జగమేలు స్వామికిదే నీరాజనం!

షోడశోపచార పూజల్లో నీరాజనం ఒకటి. దీనికే హారతి అని పేరు. తిరుమలలో నిత్య కల్యాణ చక్రవర్తి అయిన శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంతసేవ వరకు పలుమార్లు నీరాజనాలను ఇస్తారు. మిగతా ఆలయాల్లోలాగా వీటిని భక్తులందరూ చూసే భాగ్యం ఉండదు...

Published : 10 Oct 2019 00:36 IST

షోడశోపచార పూజల్లో నీరాజనం ఒకటి. దీనికే హారతి అని పేరు. తిరుమలలో నిత్య కల్యాణ చక్రవర్తి అయిన శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంతసేవ వరకు పలుమార్లు నీరాజనాలను ఇస్తారు. మిగతా ఆలయాల్లోలాగా వీటిని భక్తులందరూ చూసే భాగ్యం ఉండదు.  శ్రీఆయా సేవల్లో పాల్గొనే భక్తులకు మాత్రమే వీటిని దర్శించుకునే అవకాశం ఉంది.
నవనీత హారతి: స్వామివారికి ఇచ్చే హారతులు నవనీత హారతితో ప్రారంభమవుతాయి. సుప్రభాత సమయంలో ఈ హారతినిస్తారు. శ్రీవారు స్వయంగా తన భక్తుడైన హథీరాం బావాజీతో పాచికలాడినట్లు చెబుతారు. ఆయన భక్తిని నిదర్శనంగా స్వీకరించేదే ఈ హారతి. తిరుమలలోని హాథీరాంజీ మఠం నుంచి ఒకరు అప్పుడే తీసిన వెన్న, పచ్చకర్పూరం, ఆవుపాలను తీసుకొచ్చి ఆలయ అర్చకులకు అందిస్తారు. సుప్రభాతం చివర్లో మహంతు మఠం నుంచి వచ్చిన ఆవుపాలను నివేదించి... హారతిని ఇస్తారు. దీనికి నవనీత హారతి అని పేరు.
నక్షత్ర హారతి: రోజూ సుప్రభాత సేవ, తోమాల సేవ ముగిసిన వెంటనే సహస్రనామార్చన జరుగుతుంది. శ్రీ వేంకటాచల మహాత్మ్యంలోని సహస్రనామాలు పఠిస్తూ తులసి దళాలతో స్వామిని అర్చిస్తారు. అది పూర్తవగానే ఇచ్చే హారతిని నక్షత్ర హారతి అంటారు. నేతితో అద్దిన 27 వత్తులను నక్షత్రంలా ఉండే హారతి సెమ్మెలో వుంచి వాటిని వెలిగించి హారతి ఇస్తారు.

పచ్చ కర్పూర హారతి: ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం అనంతరం పచ్చకర్పూర హారతి ఉంటుంది. పట్టువస్త్రం, ఆభరణాలు, పుష్పమాలలను అలంకరించిన తరువాత ఈ హారతినిస్తారు. స్వామికి రోజూ తెల్లవారుజామున మొదలు రాత్రి వరకు జరిగే ప్రతి సేవకు చివర మూలమూర్తికి కర్పూర హారతినివ్వడం సంప్రదాయం.
ముత్యాల హారతి: రోజూ రాత్రి ఏకాంత సేవ సమయంలో ముత్యాల హారతినిస్తారు. దీన్ని తరిగొండ వేంగమాంబ ముత్యాల హారతి అని పిలుస్తారు. దీనికో కథ ఉంది. ఓసారి వేంగమాంబను ఆలయంలోకి రానివ్వకుండా ఆలయ అర్చకులు అడ్డుకున్నారు. రథోత్సవం సమయంలో వేంగమాంబ ఇంటి దగ్గరకు వచ్చి రథం నిలిచిపోయింది. వేంగమాంబ ఇంటి బయటకు వచ్చి హారతి ఇచ్చాకే ముందుకు కదిలిందని చెబుతారు. అప్పటి నుంచి రాత్రి ఏకాంత సమయంలో ఇచ్చే హారతిని ఆమె పేరుమీద ఇస్తున్నారు.
- ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు