గోదారి తీరాననరహరి రూపాన!

వశిష్ఠ గలగలలు... సాగరం సవ్వళ్లు...  వాటిని మరిపించేలా గోవింద నామస్మరణ. ఇది ప్రఖ్యాత నృసింహక్షేత్రం అంతర్వేది వైభవం. దేవదేవుడి కల్యాణోత్సవానికి  సర్వం సిద్ధమైన తరుణాన తూర్పుగోదావరి జిల్లాలోని ఈ క్షేత్రం వేలాది మంది భక్తులతో ఇల వైకుంఠంగా

Published : 18 Feb 2021 00:29 IST

ఈ నెల 19 నుంచి అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవాలు

వశిష్ఠ గలగలలు... సాగరం సవ్వళ్లు...  వాటిని మరిపించేలా గోవింద నామస్మరణ. ఇది ప్రఖ్యాత నృసింహక్షేత్రం అంతర్వేది వైభవం. దేవదేవుడి కల్యాణోత్సవానికి  సర్వం సిద్ధమైన తరుణాన తూర్పుగోదావరి జిల్లాలోని ఈ క్షేత్రం వేలాది మంది భక్తులతో ఇల వైకుంఠంగా మారనుంది.
స్తంభంలో నుంచి ఆవిర్భవించి ప్రహ్లాదుని రక్షించినా...

శ్రీశైల మహారణ్యంలో సింహగర్జనలు చేస్తూ ఆదిశంకరులను కాపాడినా.. సర్వకాలసర్వావస్థల్లోనూ నరహరి భక్తులవెంట తానున్నానని చాటుతూనే ఉన్నారు.
నృసింహుడు వెలసిన ప్రఖ్యాత క్షేత్రాల్లో అంతర్వేది ఒకటి. నిత్య హోమాలు, ఆధ్యాత్మిక పరిమళాల మధ్య స్వామివారి వైభవం అనిర్వచనీయంగా ఉంటుంది. ప్రస్తుతం అంతర్వేది ఆలయం ఉన్న ప్రాంతంలో బ్రహ్మ యజ్ఞం చేశాడని చెబుతారు.  అఖండ గోదావరి నుంచి ఓ పాయను తెచ్చి సాగరంలో కలిపిన వశిష్ఠ మహర్షి ఇక్కడ తపస్సు చేస్తుండగా హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవిలోచనుడు వశిష్ఠుని సంతానాన్ని నాశనం చేశాడని, మహర్షి ప్రార్థనతో ప్రత్యక్షమైన నారసింహుడు రాక్షస సంహారం చేశాడని స్థలపురాణం చెబుతోంది.. వశిష్ఠుడి అభ్యర్థన మేరకు లక్ష్మీనృసింహస్వామిగా ఇక్కడ వెలిశాడని అంటారు.. స్వామి ఇక్కడ పశ్చిమాభిముఖుడై ఉంటారు. ఇక్కడికి సమీపంలోని కేశవదాసుపాలేనికి చెందిన మందపాటి కేశవదాసు అనే యాదవుడు కర్రలతో పందిరిని నిర్మించాడు. కొంతకాలానికి సప్తసాగర యాత్రకొచ్చిన రెడ్డిరాజులు చెక్కతో ఆలయాన్ని నిర్మించారు. క్రీ.శ.1823లో ఓడలరేవుకు చెందిన కొపనాతి కృష్ణమ్మ ఇప్పుడున్న ఆలయాన్ని  నిర్మించినట్లు శాసనాల్లో ఉంది. పెద్దాపురం సంస్థానాదీశులు, మొగల్తూరు రాజవంశీయులు ఆలయాన్ని పరిరక్షించారు. ఏటా మాఘ మాసంలో స్వామివారి దివ్య కల్యాణోత్సవాలు జరగుతాయి. ఆగమోక్తంగా పది రోజుల పాటు జరిగే పరిణయోత్సవాలు నేత్రపర్వం కలిగిస్తాయి.  
* కల్యాణోత్సవాల అంకురార్పణలో భాగంగా తొమ్మిది పాళికల్లో నవధాన్యాలు పోసి అవి బాగా చిగురించాలని మంత్రోచ్ఛరణతో పూజలు చేస్తారు. అదే రోజు ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద గరుడపటాన్ని ఆవిష్కరించి సకల దేవతాగణాన్ని కల్యాణానికి ఆహ్వానం పలుకుతారు.
* నాలుగో రోజు దశమినాటి రాత్రి ఆరుద్ర నక్షత్ర యుక్త తులా లగ్న పుష్కరాంశలో స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆలయానికి ఎదురుగా ఉండే వేదికపై ఈ క్రతువును నిర్వహిస్తారు.
* ఏడో రోజు పండిత సదస్యం అనంతరం రాత్రి స్వామివారిని అశ్వవాహనంపై ఊరేగిస్తారు.  16 కాళ్ల మంపడంలో అర్చకులు, పేరూరు బ్రాహ్మణులకు మధ్య చోర సంవాద ఘట్టం జరుగుతుంది.
* ఆలయంలోని సుదర్శన పెరుమాళ్‌ విగ్రహం ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. 15 చేతులు, 16 ఆయుధాలతో చుట్టూ జ్వాలలు, వెనుక సుదర్శన యంత్రం, కింద గురుడ వాహనంతో ఉన్న దీనిని బలిబేరంగా సంబోధిస్తారు. కల్యాణోత్సవాల్లో సాగర జలాల్లో స్వామివారికి ఏటా సుదర్శన పెరుమాళ్‌కు చక్రస్నానోత్సవాన్ని నిర్వహిస్తారు.తొమ్మిదో రోజు మాఘ పౌర్ణమినాడు ఈ కార్యక్రమం జరుగుతుంది.

* కల్యాణం జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం దివ్య రథ యాత్ర జరుగుతుంది. స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి దిక్కులన్నీ పిక్కటిల్లేలా భక్తులంతా గోవింద నామస్మరణలు చేస్తుండగా రథాన్ని ముందుకు కదుపుతారు. రథం స్వామివారి సోదరి అయిన గుర్రాలక్కమ్మ ఆలయం చెంతకు చేరుతుంది. ఆమెకు చీర, సారె సమర్పించే ఘట్టాన్ని మంత్రోచ్చారణలతో నిర్వహిస్తారు

- కడియం త్రినాథస్వామి, చింతా నరసింహస్వామి, అంతర్వేది


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని