అంతా మన ఎంపికే!

ఒక రోజు ఆది శంకరాచార్యులు శిష్యులతో కలిసి వెళ్తుంటే, ఒక వ్యక్తి ఆవును తాడుతో లాగటం తారసపడింది. శంకరులు తన శిష్యులతో, ‘ఆవు ఆ మనిషికి కట్టుబడి ఉందా. లేదంటే, మనిషి ఆవుకు కట్టుబడి

Published : 17 Jun 2021 00:37 IST

గురుబోధ

ఒక రోజు ఆది శంకరాచార్యులు శిష్యులతో కలిసి వెళ్తుంటే, ఒక వ్యక్తి ఆవును తాడుతో లాగటం తారసపడింది. శంకరులు తన శిష్యులతో, ‘ఆవు ఆ మనిషికి కట్టుబడి ఉందా. లేదంటే, మనిషి ఆవుకు కట్టుబడి ఉన్నాడా?’ అని అడిగారు.
శిష్యులు ఏమాత్రం సంకోచించకుండా ‘గురువర్యా! తప్పకుండా ఆవే మనిషికి కట్టుబడి ఉంది. మనిషి తాడు పట్టుకొని ఉన్నాడు. ఆవు ఎక్కడికి వెళ్లినా అతణ్ని అనుసరించాలి. మనిషి యజమాని, ఆవు బానిస’ అని చెప్పారు. ‘ఇప్పుడు చూడండి’ అని శంకరాచార్యులు ఆ తాడును కత్తిరించారు. వెంటనే ఆవు పారిపోయింది. యజమాని దాని వెంట పరుగుపెట్టాడు.
అప్పుడు శంకరులు ‘శిష్యులారా! ఆవుకు తన యజమాని పట్ల అస్సలు ఆసక్తి లేదు. నిజానికీ ఆవు ఆ మనిషి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తోంది. మన మనసు విషయంలో కూడా అదే జరుగుతుంది. మనసు దానంతట అదే చెడు ఆలోచనల మీద ఆసక్తి చూపదు. మనమే చెడు ఆలోచనలతో దాన్ని నింపుతున్నాం. వాటికి బదులు మంచి ఆలోచనలకి మనసులో స్థానం ఇవ్వాలి. అప్పుడు చెడు ఆలోచనలు ఆ ఆవులాగే వెళ్లిపోతాయి. స్వేచ్ఛ, సంతోషం మన ఎంపికే’ అని బోధించారు శంకరులు.

- మనీష బొమ్మరాసిపేట


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని