నేనూ కృషీవలుణ్నే!

బుద్ధుడు కపిలవస్తులో బస చేసి ఉన్నాడు. వ్యవసాయం చేసుకునే ఒక పండితుడు ఆయన దగ్గరికి వెళ్లి, ‘స్వామీ! మీరూ మాలాగా

Published : 24 Jun 2021 01:28 IST

బుద్ధం శరణం..

బుద్ధుడు కపిలవస్తులో బస చేసి ఉన్నాడు. వ్యవసాయం చేసుకునే ఒక పండితుడు ఆయన దగ్గరికి వెళ్లి, ‘స్వామీ! మీరూ మాలాగా పంటలు పండించి ఆ ఫలాల్ని మీరనుభవించి నలుగురికీ పంచిపెట్టవచ్చు కదా. సోమరిగా, పరాన్నభుక్కులా ఎందుకు జీవిస్తున్నారు?’ అని అడిగాడు. దానికి బుద్ధుడు ప్రసన్న దరహాసంతో ‘పండితోత్తమా! నేనూ కృషీవలుణ్నే. ధర్మక్షేత్రమే నా వ్యవసాయ భూమి! దాన్ని జ్ఞానమనే నాగలితో దున్నుతాను. శ్రద్ధ, పవిత్రత అనే విత్తనాలు చల్లుతాను. అనవసరపు కోరికలు అనే కలుపుమొక్కలు పీకిపారేస్తాను. మంచి కర్మలు అనే వర్షపు నీటితో అన్ని దుఃఖాల్ని హరించే నిర్వాణ ఫలాల్ని పండిస్తున్నాను. ఇది చాలదంటావా? మనిషి అన్ని దుఃఖాలకు కారణం కోరికలు, ఆశలు. వాటి నుంచి బయటపడకుంటే మనశ్శాంతి ఉంటుందా? అందుకే, మానవ హృదయ క్షేత్రంలో రాగ, ద్వేష, మోహాల్ని, తృష్ణల్ని నశింపజేసే కృషి చేస్తున్నాను’ అన్నాడు బుద్ధుడు. ఆ మాటలతో తథాగతుడి పట్ల పండితుడికి వ్యతిరేకత మాయమయ్యింది. వెంటనే ఆయన అనుయాయిగా మారిపోయాడు.

- ఎం.మయూఖ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని