచ్ఛు నిజానికి నిర్వాణం పేరుతో శంకరాచార్యులు మూడు స్తోత్రాలను రచించారు.

భట్టపాదుడు ఆత్మార్పణ చేస్తూ మోక్షం ప్రసాదించమని కోరినప్పుడు నిర్వాణషట్కం చెప్పారు. హిమాలయ పర్వత ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు గోవింద భగవత్పాదులు ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించినప్పుడు శంకరుల నోట నిర్వాణ మంజరి జాలువారింది. ఆంధ్రదేశంలోని మోపిదేవి సందర్శించినప్పుడు నిర్వాణ దశకం చెప్పినట్లు ఉంది.

‘మనోబుధ్యహంకార చిత్తాని నాహం

న శ్రోతం న జిహ్వానిచఘ్రాణ నేత్రే!

నచవ్యోమ భూమి ర్న తేజో న వాయు

శ్చిదానంద రూప శివోహం శివోహం!’

అంతఃకరణ చతుష్టయాలైన మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం నేను కాదు. నాలుక, ముక్కు, చర్మం, కళ్లు, చెవులు కూడా కాదు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అంతకన్నా కాదు... నేను చిదానందరూపుడైన శివుడిని.

‘న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయు

ర్నవా సప్తధాతు ర్నవా పంచకోశః

న వాక్పాణిపాదౌ న చోపస్థ పాయీ

చిదానందరూప శివోహం శివోహం!’

నేను ప్రాణాన్ని కాదు, పంచవాయువులనూ కాదు. రక్తం, మాంసం, మేధస్సు వంటి సప్త ధాతువులనూ కాదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని చెప్పే పంచ కోశాలూ నేను కాదు. వాక్కు కాదు, కాళ్లు, చేతులూ కాదు, నేను చిదానంద రూపుడైన శివుడిని.

‘న మే ద్వేషరాగౌ నమే లోభమోహే

మదోనైవ మే నైవ మాత్సర్యభావః

న ధర్మో నచార్థో న కామో నమోక్ష

చిదానంద రూప శివోహం శివోహం’

నాకు రాగద్వేషాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు, ధర్మార్థ కామమోక్షాలు లేవు. ఎందుకంటే నేను చిదానంద రూపుడను. కష్టసుఖాలన్నీ నాకు సమానమే అనే భావాన్ని పెంపొందింపజేసుకుంటే స్థితప్రజ్ఞుడిగా మనిషి మారతాడు ఆ స్థితిలో మనిషి సాక్షాత్తు శివుడే అని ఈ శ్లోకం వివరిస్తుంది.

‘న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం

న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః

అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా

చిదానందరూప శివోహం శిహోహం’

నాకు పాపపుణ్యాలు లేవు. సుఖదుఃఖాలు లేవు. మంత్రజపాలు, తీర్థసేవలు, వేదయజ్ఞాలు లేవు. భోజన పదార్థాలు, భోజనం, భోక్త నేను కాదు. చిదానంద రూపుడైన శివుణ్ణి నేను.

‘న మృత్యుర్న శం కా నమే జాతిభేదః

పితానైవ మేనైవ మాతా చ జన్మః

న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్య

చిదానంద రూపా శివోహం శివోహం!

నాకు మృత్యువు, భయం, జాతి భేదాలు లేవు. తల్లిదండ్రులు లేరు. జన్మలేదు. నాకు బంధువులు లేరు. మిత్రులు లేరు. గురువు లేడు. శిష్యులు లేరు. అంటూ అన్ని బంధాలకు, బంధుత్వాలకు అతీతంగా ఉండడం చిదానందానికి కారణమవుతుందని వివరిస్తారు శంకరులు.

‘అహం నిర్వికల్పో నిరాకారరూపో

విభూత్వచ్ఛ సర్వత్ర సర్వేన్ద్రియాణామ్‌

న చో సంగతం దైవ ముక్తిర్నమే య

చిదానందరూపా శివోహం శివోహం

నేను నిర్వికల్పుడను, సర్వాంతర్యామియైన నిరాకారుడను. సర్వేంద్రియాలతో నాకు ఎప్పుడూ సంబంధం లేదు. నాకు మోక్ష బంధాలు లేవు. అందుకే నేను చిదానందరూపుడైన శివుణ్ణి అంటూ ఆది శంకరులు నిర్వాణ షట్కాన్ని ముగిస్తారు. అంటే ఉన్నదంతా ‘నేనే’... అంటూ మనిషిలోని దైవాన్ని గురించి వివరిస్తారు.

- ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని